పిల్ల జమిందార్ దర్శకుడిపై కేసు నమోదు..!
Publish Date:Jul 10, 2026
Advertisement
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ తరహాలోనే, సినిమా అవకాశాల పేరిట సాగే భారీ మోసం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్లో నాని హీరోగా వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ చిత్రం 'పిల్ల జమిందార్' గుర్తుంది కదా? ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కొడుకును వెండితెరపై హీరోగా చూడాలనే ఒక కుటుంబపు కలను ఆసరాగా చేసుకుని, సదరు దర్శకుడు మైండ్ బ్లోయింగ్ స్కామ్కు తెరలేపినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చిపెడతామంటూ నమ్మించి ఏకంగా కోట్ల రూపాయలు గుంజిన వ్యవహారం ఇప్పుడు సైబరాబాద్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాధితులు అందించిన వివరాల ప్రకారం.. ఒక యువకుడిని టాలీవుడ్లో గ్రాండ్గా హీరోగా పరిచయం చేస్తానని దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మితో కలిసి నమ్మబలికారు. సినిమా నిర్మాణానికి భారీగా ఖర్చవుతుందని, ఒకేసారి కాకపోయినా విడతల వారీగా డబ్బులు సర్దాలని బాధితులను కోరారు. తమ బిడ్డ ఎలాగైనా పెద్ద హీరో కావాలనే ఆశతో ఆ యువకుడి తల్లిదండ్రులు అడిగినప్పుడల్లా భారీ మొత్తంలో డబ్బులు ఇస్తూ వచ్చారు. అలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. విడతల వారీగా ఏకంగా రూ.3.5 కోట్ల రూపాయలను దర్శకుడు అశోక్ బాబు ఖాతాలోకి బదిలీ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, అసలు కథ ఇక్కడే మొదలైంది. డబ్బులు చేతికి అంది చాలా కాలం గడుస్తున్నా సదరు దర్శకుడి నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్, లేదా కనీసం ఓపెనింగ్ ముహూర్తం ఊసే ఎత్తలేదు. యువకుడిని హీరోగా లాంచ్ చేయడంలో ఈ ఇద్దరూ పూర్తిగా విఫలమయ్యారు. రోజులు గడుస్తున్నా సినిమా మొదలుకాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు తమను మోసం చేశారని గ్రహించారు. దీంతో తాము ఇచ్చిన రూ.3.5 కోట్ల భారీ మొత్తాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని దర్శకుడు అశోక్ బాబును, నిర్మాత విజయలక్ష్మిని నిలదీశారు. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరించడమే కాకుండా ముఖం చాటేయడం మొదలుపెట్టారు. దీంతో ఇక లాభం లేదనుకున్న బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) రంగంలోకి దిగింది. నిందితులపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారిన ఈ కేసులో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మిని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. టాలీవుడ్లో ఎంతో పేరున్న ఒక హిట్ సినిమా దర్శకుడు ఇలా కోట్ల రూపాయల చీటింగ్కు పాల్పడి పోలీసుల చేతికి చిక్కడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నవతరం యువత సినీ ఆశలను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఇలాంటి మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-director-ashok-babu-arrest-36-225642.html





