ఇది ముగింపే కాదు... ఆరంభం మాత్రమే.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే..!
Publish Date:Jul 26, 2026
Advertisement
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత విద్యా వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకత సాధించడమే లక్ష్యంగా సిజేపి (CJP - సీఐటీజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ఆందోళన దేశ రాజధాని ఢిల్లీని ఊపేసింది. ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద ఏకంగా 37 రోజుల పాటు రాత్రింబవళ్ళు సాగిన ఈ విలక్షణ పోరాటం, చివరికి విద్యార్థుల విజయాన్కి నాంది పలికింది. అయితే ఈ ధర్నా విరమణ సందర్భంగా సిజేపి అధినేత అభిజీత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం ఒక ఘట్టానికి ముగింపు మాత్రమేనని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేవరకు తమ సుదీర్ఘ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు, ప్రశ్నపత్రం లీక్ కావడం వంటి తీవ్రమైన ఘటనలతో దిగ్భ్రాంతికి గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఆ క్లిష్ట సమయంలో వారి తరఫున గళం విప్పడానికి అభిజీత్ దీప్కే నేతృత్వంలో సిజేపి ముందుకు వచ్చింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా 37 రోజుల పాటు నాన్-స్టాప్ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఉద్యమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు మరియు ప్రజాసంఘాల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించింది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు, మేధావుల నుంచి వ్యక్తమైన తీవ్ర నిరసనల సెగ కేంద్ర ప్రభుత్వానికి బలంగా తాకింది. 37 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద సాగిన ఈ చారిత్రాత్మక పోరాటానికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, విద్యార్థులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లను అంగీకరించక తప్పలేదు. ఈ క్రమంలోనే బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం విద్యా రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం మరియు ప్రధాన డిమాండ్లన్నీ ఆమోదం పొందడంతో 37 రోజుల నాన్-స్టాప్ ఆందోళనను జంతర్ మంతర్ వద్ద అధికారికంగా విరమించారు. ఈ విజయం అనంతరం అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో తన భావోద్వేగాలను పంచుకుంటూ, దేశం కోసం మరియు భావి తరాల భవిష్యత్తు కోసం విద్యార్థులు చేసిన త్యాగాలు ఎప్పటికీ వృథా కావు అని, వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోలేదని కొనియాడారు. విద్యార్థులు, మేధావుల అతులిత మద్దతుతోనే ఈ సుదీర్ఘ పోరాటం ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిందని ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, తమ ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. విమర్శకుల విమర్శల వల్లే తాము మరింత పట్టుదలతో, మెరుగ్గా పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. గత 37 రోజులుగా జంతర్ మంతర్ వద్ద కంటిమీద కునుకు లేకుండా పోరాటం సాగించామని అభిజీత్ దీప్కే గుర్తుచేసుకున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన ప్రతి క్షణం వెంటాడేదని పంచుకున్నారు. సుదీర్ఘ పోరాటం ఫలించి తమ డిమాండ్లు నెరవేరడంతోనే గత రాత్రి తాను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ఆయన చెప్పారు. అయితే విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఇంకా చాలా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ, పారదర్శకమైన విద్యా విధానం అమల్లోకి వచ్చే వరకు తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంటుందని అభిజీత్ దీప్కే తేల్చిచెప్పారు. Abhijit Deepke, CJP Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, Dharmendra Pradhan Resignation, Education System Reforms India, 37 Days Student Protest
http://www.teluguone.com/news/content/abhijit-deepke-36-227146.html





