ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ.. తెలంగాణలో 2 లక్షల ఓట్లు తొలగింపు
Publish Date:Jan 6, 2022
Advertisement
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల సవరణ జాబితా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,05,97,544 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 4,62,880 ఎక్కువ. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ, కృష్ణా జిల్లాలు అత్యధిక ఓటర్ల జాబితాలో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 43,45,322 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 352 మంది థర్డ్ జెండర్ ఓటర్లు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో మొత్తం 3,03,56,984 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి శషాంక్ గోయల్ వెల్లడించారు. ఇందులో 1,36,496 మంది 18-19 ఏళ్ల మధ్య ఉన్న వారున్నారు. మొదటిసారి ఓటు హక్కు పొందిన వారి ఓటరు గుర్తింపు కార్డును ఎన్నికల సంఘం ఉచితంగా ఇంటి వద్దకే పంపనుంది. ఇక నకిలీ ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం వంటి కారణాలతో సుమారు 2 లక్షల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించారు. జిల్లాల వారిగా హైదరాబాద్లో అత్యధికంగా 43,67,020 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో యువ ఓటర్లు 13,025 మంది. రంగారెడ్డి జిల్లాలో 31,60,455 మంది ఓటర్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26,00,008 మంది ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 13,58,185 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 33 జిల్లాల్లో అతి తక్కువ ఓటర్లు కలిగిన జిల్లాగా ములుగు నమోదు కాగా అక్కడ ఓటర్ల సంఖ్య 2,11,160గా ఉంది.
http://www.teluguone.com/news/content/ap-telangana-states-final-voter-list-released-39-129714.html





