కన్న తండ్రిపై కొడుకుల దాడి... తండ్రి మృతి
Publish Date:Apr 5, 2026
Advertisement
పచ్చని సంసారం… చక్కటి పిల్లలు… సాఫీగా సాగుతున్న జీవితం… కానీ అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు, సులోచన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు ఇప్పటికే వివాహాలు కాగా, కుమారులు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా సులోచన హైదరాబాద్లో కుమారుల వద్దే ఉంటుండగా, చేరాలు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తండ్రిని చూసేందుకు ఇద్దరు కుమారులు గ్రామానికి వచ్చారు. అయితే అక్కడ తండ్రి మరో మహిళతో కలిసి ఉండడం గమనించి వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తల్లి స్థానంలో మరో మహిళ కనిపించడంతో ఆవేశానికి గురైన కుమారులు తండ్రిపై, ఆ మహిళపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దాడిలో చేరాలు, ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. చేరాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన మహిళ ప్రస్తుతం పరకాల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
http://www.teluguone.com/news/content/bhupalapally-district-36-216728.html





