తెలంగాణలో మే 30 వరకు లాక్ డౌన్ 

తెలంగాణలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల  30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్  తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న జరుప తలపెట్టిన క్యాబినెట్ మీటింగును సిఎం కేసీఆర్ రద్దు చేశారు.

తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. ఆ నాలుగు గంటల్లో అన్ని వాణిజ్య కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో లాక్ డౌన్ అమలు తీరుపై హైకోర్టు కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులను అభినందించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ ను సరిగ్గా అమలు చేస్తున్నారంటూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను అభినందించింది హైకోర్టు ధర్మాసనం.