"నాన్నగారూ!....ఏంటిది?!......మీరు నాకు....." అంటున్న జయంతిని వారించి......
"నేను చేయలేని పనిని నువ్వు చేశావమ్మా. నువ్వు పుట్టినప్పుడు కొడుకు పుడితే బావుండేది అనుకున్నాను. కొడుకే పుట్టినట్లయితే వాడు ఇంత ఘనకార్యం చేస్తాడని నేను అనుకోను, నువ్వు నా పాలిట దేవతవు తల్లీ....నీ పెళ్ళి చేయ....లే....క....పోయాను?" అంటూ భోరున ఏడ్చేశాడు అయన. కూతురి ప్రయోజకత్వం చూసి ఆయనకు ఒకపక్క సంతోషం వేస్తుంటే, కన్నతండ్రిగా కూతురికి పెళ్ళి చేయలేకపోగా దాని పైన కుటుంబ భారమంతా పెట్టానే అనే దిగులు ఆయన్ని కృంగదిస్తుంది. అయన ఏడుస్తుంటే పిల్లలందరూ......
"నాన్నగారూ....." అంటూ ఘొల్లున ఏడ్చేశారు.
కస్తూరి కూడా నిశ్శబ్దంగా పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటుంది.
"చాలమ్మా.....చాలు! ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు. నా పిల్లలు ప్రయోజకులయ్యారు. నాకది చాలు! కానీ అమ్మా జయంతీ! నీకు చెప్పే సాహసం ధైర్యం కూడా నాకు లేదు. అయినా కన్నతండ్రిగా చెప్పాల్సిన బాధ్యత నాపై వుంది."
"ఏంటి నాన్నా....." అంది జయంతి ఏడుస్తూ.
"నువ్వు కూడా పెళ్ళిచేసుకో తల్లీ! ఇప్పటివరకు తమ్ముళ్ళను, చెల్లిని చదివించావు, చాలు....ఇక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. ఇకనైనా నీ గురించి ఆలోచించుకో. ఇది మీ నాన్న చివరి కోరిక తల్లీ!" అన్నాడు అయన గద్గద స్వరంతో.
"ఏమండి.....ఏమిటండి ఆ మాటలు...." అంటూ కస్తూరి భోరున ఏడుస్తూ అయన దగ్గరకు వచ్చింది.
ఆమె కేకలతో అందరూ ఆ గదిలోకి పరుగున వచ్చారు.
"చేసుకుంటాను నాన్న తప్పక చేసుకుంటాను. మీరు బాధపకండి. నేను పెళ్ళి చేసుకుంటాను." అంది జయంతి ఏడుస్తూ.
"చాలమ్మా! చాలు. ఇక నాకు ఏ దిగులు లేదు. ఇప్పుడే నేను లేచి కుర్చోగలను. నా బంగారుతల్లే నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది" అంటూ ఆయన మెల్లగా లేచి మంచం పైన కూర్చున్నాడు.
అందరి ముఖాల్లో అనందం వెల్లివిరిసింది.
కస్తూరి అనందం పట్టలేకపోయింది.
"దాక్షాయణి, పార్వతి.....బాబూ మాధవా! మీ అన్నయ్య లేచి కూర్చున్నారు బాబు....ఇన్నేళ్ళనుంచి నోటివెంట మాట కూడా పడిపోయి మంచంలో ఉండిపోయిన మీ అన్నయ్య ఈరోజు మాట్లాడారు. అంతా నా బంగారుతల్లి మహిమ- జయంతీ నువ్వు మా కూతురివి కాదు తల్లీ- మా పాలిట దేవతవి!" అంటూ ఏడుస్తూ ఆనందంగా చెప్పింది.
అందరూ తృప్తిగా ఉపిరీ పీల్చుకున్నారు. ఆ దృశ్యం చూసి అందరి కళ్ళు చమర్చాయి.
