జగన్ ఆధిపత్యానికి బ్రేకులు.. కొత్త కేబినెట్తో కుంపట్లు..
Publish Date:Apr 11, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఎందుకు చేశారు? ఏమి ఆశించారు, ఏమి సాధించారు, అని బేరీజు వేసుకుంటే, పునర్వ్యవస్థీకరణ పేరిట సాగిన ఈ మార్పులు చేర్పులు కేవలం మార్పు కోసం మార్పుతప్ప గుణాత్మకమార్పు కోసం కాదన్న నిజం కాసింత ఆలస్యంగానే, అయినా వెలుగు చూసింది. నిజానికి, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని , భవిష్యత్ అవసరాలకు అనుగునంగా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ, ముఖ్యమంత్రి జన రెడ్డి రోజుల తరబడి సాగించిన ‘భారీ’ కసరత్తులో ఆ కోణం కనిపించలేదు. అలాగే మెరుగైన పాలన కోసమో, ప్రజలకు మరిన్ని మేళ్ళు చేసేందుకో, ముఖ్యమంత్రి, ఇంత కసరత్తు చేశారని ఎవరైనా అనుకుంటే, అది పొరపాటే అవుతుంది, అనే విధంగా మర్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎడమ చేయితీసి, పుర్రచేయి పెట్టారు, అనే విధంగానే, మార్పులు చేర్పులు జరిగాయనే మాట అధికార పార్టీలో నే వినిపిస్తోంది.ఒక్కసారి, కొత్త మంత్రివర్గం ముఖచిత్రం చూస్తే, బొమ్మల కొలువులో బొమ్మలను మార్చినట్లు కొన్ని ముఖాలు మార్చారు తప్పించి,పరిపాలనా అనుభవాన్ని గుర్తించిన దాఖలాలు కనిపించడంలేదని పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. పరిపాలన పరంగానే కాదు రాజకీయంగా చూసినా ముఖ్యమంత్రి ఆశించిన అద్భుతాలు జరుగుతాయని, అనుకోలేమని పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఒక విధంగా చూస్తే, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది’ అన్నట్లుగా, మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ పేరిట సాగిన క్రతువులో ముఖ్యమంత్రి డొల్లతనం బయట పడిందనే మాట కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. “ఇంతవరకు ఆయనో మోనార్క్, కానీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో ఆయన అన్ని రకాల వత్తిళ్లకు తలొగ్గారు. ఇంతవరకు ప్రభుత్వంలో, పార్టీలో ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయన మాటకు తిరుగు లేదు. కానీ, ఇప్పుడు అయన డొల్లతనం బయట పడింది” అనే మాట పార్టీ వర్గాల్లో వినవస్తోంది.అందుకే ఇంతవరకు గోడలకూ చెవులుంటాయని, భయపడుతూ మనసులోని మాటను పెదవులు దాటకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు, ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఏ మాత్రం సంకోసించవలసిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ‘పాతకొత్త మంత్రివర్గాల మధ్య చెప్పుకోదగిన మార్పు పెద్దాగా ఏమీలేదు. చాంతాడంత రాగం తీసి చివరాఖరుకు ఇంకేదో పాట పాడినట్లుగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ కూర్పు ఉందని బహిరంగంగానే అంటున్నారు. నిజానికి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధిపత్యానికి బ్రేకులు వేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తొలి మంత్రివర్గ కూర్పులో సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించారు. వైసీపీ అధికారంలోకి వస్తే, మంత్రి పదవులు ఖాయం అనుకున్న అనేక మందికి ముఖ్యమంత్రి మొండి చేయి చూపించారు. కొత్త వారితో ప్రయోగం చేశారు. అయినా, ఎవరైనా తిట్టుకుంటే లోలోపల తిట్టుకున్నారో, మౌనంగా శాపాలు పెట్టారో ఏమో కానీ, బయటకు మాత్రం నిరసనలు అంతగా వ్యక్తం కాలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బహిరంగం గానే, నిరసనలు, తిరుబాట్లు మొదల్యాయాయి. మరోవంక రెండున్నర సంవత్సాల తర్వాత, మొత్తానికి మొత్తంగా మంత్రి వర్గాన్ని పక్షాళన చేస్తానని ముందే చెప్పిన ముఖ్యమంత్రి, చివరకు మూడేళ్ళు పూర్తయ్యే వరకు, ఆ క్రతువు కానీయ లేదు. చివరకు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనే పెద్ద పేరు పెట్టినా ఇంచుమించుగా సగం పాత ముఖాలకే మళ్ళీ అవకాశం ఇవ్వక తప్పలేదు. అయినా, ఇంకా పాత మంత్రులు గుర్రు పెడుతూనే ఉన్నరు. ముఖ్యమంత్రి సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా అలకపాన్పు ఎక్కి కూర్చున్నారు. ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి ఇంటికి వెళ్లి బుజ్జగింపులు చేయక తప్పలేదు. అంతే కాదు, మాజీ మంత్రుల అనుచరులు, కనీసం ఈ సారన్నా మంత్రి పదవి దక్కుతుందని ఆశపడి మళ్ళీ భంగపాటుకు గురైన ఆనం వంటి సీనియర్లు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, చూడవలసి వుంది.మరో వంక ప్రతిపక్ష పార్టీలు సామాజిక అన్యాయం గురించి, విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి అధిపత్యానికి గండి కొట్టింది. ఇంతవరకు, ఇప్పుడు కాకపోయినా సెకండ్ రౌండ్’లో మంత్రి పదవి దక్కుతుందని ఆశపడిన, సేనియర్లు, జూనియర్లు, అలాగే జిల్లాస్థాయిలో అంతర్గత కుమ్ములాటలకు తెర తీయడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ రాజకీయాల్లో మంత్రి వర్గ విస్తరణకు ముందు విస్తరణ తర్వాత అనే రాజకీయ విభజన రేఖ స్పష్ట మవుతోంది. అలాగే, రాష్ట్ర రాజకీయ వాతావరనమలో వైపరీత్యాలు అనివార్యం అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cabinet-reshuffle-blues-in-ruling-ycp-39-134191.html





