మహేష్ - రాజమౌళి సినిమాలో సలారోడు..!

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచస్థాయిలో సత్తా చాటిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇది. భారీ బడ్జెట్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందనుంది. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా 'సలార్' స్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి సినిమాల్లో విలన్ రోల్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయి. 'SSMB 29'లో విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందట. హీరో, విలన్ రోల్స్ నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా తలపడేలా ఉంటాయట. అందుకే ఈ మూవీలో విలన్ రోల్ కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ని.. రాజమౌళి రంగంలోకి దింపుతున్నారట. పృథ్వీరాజ్ టాలెంటెడ్ యాక్టర్, పైగా పాన్ ఇండియా గుర్తింపు ఉంది. అందుకే పృథ్వీరాజ్ పై రాజమౌళి దృష్టి పడిందట. పృథ్వీరాజ్ సైతం ఏమాత్రం ఆలోచించకుండా.. ఈ భారీ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.

పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. పలు డబ్బింగ్ సినిమాలతో అలరించాడు. అలాగే 2010లో 'పోలీస్ పోలీస్' అనే తెలుగు సినిమాలో నటించాడు. ఇక గతేడాది ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్'లో మన్నార్ గా అదరగొట్టాడు.