రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం..!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలవుతుందని మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది.

రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. మధ్యలో శంకర్ 'ఇండియన్ 2' తో బిజీ కావడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇంకా రెండు వారాల షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది. రిలీజ్ డేట్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. అక్టోబర్ చివరిలో లేదా డిసెంబర్ చివరిలో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే అక్టోబర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం లేదని, డిసెంబర్ లో కూడా అనుమానమేనని అంటున్నారు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చూపు సంక్రాంతిపై పడినట్లు సమాచారం.

'గేమ్ ఛేంజర్' లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు సోలో రిలీజ్ తో పాటు, లాంగ్ రన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే భారీ ఓపెనింగ్స్ తో పాటు, ఫుల్ రన్ లో రికార్డు కలెక్షన్స్ వస్తాయి. అయితే డిసెంబర్ లో విడుదల అనేది.. 'గేమ్ ఛేంజర్'కి అంతగా కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 6న 'పుష్ప-2', జనవరి 10న 'విశ్వంభర' ఉన్నాయి. ఈ రెండు భారీ సినిమాల మధ్యలో 'గేమ్ ఛేంజర్' విడుదలైతే.. ఖచ్చితంగా కల్లెక్షన్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అందుకే ఈ సినిమాకి సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు చిరంజీవి సైతం తన కుమారుడు కోసం సంక్రాంతి సీజన్ ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట. అదే జరిగితే 'విశ్వంభర' జనవరి చివరికి లేదా మార్చికి వాయిదా పడే అవకాశముంది.