Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 91


    "ఎవరిష్టానికి వారిని  వదిలేసినందువల్లే  ఇంత దూరం వచ్చింది. ఈ ఇంటితో నాకిక సంబంధంలేదు. నా కోసం ఉన్న ముసల్ది కూడా వెళ్ళిపోయింది. పద మనింటికి  పోదాం. అందరూ కలిసి  నాకూ నా కొడుకుకీ  అన్యాయం చేశారు. ముసిల్ది కూడా  ఇలా చేస్తుందని  అనుకోలేదు" అన్నారు.
    "ఆవిడ్ని  అనకండి. ఆవిడేమీ  చెయ్యలేదు" అన్నాను.
    అలా మాట్లాడుతూ మేము నడుచుకుంటూ  ఇరవై  గజాల  దూరం కూడా వెళ్ళలేదు. ఇద్దరు పరుగెత్తుకువచ్చి, "మీరిలా  వెళ్ళిపోవడం  బాగులేదు సార్!" అన్నారు.
    "సరోజా  వెళ్ళిపోవడం  బాగుందా? దానికి  ఈ ఇంటితో  సంబంధం లేనప్పుడు  నాకూ లేదు" అన్నారు శ్రీశ్రీగారు.
    "అలాగంటే  కాద"ని  వాళ్ళు కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు.
    "మీరు వెళ్ళండి. సరోజని వదిలేసి వస్తాన"ని  చెప్పేశారు  శ్రీశ్రీగారు. ఆ నాలుగు రోజులూ, ఉదయం బైజూ, ఆయనా వెళ్ళి వచ్చేవారు. మొత్తంమీద ఆ కార్యక్రమం  సక్రమంగానే  జరిగింది.
    
                          *    *    *   
                      ఇంకా నయం - ఈయన మావారండి

 

