ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ.. కరోనా కల్లోలంతో యూటర్న్ 

కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్(ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన)లో ఎట్టకేలకు చేరింది తెలంగాణ. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఓ ఎంవోయూ(ఒప్పందం) కుదుర్చుకున్నది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సీఎంవో ఈ విషయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యాధికారులు ఈ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు సీఎంవో వెల్లడించింది. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కోసం అవసరమైన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ శ్రీ ఎస్ఏఎం రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరేందుకు తొలుత విముఖత చూపింది తెలంగాణ ప్రభుత్వం.  ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ బెటరని చెబుతూ వస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కరోనా చికిత్సకు లబ్దిదారుడు రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందే వీలుంది. అయితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం ఉంటుందని, అదే ఆరోగ్యశ్రీ అయితే 84 లక్షల మంది ప్రయోజనం పొందుతారని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కూడా పలు సార్లు చెప్పారు.  కరోనా నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో కొంతకాలంగా ఆయుష్మాన్ భారత్ లో చేరతామని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు. అనుకున్నట్లుగానే ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.