43
జయంతి వడివడిగా నడుచుకుంటూ లైబ్రరీ రూంలోకి వెళ్ళబోయింది. అంతలో ఎదురుగా "హలో" అన్న మాటలు వినబడటంతో తలెత్తి చూసింది.
ఎదురుగా ఇంగ్లీసు లెక్చరర్ ఉమామహేశ్వరరావు నవ్వుతూ నిల్చుని వున్నాడు.
జయంతి కూడా నవ్వి-----
"హలో!" అంది అతన్ని నిశితంగా చూస్తూ.
"ఏంటి - ఈరోజు లేటయినట్లున్నారు?" అడిగాడు పోలైట్ గా,
"అవునండి! బస్సు లేటయింది....." అంది ఇబ్బందిగా నవ్వి.
"ఓ.కే.....క్యారియాన్...." అన్నాడు హుందాగా నడుచుకుంటూ వెళ్తూ.
అతని రూపం జయంతి మస్తిష్కంలో కిన్ని క్షణాలు అలానే వుండిపోయింది. లోపలికి వెళ్ళి తన చైర్ లో కూర్చుంది.
ఫ్యున్ గాజు గ్లాస్ తో వినయంగా మంచినీళ్ళు తెచ్చి టేబుల్ పైన పెట్టాడు. జయంతి థాంక్స్ చెప్పి, గటగటా సగం గ్లాసు ఖాళి చేసింది.
రిజిస్టర్ తీసుకుని అందులో సంతకం చేసింది.
టేబుల్ పై వున్న ఫైల్ ఓపెన్ చేసి తిరగేయసాగింది.
లైబ్రరీ అంతా నిశ్శబ్దంగా వుంది. ఫస్ట్ అవర్ కనక స్టుడెంట్స్ పలచగా వున్నారు. మొత్తం పదిమంది వరకు వుంటారు. మ్యగజైన్స్ సెక్షన్ లో ఒక అబ్బాయి, అమ్మాయి పక్క పక్కనే కూర్చుని వున్నారు. ఇద్దరూ ముఖానికి న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకుని మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటున్నారు. జయంతి వాళ్ళని ఆశ్చర్యంగా గమనిస్తోంది. ఫైల్స్ రిఫర్ చేసి వాటిపైన సంతకాలు చేసింది.
"రామయ్యా!" పిలిచింది.
"అమ్మా! అంటూ వాడు పరుగున వచ్చి వినయంగా నిల్చున్నాడు.
ఈ ఫైల్స్ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వు అంటూ మళ్ళీ ఆ యువ జంటను చూసింది.
వాళ్ళిద్దరూ పరిసరాలను మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరి చేతుల్లోనూ న్యూస్ పేపర్లు తలక్రిందులుగా వున్నాయి.
జయంతికి నవ్వొచ్చింది. కోపం వచ్చింది.
"రామయ్యా!" అని మళ్ళీ పిలిచింది జయంతి.
బయటకు వెళ్ళబోయేవాడల్లా "అమ్మా" అంటూ వినయంగా వచ్చి నిలుచున్నాడు.
"ఆ మ్యాగజైన్ సెక్షన్లో కూర్చున్న వాళ్ళిద్దరికీ చేతిలో పేపర్స్ సరిగా పట్టుకుని చదవమని చెప్పు" అంది సీరియస్ గా.
రామయ్య వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్ళాడు.
"మేడం! మిమ్మల్ని పేపర్ సరిగా పట్టుకుని చదవమంటున్నారు" చెప్పాడు వాడు సీరియస్ గా.
ఇప్పుడు చూసుకున్నారు వాళ్ళు. పేపర్లు తలకిందులుగా పట్టుకుని చదువుతున్నామని ఇద్దరూ ఖంగుతిన్నారు.
పేపర్లు టేబుల్ పైన పడేసి సిగ్గుతో తలదించుకుని జయంతి దగ్గరకు వచ్చి "సారీ మేడం" అని చెప్పి తలదించుకుని బయటకు వెళ్ళిపోతున్న వారిని,