    శ్రీశ్రీగారు ఆవిడ వియోగంతో  కొంతకాలం  మనసులోనే  బాధపడ్డారు. నేను మాటలతో  పన్లతో  మరపించేదాన్నని  అనుకోడం వరకే  అనుకుంటాను. ఆయన మహానుభావులు! గుండె నిబ్బరం ఎక్కువే. కానీ చివరికి తనతో ఒక్కమాటైనా  చెప్పకుండా తన కొడుక్కి (బైజుకి) ఆవిడ అన్యాయం  చేసిందని  మాత్రం  ఆఖరివరకూ వాపోయారు.
    ఆ ఇంటికి మాకూ క్రమేపీ  రాకపోకలు  తగ్గిపోతూవచ్చాయి. అయినా వారికి ఆ ఇంటిమీద మోజు ఎక్కువే. వీధి వరండాకి  ఆనుకొని వున్న కుడివైపు రూముని  తన బెడ్రూమ్ చేసుకున్నారు.
    (అది  రవణమ్మగారి ఏర్పాటే. టెలిఫోన్, వారి బీరువా, మంచం, టేబుల్...అన్నీ చక్కగా అమర్చివుంచిందావిడ. చుట్టూ కొబ్బరిచెట్లతో  బ్రహ్మాండమైన  వెలుతురూ  గాలీ కూడా ఆ గదికి వుండేవి)
    మధ్యాహ్నం పూట వెళ్ళి  ఒక్కోసారి  భోజనంచేసి  ఆ గదిలోనేపడుకొని వస్తూ వుండేవారు. అదికూడా  అట్టేకాలం సాగలేదు.
    ఒకరోజు  చిన్నబోయిన  ముఖంతో  వచ్చారు. నేను ఇట్టే కనిపెట్టేశాను. వారు వీధిలోకి  వెళ్ళివస్తే  ముఖభావంగా చూసే అర్ధం చేసుకొనేదాన్ని. చాలాసేపు  బ్రతిమాలుకున్న  తర్వాత విషయం చెప్పారు.
    ఈ ముందు ఇంటితోపాటు  ఆ గదికూడా  ఇస్తే అద్దె ఎక్కువవస్తుంది. అందువల్ల ఆ గది కూడా ఖాళీచేసి  ఇచ్చేస్తున్నామని  అన్నారుట. నా గుండెలో  కత్తి దింపినట్టు అయ్యింది. వెంటనే తమాయించుకొని, "పోతేపోయింది మీరెందుకండీ  బాధపడతారు? మీకేం ఖర్మమండీ_ఇంతపెద్ద  ఇల్లువుంది. ఇది మీదికాదా? మీ కోసం అవస్థపడుతూ ప్రాకులాడుతున్నవాళ్ళని వదిలేసి, ఎందుకండీ  ఆ ఇంటికోసం  అవస్థపడతార"ని నేను ఏడుస్తూనూ,కోపంగా కూడా అన్నాను.
    ఈ మాటలు  విన్న మా పిల్లలు కూడా, "ఇక అక్కడికి వెళితే ఒప్పుకోం అప్పా! అక్కడికి వెళ్ళి  మనస్సు పాడుచేసుకోవద్ద"ని  మొండి పట్టుపట్టారు.
    స్టూడియోకి  వెళ్ళే  తోవలో  బుద్ధిపుట్టినప్పుడు  నెలకోసారో  రెండు సార్లో  వెళ్ళేవారు. రోజూ వెళ్ళానన్నా నేను బాధపడేదాన్నికాను. ఆయన బాధ ఏమిటో అర్ధం చేసుకున్న నాకు తెలుసు. ఆ ఇంటిమీద, తన ప్రతీ రక్తపు బొట్టూ ధారపోశారు. అంటే_డబ్బు  విషయంలో_ నయాపైసా దగ్గర్నుండీ వారి కష్టార్జితమే.
    ఇన్ కమ్ టాక్స్  కోసం  ఆవిడ పేరు పెట్టారు. బైజుకి సూది మోపినంత జాగా  అయినా ఆ ఇంట్లో దక్కుతుందని ఆశించారు. అది వారికి పెద్ద డిసప్పాయింట్  అయ్యింది.
    'శ్రీ రంగం' అన్న యింటి పేరుతో, పెద్దగేటు పిల్లర్సుతో బోర్డు  రాయించింది కూడా అందుకే.
    "సరోజా! నువ్వు బాధపడుతున్నావా?" అని అడిగారు.
    'దేనికండీ?" అని అడిగాను.
    "బైజుకి  ఆ ఇంట్లో వాటా రానందుకు" అన్నారు.
    "భలేవారండీ. మీ పెంపుడు కూతురు మాత్రం  పరాయిదా? కన్న ప్రేమకన్నా పెంచిన ప్రేమ హెచ్చంటారు. మీరు రెండిళ్ళు  సంపాదించారు. అయితే ఆ ఇల్లు కేవలం  మీ కష్టార్జితమే. చిల్లి గవ్వ కూడా ఎవరూ సాయం చెయ్యలేదు. పోతే_ ఈ ఇల్లు  నా పెళ్ళికిముందే కొనుక్కున్నాను.
    నేను కష్టపడి  సంపాదించినదైనా  మీరివ్వబట్టేకదా  కొనగలిగాను" అన్నాను.
    "అదికాదు సరోజా!" అన్నాను.
    "చూడండి. అనవసరంగా  మనస్సు పాడుచేసుకోవద్దు. మందవల్లిలో  మనకున్న  ఈ ఇల్లు  దక్కించుకుంటే  చాలు. ఆ ఇంటి సంగతి మరచిపొండి. నాకేమీ బాధలేదు.
    మీకు తెలిసి  ఈ అన్యాయం జరిగితే  కొంచెం  బాధపడేదాన్ని. మీ కళ్ళే కట్టేసి  చేసిన అన్యాయానికి ఏం చేస్తారు? ఆ ఇల్లు  పరాయివాళ్ళకి పోలేదు. అనుభవించనీయండి. మీరేం బాధపడకండ"ని అన్నాను.
    తర్వాత  గిట్టనివాళ్ళు  చిన్న చిన్న గొడవలు  తెచ్చి, మమ్మల్ని కదుపుదామని చూసినా ఆ వైపు నేను తిరిగి చూడలేదు. ఒకసారి మాత్రం  వారి మాట కాదని సహృదయంతో  ఆ ఇంటికి వెళ్ళాను. దానికి తగిన  అనుమానాల అవమానం పొంది, వెనక్కి వచ్చేశాను. మళ్ళీ నేటిదాకా  ఆ వైపు తిరిగి చూడలేదు. ఎవరి బాధ వాళ్ళు పడుతున్నాం. ఎక్కడి దొంగలు అక్కడే  గప్ చుప్  అన్నట్టు  అయిపోయింది.
    ఒకరోజు_నేనూ మా వారూ  గూడూరులో  ఒక పిక్చర్ పూజ&షూటింగ్ కి వెళ్ళాం. అక్కడ రెండు రోజులుండి, మళ్ళీ రైలులో  బయలుదేరాం. రాత్రి రెండున్నర  గంటల తర్వాత బండిలో ఎక్కాం. సిటింగ్ మాత్రమే. బెర్త్ లు లేవు. మేమిద్దరం కూర్చున్నాం.
    తోటి  ప్రయాణీకుల్లో  ఒకాయన  శ్రీశ్రీగారిని  చూసి, "మీ అమ్మాయా" అని నన్ను చూపించి అడిగారు.
    ఆయనను  నోరెత్తనివ్వకుండానే, "ఇంకా నయం. భలేవారండీ_ఈయన మావారండీ" అన్నాను.
    శ్రీశ్రీగారు ఏమనుకున్నారో ఏమో!
    "మాకు నలుగురు పిల్లలు" అని కూడా చెప్పాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS