సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన చంద్రబాబు.!
Publish Date:Aug 13, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అమరావతికి అత్యంత కీలక కనెక్టివిటీ అయిన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన భారీ స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. విజయవాడ, మంగళగిరి మధ్య ఉన్న జాతీయ రహదారితో రాజధానిని నేరుగా అనుసంధానించే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతి నవనగరాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆస్పత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో కలుస్తుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని మూడు దశల్లో .1,519 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల గృహాలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరేడ్ మైదానం ప్రాంతాలకు చేరుకోవడానికి ఈ రోడ్డు ఉపయుక్తంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల లో నిర్మించారు. ప్రత్యేకంగా బీఆర్టీఎస్ కారిడార్తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు. పాదచారుల కోసం ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లు, గ్రీన్బెల్ట్ నిర్మాణంతో ఆధునిక రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది. Amaravati Seed Access Road, CM Chandrababu Naidu, Inauguration Seed Access Road, BuckinghamCanalSteelBridge, Amarawathi
http://www.teluguone.com/news/content/amaravati-seed-access-road-36-228825.html




