ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి : సీఎం చంద్రబాబు
Publish Date:Apr 15, 2026
Advertisement
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ధరణికోటలో ఏర్పాటు చేసిన రూరల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకముందు క్యాంటీన్కు వచ్చిన పేదలు, కార్మికులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. లబ్దిదారులతో ముచ్చటిస్తూ అన్న క్యాంటీన్లోనే సీఎం ఆహారాన్ని తీసుకున్నారు. అన్న క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం రుచి, శుభ్రత, నాణ్యతల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి నేను నమ్ముతాను. అందుకే పేదవాడి ఆకలికి తీర్చడానికి ప్రజాప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా రాజకీయం అని ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారు. నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు అజరామరం. ఆకలి అన్న వాళ్ల కాదనకుండా అన్నం పెట్టడం మన సంస్కృతిలోనే ఉంది. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతంలోనే ఉంది. నాటి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 2024లో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఇవాల్టి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగింది. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని" సీఎం స్పష్టం చేశారు. అక్షయ పాత్రకు అభినందనలు "అన్న క్యాంటీన్లకు నిరంతరం ఆహార సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ను అభినందిస్తున్నాను. 25 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ 500 కోట్ల భోజనాలను సరఫరా చేసింది. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్న భోజనం పేద వాళ్లు, ఆటోడ్రైవర్లు, ముఠా కార్మికులు, కూలీలకు ఆసరాగా నిలుస్తోంది. పేదవాళ్లకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో బయట హోటల్లో తినడం ఆర్ధికంగా ఎంత భారమో నాకు తెలుసు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో వారి డబ్బు ఆదా అయ్యి ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. అన్నక్యాంటీన్లలో సరఫరా చేసే భోజనానికి రుచి, శుభ్రత, నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం. ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి భోజనాలతో మూడు పూటలా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించాం. ఒక్కో అన్నా క్యాంటీన్లో రోజుకు సగటున 1,013 మంది ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీని నిర్వహణ కోసం రూ.26,250 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన 62 గ్రామీణ అన్న కాంటీన్లలో ఆహార సబ్సిడీకి రోజుకు మరో రూ.18 లక్షలు, ఏడాదికి రూ.58 కోట్లు అవుతుంది. కొత్త క్యాంటీన్ల నిర్మాణానికి రూ.43 కోట్ల వ్యయం అయ్యింది. గడచిన 21 నెలల్లో అన్నక్యాంటీన్లలో 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఇప్పటి వరకూ అన్నక్యాంటీన్ సబ్సిడీ కోసం రూ.243 కోట్ల మేర ఖర్చు చేశాం" అని ముఖ్యమంత్రి అన్నారు. పేదల పొట్టగొట్టిన గత పాలకులు "గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారు. పేదల కడుపు నింపుతున్న పథకాన్ని నిలిపివేశారు. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా అన్నదానం చేస్తుంటే దానిలో మట్టి పోసి, దాడులు చేసి అడ్డుకున్నారు. వైసీపీకి కావాల్సింది విధ్వంసం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమే. ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం రప్పా రప్పా చేస్తాం, 2029లో విధ్వంసం చూపిస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీగా మార్చుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఆ పార్టీకి లేదు అని "ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, కలెక్టర్ కృతికా శుక్లా, తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-inaugurated-anna-canteen-36-217460.html





