'కల్కి 2'లో మరో ఇద్దరు హీరోలు.. కన్ఫర్మ్ చేసిన నాగ్ అశ్విన్!

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. అలాగే 'కల్కి'లో నాని కూడా అతిథి పాత్రలో కనిపిస్తాడని సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగింది. కానీ సినిమాలో నాని క్యామియో లేదు. అయితే నానితో పాటు, మరో హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ పార్ట్ లో మెరుస్తారని నాగ్ అశ్విన్ చెప్పారు.

'కల్కి' చిత్రం భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "వైజయంతి బ్యానర్ లో నటించిన పలువురు హీరోలు కల్కిలో సందడి చేశారు. కానీ నాని, నవీన్ కనిపించకపోవడానికి కారణమేంటి?" అనే ప్రశ్న ఎదురు కాగా.. "నాని, నవీన్ ఈ పార్టులో కుదరలేదు. కానీ నెక్స్ట్ పార్టులో ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేస్తాను." అని నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. "శ్రీ కృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో అంటున్నారు కదా.. మీ అభిప్రాయం?" అని ప్రశ్నకు.. "ఈ సినిమాలో కాదండి.. కానీ వేరే సినిమాలో ఆయన చేస్తే బాగుంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు.