మంత్రుల మాటలకు అర్థాలే వేరులే!.. జగన్పై కాకరేపే కామెంట్స్..
Publish Date:Apr 1, 2022
Advertisement
ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అనేది ఒకప్పటి మాట. ఇపుడు ఏపీలో మంత్రుల మాటలకు అర్థాలు వేరులే అనుకోవలసి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు చేసిన నేపధ్యంలో, మరో పదిరోజుల్లో మాజీలు కాబోతున్న మంత్రులు ఓ వంక ముఖ్యమంత్రికి, పార్టీకి విధేయత ప్రకటిస్తూనే మరోవంక మర్మగర్భంగా అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి తమ మనసులో ఏముందో స్పష్టత ఇవ్వకుండా, ఉహాగానాలకు అవకాశం ఇవ్వడంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు తమ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని సీనియర్ మంత్రులు చికాకు పడుతున్నారు. మంత్రి వర్గంలో కొందరిని కొనసాగించి, కొందరికి ఉద్వాసన పలికితే, ఉద్వాసనకు గురైనవారిఫై అసమర్థులనే ముద్ర పడుతుందని కొందరు సీనియర్ మంత్రులు చిర్రుబుర్రు లాడుతున్నారు. సహజంగా ముఖ్యమంత్రి తమకున్నవిశిష్ఠ అధికారాలను వినియోగించి సమయానుకూలంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడతారు. కానీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ/ప్రక్షాళన పేరిట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాగిస్తున్న ప్రహసనం మాత్రం తమకు తలవంపులు తెచ్చేలా ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సన్నిహిత బంధువు, గతంలో మంత్రివర్గ సమూల పక్షాలనను పబ్లిక్’గా సమర్ధించిన ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ‘ఉద్వాసన’పై కుతకుతలాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తనను తీసేసి, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్ను కేబినెట్లో కొనసాగిస్తే, తన పరువేం కానని, ఆయన వాపోతున్నారు. అదే జరిగితే రాజకీయంగా తనకు ఇబ్బందని బాలినేని భావిస్తున్నారు. జిల్లాలో కొందరిని కొనసాగించి... ఇంకొందరిని తొలగించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని బాలినేని గట్టిగా చెబుతున్నట్లు సమాచారం. అదలా ఉంటే, ఉద్వాసన ఖాయమని తెలిసినా, కొందరు మంత్రులు, దింపుడు కళ్ళెం ఆశతో ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కురమ్మనే, థియరీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ మత్రి బొత్స సత్యనరాయణ, గతాన్ని మరిచి పోయి, పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీని కాదని, ఒకప్పుడు తానే తిట్టిపోసిన పిల్ల కాంగ్రెస్ పార్టీ, కన్నతల్లిలాంటిదని చెప్పుకొచ్చారు.అంతే కాదు, ఒకప్పుడు ఇదే జగన్ రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా అనరాని మాటాలు అని, చేయరాని ఆరోపణలు చేసిన బొత్స ఇప్పడు జగన్ రెడ్డికి వీర విధేయతను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసంతోషంగా స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇంతలోనే ఇలా విధేయంగా స్పందించిన బొత్స రేపు ముఖ్యమంత్రి అంతరితో పాటు ఆయనకు ఉద్వాసన పలికితే, అప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలని, అంటున్నారు. ఈ అన్నిటినీ మించి, మంత్రి కొడాలి నానీ, ఆయన ముఖ్యమంత్రికి విధేయత ప్రకటించారో హెచ్చరిక చేశారో అర్థం కాకుండా చేసిన ప్రకటన, అందరిలోనూ ఆశక్తిని రేకెత్తిస్తోంది. కొడాలి నానీ, ఓ వంక తను బతికున్నంత వరకు జగన్ రెడ్డి చేయి వదలనని, ఆయన తోనే ఉంటానని అన్నారు. అదే క్రమంలో మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపుతానని అన్నారు. అంటే మరింతగా బూ... లతో రెచ్చిపోయి, మరింతగా పార్టీ పరువు తీస్తానని, నానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డినిహెచ్చరించారా? అని వైసీపే నేతలు కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి దీనికి ఏ పేరు పెడతారో ఏమో కానీ, ఆయన తలపెట్టిన ఈ ‘క్రతువు’ పార్టీలో చిక్కులు, చికాకులు తెచ్చి పెడుతుందని రాజకీయ విశ్లేశకులు అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకున్నారని, ఇక ఇప్పుడు ఇటూ అటూ ఎటు వెళ్ళినా రాజకీయంగా చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు.అంతే కాదు, ఎంతవరకు నిజమో ఏమో కానీ, తాజా పరిస్థితిపై పీకే బృందం సర్వే చేస్తోందని, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వతానే ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని, అంతవరకు ఉహాగానాలు వినిపిస్తూనే ఉంటాయని అంటున్నారు.
ఇంతకాలం, జిల్లా రాజకీయాల్లో తమకు ప్రత్యర్ధులుగా ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే, తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మే పరిస్థితి తీసుకురావద్దని, కొందరు మంత్రులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి,పెద్దిరెడ్డి ‘నన్ను మంత్రి వర్గం నుంచి తీసేస్తే తీసేయండి, కానీ, జిల్లాలో వేరెవరికీ మంత్రి పదవి ఇవ్వొద్దు’ అని మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కండిషన్ పెట్టారో వేరే చెప్పనక్కరలేదు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి పదవి ఇస్తే, తను జిల్లాలో తలెత్తుకోలేనని, అందుకే ఆయన, నాకు కాకుంటే జిల్లాలో ఇంకెవరికీ, అవకాశం ఇవ్వవద్దనే కండిషన్ పెట్టారని అంటున్నారు. అలాగే, మరో సీనియర్ మంత్రి బోత్స సత్యనరాయణ కూడా, తమ్ముడు తమ్ముడే పేకాటే, అన్నట్లుగా మంత్రి వర్గం నుంచి తనను తప్పించి, సోదరుడు అప్పల నరసయ్యకు స్థానం కలిపిస్తానని చెప్పినా, తనను తొలగించాక.. తన అభిప్రాయంతో మరొకరికి పదవి ఇవ్వడం ఏమిటని ఆయన అంటున్నారు.
అదే విధంగా ఇంకొందరు సీనియర్ మంత్రులు, జూనియర్లు కూడా మంత్రి పదవి పోయినందుకంటే, కొత్త జట్టులో తమ ప్రత్యర్ధులకు స్థానం కలిపించడం పట్ల అసహనం వ్యక్త పరుస్తున్నారు. తమ పరిస్థితి మొగుడు కొట్టినందుకు కాదు,తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఉందని వాపోతున్నారు.
http://www.teluguone.com/news/content/ap-ministers-speaking-in-different-tones-25-133785.html





