కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చీపురు దెబ్బలు
Publish Date:Dec 14, 2013
Advertisement
డిల్లీలో ఆమాద్మీపార్టీ చీపురు దెబ్బరుచి చూసిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అదే ఆమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తానని తెలియజేస్తూ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు నిన్న ఒకలేఖ వ్రాసింది. ఆమాద్మీ, బీజేపీ రెండు పార్టీలు కూడా స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉన్నకారణంగా ఎవరిదో ఒకరి మద్దతు తీసుకోవడం తప్పనిసరి అయింది. కానీ రెండు పార్టీలు మద్దతు ఈయము, తీసుకోమని బిగుసుకొని కూర్చోవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా నేటికీ, డిల్లీలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి కనబడటం లేదు. ఇది చూసి, కాంగ్రెస్ ఆమాద్మీకి మద్దతు ఈయడం ద్వారా మళ్ళీ డిల్లీ ప్రజల మద్దతు పొందవచ్చని భావించింది. అయితే ఈసారి కూడా దాని ప్రయత్నం బెడిసికొట్టింది. ఈరోజు గవర్నర్ ఆహ్వానం అందుకొన్న ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తమకు పది రోజుల గడువు ఈయమని కోరారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ “మాకు కాంగ్రెస్, బీజేపీలు బయట నుండి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. అయితే మేము లేవనెత్తుతున్న వివిధ అంశాలపట్ల వాటి ప్రతిస్పందన తెలుసుకొన్న తరువాతనే మద్దతు స్వీకరించడం గురించి ఆలోచిస్తామని వారికి లేఖలు వ్రాసాము. 1.మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే, డిల్లీకి పూర్తిగా రాష్ట్ర స్థాయి కల్పించాలని కోరుకొంటున్నాము. అందుకు కాంగ్రెస్, బీజేపీలు అంగీకరిస్తాయా? 2. ఇక గత పదిహేనేళ్ళుగా డిల్లీని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వివిధ ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో చేతులు కలిపిన అనేకమంది కాంగ్రెస్ శాసన సభ్యులు, మంత్రులు అనేక అవకతవకలకు పాల్పడ్డారు. మేము అధికారం చేపడితే వారందరిపై విచారణకు ఆదేశిస్తాము. అందుకు కాంగ్రెస్ సమ్మతిస్తుందా? ఆ పార్టీ తెలియజేయాలి. 3.అదేవిధంగా డిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల చేతుల్లో నీళ్ళ ట్యాంకర్ల మాఫియా నడుస్తోంది. మేము అధికారంలోకి వస్తే వారందరిపై తీవ్ర చర్యలు తీసుకొంటాము. అందుకు కాంగ్రెస్, బీజేపీలు అంగీకరిస్తాయా? 4.ఇక డిల్లీలో ప్రధాని, రాష్ట్రపతి వంటి కొందరు ప్రముఖులకి తప్ప మరెవరికీ ప్రత్యేక కాన్వాయ్ లను మా ప్రభుత్వం అనుమతించబోదు. అందుకు కాంగ్రెస్, బీజేపీలకు సమ్మతమేనా? 5.ప్రస్తుతం అమలుచేస్తున్న డిల్లీ బడ్జెట్ విధానంలో సమూలమయిన మార్పులు తెచ్చి, డిల్లీ బడ్జెట్ ను ఎక్కడో కార్యాలయాలలో కాకుండా రాం లీలా మైదాన్ లో ప్రజల సమక్షంలోనే మేము ప్రవేశపెట్టాలని భావిస్తున్నాము. డిల్లీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజావసరాల మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని మేము భావిస్తున్నాము. అందుకు ఆ రెండు పార్టీలకు సమ్మతమేనా? 6. అన్నాహజారే జన లోక్ పాల్ బిల్లుకోసం ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. నేటికీ ఆయనను ప్రధానితో సహా రాజకీయ నేతలందరూ మోసం చేస్తూనే ఉన్నారు. మేము అధికారం చేపడితే ఆయన సూచించిన విధంగా డిల్లీ ప్రభుత్వంలో జనలోక్ పాల్ బిల్లును ఖచ్చితంగా అమలు చేసి, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అవినీతిపరులయిన నేతలను, వారికిమద్దతు ఇస్తూ అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ జరిపించి నేరం రుజువయిన వారిని కటకటాల వెనక్కు పంపిస్తాము. మరి అందుకు కాంగ్రెస్, బీజేపీలు సమ్మతిస్తాయా? “మా పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఆశయంతో ఉద్భవించింది. కనుక, మా కార్యాచరణ ఈవిధంగా ఉంటుంది. ఇవి కాక మేము అనేక అంశాలను స్పష్టంగా పేర్కొని వాటిపై ఆయా పార్టీలు మద్దతు ఇస్తామని హామీ ఇస్తే అప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు గురించి ఆలోచిస్తాము. లేకుంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికి గానీ లేదా మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా మేము సిద్దమే,” అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇది వినడానికి చాలా క్రేజీగా ఉన్నపటికీ, నిజానికి ప్రజలు కూడా నిజంగా ఇటువంటి పనిచేసే ప్రభుత్వాన్నే కోరుకొంటున్నారు. అయితే ఇటువంటివి ఏ ‘అపరిచితుడో’ ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాలలోనే ప్రజలు చూసే భాగ్యానికి నోచుకొంటున్నారు తప్ప నిజజీవితంలో చూసే అవకాశం గత ఐదున్నర దశాబ్దాలలో ఎన్నడు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ క్రేజీ కేజ్రీవాల్ దానిని సాకారం చేసి చూపిస్తానని అంటున్నారు. మరి ఇన్ని చీపురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉందని ఆమాద్మీ కుండ బ్రద్దలు కొట్టినట్లు ముందే హెచ్చరిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అమాద్మీకే మద్దతు ఇచ్చి కొరివితో తల గోక్కొనేందుకు సిద్దపడతాయని భావించడం అత్యశే అవుతుంది. అందువల్ల నేటి నుండి కాంగ్రెస్, బీజేపీలు కూడా అమాద్మీపై తమ అస్త్ర శాస్త్రాలు ఎక్కుబెట్టి తమకు తెలిసిన అన్ని టక్కుటమార విద్యలు ప్రదర్శించడం మొదలుపెట్టవచ్చును. ఆ తరువాత అవి ఆమాద్మీని చీల్చే ప్రయత్నాలు చేయవచ్చును.
http://www.teluguone.com/news/content/aam-admi-party-37-28371.html