విధ్వంసపు పాలనతో ఏపీకి నష్టం.. ప్రజలు గమనించాలన్న చంద్రబాబు
Publish Date:Jan 4, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ సాగుతున్న విధ్వంసపు పాలనతో ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు .రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలని... జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని సూచించారు. వైసీపీ పాలనే విధ్వంసంతో మొదలైందని, ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. రాజధాని కోసం 50 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారని... రాజధానిలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్ ఉండేదా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి జగన్ మాట తప్పారన్నారు చంద్రబాబు. కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరమని తెలిపారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. పోలవరం డీపీఆర్ను ఎందుకు ఖరారు చేయలేకపోయారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయడం జగన్ ప్రభుత్వానికి చేతనవుతుందా? అని నిలదీశారు. పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్కు ఉందా?’’ అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదన్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసినట్లు తెలిపారు. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు .
http://www.teluguone.com/news/content/chandra-babu-fire-on-jagan-govt-39-129602.html





