సుప్రీం తీరు, తీర్పులు సరిగా లేవు.. కపిల్ సిబల్
Publish Date:Aug 8, 2022
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు రంగం సిద్ధమౌతోందా? అన్న ప్రశ్నకు ఆయన సుప్రీం కోర్టు పై చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందించిన తీరు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తుంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 8)న జరిగిన సదస్సులో ఆయన సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అర్ధ శతాబ్దం పాటు పని చేసిన తనకు సుప్రీం కోర్టుపై ఇలా వ్యాఖ్యానించాల్సి రావడం బాధ కలిగిస్తోందనీ, అయినా సీనియర్ న్యాయవాదినైనా తాను కాకపోతే న్యాయవ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలను మరెవరు ప్రశ్నించగలరని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని తాను కోల్పోయానని చెబుతూ ఆయన ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉటంకించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న, సున్నితమైన కేసులన్నీ కొందరు న్యాయమూర్తల ముందుకే విచారణకు వెళుతున్నాయన్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో... సిట్ దర్యాప్తులో లోపాలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సమర్పించినా సుప్రీం కోర్టు ఏమీ చేయలేకపోయిందన్నారు.అలాగే... మనీలాండరింగ్ కేసుల విషయంలో ఈడీ విస్తృత అధికారాలను సుప్రీం సమర్థించడాన్నికూడా కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఓవైపు వ్యక్తుల గోప్యత హక్కును సమర్థిస్తూ... మరోవైపు దర్యాప్తు పేరుతో ఈడీ నేరుగా ఇళ్లల్లోకి వెళ్లడానికి కోర్టు అనుమతివ్వడం ఎంత వరకూ సమంజసమని కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఛత్తీస్ గఢ్లో ఆదివాసీల ఊచకోతపై స్వతంత్ర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేయడం, అలాగే ధర్మ సంసద్ ప్రసంగాల కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఈ సందర్భంగా కపిల్ సిబల్ తప్పుబట్టారు. అయితే కపిల్ సిబల్ వ్యాఖ్యలపై పలువురు న్యాయనిపుణులు, బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సిబల్ వ్యాఖ్యలను ఖండించారు. స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించే రాజ్యాంగ సంస్థలపై విమర్శలు సరికాదన్నారు. మనీలాండరింగ్ చట్టాన్ని యూపీఏ హయాంలో, సిబల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే తెచ్చారని, ఇప్పుడు ఆయనే ఆ చట్టాన్ని విమర్శిస్తున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేశ్ జెఠ్మలానీ కూడా కపిల్ సిబల్ వ్యాఖ్యలను ఖండించారు. సిబల్ వంటి సీనియర్ న్యాయవాది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని పేర్కొన్నారు. కపిల్ సిబల్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతివ్వాలని కోరుతూ పలువురు న్యాయవాదులు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను కోరుతూ లేఖలు రాశారు. మొత్తం మీద సుప్రీం కోర్టు తీర్పును తప్పుపడుతూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి
http://www.teluguone.com/news/content/kapil-sibal-sensation-comments-on-supreme-court-39-141528.html