పూరి జగన్నాథ్ కి షాకిస్తున్న మాస్ రాజా!

ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' (Pushpa 2) డిసెంబర్ 6కి వాయిదా పండిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఆగస్టు 15 పై కర్చీఫ్ వేస్తున్నాయి. ఇప్పటికే 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart), 'ఆయ్', '35' సినిమాలు ఆ తేదీకి వస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్టులో మరో సినిమా చేరనుంది.

'షాక్', 'మిరపకాయ్' తరువాత రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.

ఆగస్టు 15న 'మిస్టర్ బచ్చన్' విడుదలైతే.. బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండే అవకాశముంది. రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ కావడంతో 'డబుల్ ఇస్మార్ట్'పై మంచి అంచనాలే ఉన్నాయి. 'మిరపకాయ్' కాంబోలో వస్తున్న మూవీ కావడంతో 'మిస్టర్ బచ్చన్' పైనా అదే స్థాయిలో అంచనాలున్నాయి. మరోవైపు 'ఆయ్' మూవీ వెనుక గీతా ఆర్ట్స్ ఉంటే, '35' వెనుక సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. దీంతో ఆ రెండు సినిమాలకు కూడా మంచి విడుదలే దక్కుతుంది. ఈ లెక్కన ఆగస్టు 15 తేదీకి 'పుష్ప-2' రావట్లేదన్న లోటుని మర్చిపోయేలా.. బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండనుంది. అందునా, గతంలో పూరి-రవితేజ కాంబినేషన్ లో పలు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు బాక్సాఫీస్ వార్ కి దిగడం మరింత ఆసక్తికరంగా మారనుంది.