మనుషుల్నిపిట్లల్లా కాల్చేశారు.. పీవోకేలో 19 మంది మృతి.!
Publish Date:Jul 28, 2026
Advertisement
పీఓకే లో హింస పతాకస్థాయికి చేరింది. రావలకోట్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం, స్థానిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాకిస్తాన్ రేంజర్స్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటనతో పీఓకే సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా పీవోకేలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, అదనపు పన్నుల భారం, విద్యుత్ బిల్లుల బలవంతపు వసూళ్లు, ప్రాథమిక మానవ హక్కుల నిరాకరణపై స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ప్రదర్శనలను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. రావలకోట్లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది అక్కడికక్కడే మరణించగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడాన్ని కూడా భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో దాని ప్రభావం పీఓకే ప్రాంతవాసులపై తీవ్రంగా పడింది. తమ ప్రాంత సహజ వనరులను ఇస్లామాబాద్ కేంద్ర ప్రభుత్వం దోచుకుంటూ, తమకు కనీస మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం లేదని స్థానికులు నిరసిస్తున్నారు. ఈ పౌర ఆందోళనలను కప్పిపుచ్చేందుకు, పీవోకే ఆందోళనలకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కకుండా ఉండేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలికాం సేవలపై కూడా ఆంక్షలు విధించింది. పాక్ ఆర్మీ, రేంజర్స్ పీవోకేలో సాగిస్తున్న అణచివేత చర్యలు, దమనకాండ, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఇస్లామాబాద్ యంత్రాంగం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం రావలకోట్ పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వంటి నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. వీధుల్లో భారీ సంఖ్యలో సైనిక వాహనాలు గస్తీ తిరుగుతుండటంతో, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి పీఓకేలో జరుగుతున్న అరాచకాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని స్థానిక ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. PoK Firing, Rawalkot Violence , Pakistan Rangers Action, PoK Protests
http://www.teluguone.com/news/content/-pakistan-army-atricities-in-pok-36-227297.html





