కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య...

 

హైదరాబాద్‌లో ఘోరమైన సంఘటన జరిగింది. ఓ తండ్రి బంగారం లాంటి ఇద్దరు కుమారులను దారుణంగా చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గురుప్రసాద్ అనే వ్యక్తికి, ఆయన భార్యకి మనస్పర్థలు ఏర్పడటంతో వారిద్దరూ కొంతకాలం క్రితం విడిపోయారు. వారికి విరించి, విహారి అనే ఇద్దరు కుమారులున్నారు. రెండు రోజుల క్రితం తన మాజీ భార్య దగ్గరి నుంచి ఇద్దరు కుమారులను గురుప్రసాద్ తనతో తీసుకుని వెళ్ళాడు. అయితే ఆదివారం నాడు గురుప్రసాద్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆ తల్లి తన కుమారులు ఎక్కడున్నారో అర్థంకాక తల్లడిల్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మేడ్చల్ ప్రాంతంలోని బీరప్ప గూడ రైల్వేట్రాక్ దగ్గర పూడ్చిపెట్టిన విరించి, విహారి మృతదేహాలను కనుగొన్నారు. ఈ ఇద్దరు పిల్లలను తండ్రి గురుప్రసాదే చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే ఈ హత్యలు, ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.