కేసీఆర్, చంద్రబాబుల ఏకాభిప్రాయం?
Publish Date:May 1, 2013
Advertisement
చంద్రబాబు పాదయాత్ర ముగిసిన రోజునే (ఏప్రిల్ 27), తెరాస తన 12వ వార్షికోత్సవం కూడా ఆర్మూరులో జరుపుకొంది. అందువల్ల ఆ రెండు పార్టీల చరిత్రలో అవి ముఖ్య అధ్యాయాలుగా నిలవడమే కాకుండా వాటి రాజకీయ భవిష్యత్తును కూడా అవి నిర్దేశించనున్నాయి. 9సం.లు ప్రతిపక్ష బెంచీలకే అంకితమయిపోయినా పార్టీని ఏకత్రాటిపై నిలిపి ఉంచిన ఘనత చంద్రబాబుదయితే, ఇంతవరకు పూర్తీ స్థాయిలో అధికారం చెప్పట్టకపోయినా కూడా 12సం.ల పాటు పార్టీని కేవలం ఉద్యమాల ఆధారంగానే నిలబెట్టిన ఘనుడు కేసీఆర్. వీరిద్దరు కూడా రాబోయే ఎన్నికలలో తమ సత్తాచాటి చూపాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సందర్భంగా వీరివురు వివిధ పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇంచు మించు ఒకే రకమయిన అభిప్రాయలు వ్యక్తం చేయడం విశేషం. కేసీఆర్: రాబోయే ఎన్నికలలో తెరాస పూర్తీ మెజార్టీ సాదించి తీరుతుంది. గనుక కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమవుతుంది. ఈసారి 3వ ఫ్రంట్ ఉద్భవించి కేంద్రంలో అధికారం చెప్పట్టినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ యుపీయే లేదా ఎన్డీయే గానీ అధికారంలోకి వచ్చినా మావంటి ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడక తప్పదు. చంద్రబాబు: రాబోయే ఎన్నికలలో మా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో యుపీయే, ఎన్డీయే కూటములు రెండు కూడా వాటంతట అవి పూర్తి మెజార్టీ సాదించే పరిస్థితిలో లేవు. గనుక, ఈ సారి కేంద్రంలో ప్రాంతీయపార్టీలదే పైచేయి అవుతుంది. నేను స్వయంగా పూనుకొని వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని 3వ ఫ్రంట్ నిర్మాణం చేసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకి కృషి చేస్తాను. కేసీఆర్: రాబోయే ఎన్నికలలో మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎందుకంటే, బీజేపీతో లేదా లెఫ్ట్ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వారికి తెలంగాణాలో సీట్లు పంచి ఇవ్వడం వలన, తెలంగాణాలో వారు బలపడతారే తప్ప, కేంద్రంలో అధికారంలోకి రాలేరు. అందువల్ల వారితో పొత్తుల వలన వారికే ప్రయోజనం ఉంటుంది తప్ప మాకేమి లాభం ఉండదు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొంటే, ఒకవేళ అవసరమయితే వారు మాతో కలిసి ఎన్డీయేకి మద్దతు ఈయరు. అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకొంటే, కేంద్రంలో యుపీఏ అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు బీజేపీతో మాపొత్తు వల్ల వారికే తప్ప మాకేమి లాభం ఉండదు. చంద్రబాబు: రాబోయే ఎన్నికలలో మేము ఒంటరిగా పోటీ చేయలనుకొంటున్నాము. మిత్ర పక్షాలయిన లెఫ్ట్ పార్టీల గురించి సమయం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకొంటాము. 3వ ఫ్రంట్ నిర్మాణానికి ఏ మాత్రం ఉపయోగపడని ఈపొత్తులవల్ల ప్రయోజనం లేదు. కేసీఆర్: రాబోయే ఎన్నికలలో ఆంధ్రా ప్రాంతంలో ఈసారి త్రిముఖ పోటీ ఉండబోతోంది. కానీ తెలంగాణా ప్రాంతంలో మాకు గట్టి పోటినిచ్చేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని భావిస్తున్నాము. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఈసారి తన ఉనికిని కోల్పోవచ్చును. ఇక, తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. చంద్రబాబు: రాబోయే ఎన్నికలలో ఆంధ్రా ప్రాంతంలో తెదేపా, తల్లిపిల్ల కాంగ్రెస్ పార్టీలతో, తెలంగాణా ప్రాంతంలో తెరాసతో పోటీ పడవలసి ఉంటుంది. కేసీఆర్: బీజేపీ నరేంద్ర మోడీపై ఆశలు పెట్టుకోవడం సహజమే. కానీ, ఆయన ప్రభావం గుజరాత్ వెలుపల అంతగా ఉండకపోవచ్చును. వివిధ రాష్ట్రాలలో స్థానిక పార్టీలదే పైచేయిగా ఉండబోతోంది. ఒకవేళ దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రజలు ఆయనకు ఓటువేద్దామని భావించినా కూడా, చాలా రాష్ట్రాలలో ఆపార్టీకి సరయిన వ్యవస్థాగత ఏర్పాట్లే లేవు. ఒకవేళ ఏ రాష్ట్రంలో ప్రజలయినా మోడీకి పట్టం కట్టాలని భావించినా కూడా, వారికి స్థానికంగా ఓటు వేసేందుకు బలమయిన బీజేపీ అభ్యర్ధులు లేరు. ఒకవేళ ఉన్నాకూడా ప్రాంతీయ పార్టీలకి దీటుగా గట్టి పోటీ ఇవ్వగల తగిన వ్యవస్థ బీజేపీకి లేదు. అందువల్ల మోడీ ప్రభావం కేవలం బీజేపీ బలంగా ఉన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం కావచ్చును. చంద్రబాబు: ఉత్తరాదిన మూడు నాలుగు రాష్ట్రాలలో తప్ప నరేంద్రమోడీ ప్రభావం దేశంలో ఇతర ప్రాంతాలలో ఉండదు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, వంటి ప్రాంతాలలో ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేరు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఉనికే లేదు. మిగిలిన చాలా రాష్ట్రాలలో ఆపార్టీ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. బీఎపీకి వివిధ రాష్ట్రాలలో వ్యవస్థాగతంగా బలం లేనప్పుడు ఆయన మాత్రం ఏమిచేయగలరు? బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీ ఉంటుంది. గనుక, రాబోయే ఎన్నికలలో దేశం మొత్తం మీద ఆయన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చును.
http://www.teluguone.com/news/content/chandrababu-37-22821.html