చైనాతో అమెరికా ఆడుతున్న అసలైన ఆట!
Publish Date:Apr 15, 2026
Advertisement
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపైనే దృష్టిని కేంద్రీకరించాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న మంటలు, హార్ముజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి, ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే.. ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది. ఆ అసలు సిసలు యుద్ధం.. క్షిపణులతో సాగే యుద్ధం కాదు, వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా గొలుసులు, సాంకేతిక ఆధిపత్యం కోసం సాగుతున్న అదృశ్య సమరం. చరిత్రను పరిశీలిస్తే, ఒక ఎస్టాబ్లిష్ అయిన శక్తిని అధిగమించి మరో శక్తి ఎదిగే క్రమంలో ఘర్షణలు అనివార్యమని స్పష్టమవుతుది. గతంలో జర్మనీ ఎదుగుదల మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీస్తే.. జపాన్ దూకుడు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఇప్పుడు చైనా సాధిస్తున్న అసాధారణ వృద్ధి అమెరికాకు అస్థిత ముప్పును కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచం మూలాలు కదిలిపోయే ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ తయారీ రంగంలో 30 శాతం వాటాను కలిగి ఉండి.. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ క్రమంలో యూరప్ దేశాలతో చైనా పెంచుకుంటున్న వాణిజ్య సంబంధాలు అమెరికా అగ్రరాజ్య హోదాను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఇదే అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నది. దీనిని ఎదుర్కోవడానికి చైనాకు ఉన్న అతిపెద్ద బలహీనతను క్యాష్ చేసుకోవాలని అమెరికా పడుతున్న తాపత్రేయమే ప్రస్తుత పరిస్థితికి కారణం. చైనా అతి పెద్ద బలహీనత ఏంటంటే.. ఇంధన స్వయంసమృద్ధి లేకపోవడం. తన అవసరాలకు కావాల్సిన చమురులో 73 శాతం వాటా చైనా దిగుమతుల ద్వారానే పొందుతోంది. ముఖ్యంగా ఇరాన్, రష్యా, వెనిజులా, సౌదీ అరేబియా వంటి దేశాలే చైనాకు ప్రధాన వనరులు. ప్రస్తుతం అమెరికా తన వ్యూహాలతో ఈ సరఫరా మార్గాలపైనే దెబ్బకొడుతోంది. రష్యాపై ఆంక్షలు, ఇరాన్లో అనిశ్చితి, వెనిజులాలో రాజకీయ మార్పులు.. వీటన్నిటి ఫలితంగా చైనాకు అందే చమురు సరఫరాలో దాదాపు 20 శాతం కోత పడింది. ఆర్థిక పురోగతికి ఇంధనం అందకుండా చేయడమే అమెరికా ఎత్తుగడగా కనిపిస్తోంది. మరోవైపు.. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) లేదా ఆధునిక సిల్క్ రోడ్ ప్రాజెక్టును అడ్డుకోవడం అమెరికా తదుపరి లక్ష్యం. ఆసియా యూరప్ వరకు రవాణా మార్గాలను నిర్మించి, ప్రపంచ వాణిజ్యాన్ని శాసించాలని చైనా భావిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సైతం చైనాతో వాణిజ్య ఒప్పందాలకు మొగ్గు చూపడం అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ సిల్క్ రోడ్లో ఇరాన్ కీలకమైన దేశం. అందుకే ఇరాన్ కేంద్రంగా సాగే ఏ అస్థిరత అయినా నేరుగా చైనా, యూరప్ వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. అలాగే సాంకేతిక రంగంలోనూ అమెరికా, చైనా పోరు తార స్థాయికి చేరుకుంది. దీనికి తైవాన్ ప్రధాన వేదికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్లో 90 శాతం తైవాన్లోనే తయారవుతాయి. ఈ 21వ శతాబ్దంలో సాంకేతిక రంగంలో ఎవరు రాజుగా ఉండాలో తైవాన్ నిర్ణయిస్తుంది. అందుకే తైవాన్పై నియంత్రణ కోసం అమెరికా, చైనా పట్టుబడుతున్నాయి. ఒకవేళ ఇక్కడ ఘర్షణ మొదలైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం ఉంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలలో అమెరికాకు ఆర్థిక ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా గల్ఫ్ దేశాలు తమ రక్షణ అవసరాల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తాయి. అంటే.. అమెరికా ఆయుధ విక్రయాలు భారీగా పెరుగుతాయి. అంటే ఒక రకంగా ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా.. అది అమెరికా ఆయుధ కర్మాగారాలకు లాభదాయకంగా మారుతుంది. మొత్తానికి, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇరాన్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లేదా వెనిజులా పరిస్థితులు వేర్వేరు సంఘటనలు కావు. ఇవన్నీ చైనా ఎదుగుదల వేగాన్ని తగ్గించేందుకు అగ్రరాజ్యం పన్నుతున్న ఒక బృహత్ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఇంధన సరఫరాను అడ్డుకోవడం, యూరప్ను డ్రాగన్ దేశానికి దూరం చేయడం ద్వారా తన అగ్రరాజ్య హోదాను, ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది కేవలం దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు, 21వ శతాబ్దపు ప్రపంచ క్రమాన్ని ఎవరు శాసించాలో నిర్ణయించే ఒక మహా సమరం. -సీతారాం కంఠమనేని
http://www.teluguone.com/news/content/america-real-game-with-china-36-217430.html





