డబుల్, డూప్లికేట్ ఓట్లు తొలగించండి..ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి..!
Publish Date:Jul 10, 2026
Advertisement
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పిం చింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న అవకతవకలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయత ఓటరు జాబితా స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుందని, అందువల్ల డబుల్, డూప్లికేట్ ఓట్లను వెంటనే గుర్తించి తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓట్లను సులభం గా గుర్తించి తొలగించవచ్చని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి వివరించారు. ఈ విధానం అమలులోకి వస్తే నకిలీ, డూప్లికేట్ ఓట్ల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం లభించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్ నమోదులను తప్పకుండా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరింది. తాము సమర్పిం చిన వినతిపత్రంలోని అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణ యాలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
http://www.teluguone.com/news/content/central-election-commission-36-225672.html





