బీహార్ లో బీజేపీకి బిగ్ షాక్?
Publish Date:Aug 8, 2022
Advertisement
బీజేపీకి బీహార్ లో నితీష్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కు జెల్ల కొట్టి విపక్ష ఆర్జేడీ మద్దతుతో, వామపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది. బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో నెల రోజుల కిందట ఏర్పడిన చిచ్చు ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం (ఆగస్టు 9)న జేడీయూ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర్రంలో ఈ నెల 11 నాటికి కొత్త సర్కార్ ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జేడీయూ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీసింగ్ గత శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య బంధం దాదాపు చెడినట్లేనని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర కేబినెట్ లో ఆర్పీసింగ్ కు స్థానం కల్పించడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కనీసం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామ్య పక్ష అధినేత అయిన నితీష్ ను కనీసం సంప్రదించలేదు. దాదాపు ఏకపక్షంగా ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో అప్పటికి ఊరుకున్న నితీష్ కుమార్ ఆ తరువాత తాజాగా ఆయన రాజ్య సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. దీంతో అనివార్యంగా ఆర్పీ సింగ్ కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. నితీష్ అక్కడితో ఆగకుండా ఆర్పీసింగ్ కుమార్తె అవినీతిపై ప్రశ్నించడంతో అనివార్యంగా ఆర్పీసింగ్ జేడీయూ నుంచి రాజీనామా చేశారు. 2017లో లాలూ అవినీతిని ఎత్తిచూపుతూ.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ.. 2020 ఎన్నికల్లో లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా బరిలోకి దిగింది. ఎన్డీయే కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చినా, జేడీయూగా మాత్రం బారీగా నష్టపోయి కేవలం 43 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 74 స్థానాలు సాధించింది. అయితే సంకీర్ణ ప్రభుత్వాధినేతగా బీజేపీ, నితీశ్కే అధికారాన్ని కట్టబెట్టింది. అదే సమయంలో బిహార్పై పట్టుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను గమనించిన నితీష్ కుమార్ తెగదెంపులకు సిద్ధమయ్యారు. నెల రోజులుగా ఆయన బీజేపీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జులై 17న అమిత్షా నిర్వహించిన సమావేశానికి, రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి, గత నెల 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి నితీశ్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే (ఆగస్టు 9)మంగళవారం నితీశ్ తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం రాజకీయంగా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 75 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆర్జేడీ మద్దతు నితీశ్కు ఉంటుందని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. బీజేపీని కాదనుకుంటే.. మద్దతివ్వడానికి తాము సిద్ధమని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. సీపీఐ(ఎంఎల్)-లెనిని్స్టకు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో రెండేసి సీట్లున్నాయి. నితీశ్కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. మరోవైపు నితీశ్తో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ.. ఫోన్లో మాట్లాడారనే ప్రచారం జోరందుకుంది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరం. మరో వైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. ఒక వేళ ఎన్డీయే నుంచి నితీష్ వైదొలగి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైతే ఆర్జేడీలో చీలిక తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా లేని పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏ క్షణంలోనైనా బీజేపీ, జేడీయూ కటీఫ్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/big-shock-to-bjp-in-bihar-39-141526.html