43మంది వైద్యుల ఉద్యోగాలు తొలగింపు.. ఎందుకో తెలుసా?
Publish Date:Jun 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 43 మంది ప్రభుత్వ వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ చర్య ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. ఇంతకీ ఆ 43 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించడానికి కారణం.. ఏళ్ల తరబడి వారు విధులకు గైర్హాజర్ కావడమే. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా.. అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించింది. ప్రభుత్వ వైద్య సేవల్లో అలసత్వాన్ని, ప్రజారోగ్యంతో ఆడుకునే ఇలాంటి బాధ్యతారాహిత్యాన్ని ఇసుమంతైనా సహించేది లేదని సర్కార్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. గత నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీనిపై సదరు వైద్యులకు పలుమార్లు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్ ప్రకారం.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏడాదికి మించి అనధికారికంగా విధులకు గైర్హాజరైతే.. వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నిబంధనల మేరకు ప్రభుత్వం 43 మంది వైద్యులపై వేటు పడింది.
http://www.teluguone.com/news/content/43-doctors-dismissed-from-service-36-223333.html





