మంత్రి పొంగులేటి నివాసంలో కస్టమ్స్ అధికారుల  సోదాలు 

తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో కస్టమ్స్  అధికారులు సోదాలు నిర్వహించారు.  బ్రాండెడ్ వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి ఉన్నారు.   పొంగులేటి హర్షారెడ్డి నివాసంలోనూ కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.  గతంలోనే పొంగులేటి హర్షా రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న విచారణకు రావాల్సిందిగా సమన్లు ఇస్తే   డెంగ్యూ ఫీవర్‍తో బాధపడుతున్నట్టు రిప్లై ఇచ్చారు హర్షారెడ్డి.  ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానన్నారు కానీ హాజరు కాలేదు. దాంతో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 
ఫిబ్రవరి ఐదో తేదీన  చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  మహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి హాంకాంగ్‌ నుంచి సింగపూర్‌ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చారు.  వాచీల్లో ఒకటి పాటెక్‌ ఫిలిప్‌ 5740, రెండోది బ్రెగ్యుట్‌ 2759 ఉన్నాయి.  పాటెక్‌ ఫిలిప్‌ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు.  బ్రెగ్యుట్‌ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్‌లో స్టాక్‌ లేకపోవటంతో కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీల విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం తో స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు.  ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్‌ పేరును వెల్లడించారు.