పుంగనూరు పుడింగికి భారీ షాక్!
posted on Jun 27, 2024 3:33PM
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పెద్దిరెడ్డికి.. పార్టీ పరాజయం తరువాత సొంత నియోజకవర్గంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా పుంగనూరులో పెద్దిరెడ్డి విజయం సాధించినప్పటికీ..సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే భయపడేలా పరిస్థితులు మారిపోయాయి.
భయానికో మరింకెందుకో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఒక్క పుంగనూరులోనే కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాపైనే రామచంద్రారెడ్డి తిరుగులేనిపట్టు సాధించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత జగన్ పెద్దిరెడ్డికి అప్పగించారంటేనే జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ స్థాయిలో పెత్తనం చేలాయించేవారో అర్ధం అవుతుంది. ఏపీలో గత ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి హయాంలో అరాచక పాలన సాగింది. అవినీతి, అక్రమాలతో ప్రజా సొమ్మును వైసీపీ గద్దలు అప్పనంగా దోచేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడంతోపాటు కొందరిని మట్టుబెట్టారు. జగన్, ఆయన బ్యాచ్ చేసిన అరాచకాలతో ప్రజలు నోరువిప్పేందుకు సైతం భయపడ్డారు. చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అడ్డూ అదుపూలేకుండా సాగాయి.
ప్రభుత్వానికి ఫేక్ బ్యాంకు గ్యారెంటీ పెట్టి వందల కోట్లు దోచుకున్న ఘనత పెద్దిరెడ్డిది. అటువంటి పెద్దిరెడ్డికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తేరుకోలేని షాక్ ఇచ్చింది. పుంగనూరు మునిసిపల్ చైర్మన్ అలీం బాష 20 మంది కౌన్సిలర్లతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్లా బాబు సమక్షంలో సైకిలెక్కేశారు. దీంతో పుంగనూరు మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైనట్లే. అధికారికంగా పుంగనూరు మినిసిపల్ చైర్మన్ గిరి తెలుగుశం పార్టీకి దక్కినట్లు ప్రకటన వెలువడటానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ కోల్పివడం మాత్రం తథ్యం అన్న పరిస్థితి ప్రస్తుతం ఉంది.