"తమ్ముడు దిగులుతోనే పోయాడమ్మా.....నీకు బదులుగా నన్ను తిసుకుపోయినా బాగుండేది కదా తమ్ముడూ.....తమ్ముడూ....నోరారా అక్కయ్యా అని పిలిచేవాడివికదరా తమ్ముడూ....తమ్ముడూ....అక్కయ్యా నా కూతురిని చేసుకోవే అని ఎంత ప్రేమగా అడిగావురా తమ్ముడూ.....తమ్ముడూ....చిన్నదాని పెళ్ళి చూసుకోకుండానే పోయావట్రా తమ్ముడూ. తమ్ముడూ......" అంటూ భ్రమరాంబ లోపల శోకాలు పెట్టి ఏడుస్తోంది.
ఆ సాయంసంధ్యలో ఆమె పెట్టె శోకాలు...అక్కడ గుమ్మికూడిన వారందర్నీ కలిచి వేస్తున్నాయి.
ఆ వూరి జనం అంతా అక్కడచేరి రామశేషుతో తమకున్న అనుబంధాన్ని గూర్చి చెప్పుకుంటున్నారు.
చీమకు కూడా అపకారం చేయనివాడు అంటూ అయన గొప్పదనాన్ని గూర్చి చెప్పుకుంటున్నారు.
చికటిపడుతూ వుండటంతో మాధవరావు గ్యాస్ లైట్లు తెప్పించి పెట్టాడు.
బంధుమిత్రులు అందరూ వచ్చేసరికి అర్ధరాత్రి దాటుతుంది కనుక దహన సంస్కారాలు రేపోద్దుటే చేయాలనుకున్నారు. ఈ రాత్రంతా శవ జాగారమే చేయాలి.
సుందరం ఒక్కడే డాబా పైన కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఏడుస్తున్నాడు.
నేను చేసిన నీచమైన పనే నిన్ను బలి తీసుకుంది కదా అన్నయ్యా! నా పాపానికి నిష్కృతి లేదు.
'తమ్ముడూ ఇలా ఎందుకు చేశావురా' అని నా చెంపలు పగలుకోట్టినా బావుండేదిరా అన్నయ్యా. నన్ను ఒక్కమాట కూడా అనకుండా "తమ్ముడు వచ్చావా!" అంటూ నన్ను ఓదార్చి, నువ్వు మాకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయావా అన్నయ్యా. ఎండుకన్నయ్యా నాకు ఇంత పెద్ద శిక్ష వెశావూ.....అంటూ లోలోపల కుమిలిపోతూ, సిగరెట్ కాలుస్తూ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు సుందరం.
సరిగ్గా అదే సమయానికి అక్కడికి జయంతి వచ్చింది. బాబాయ్ అలా నిశ్శబ్దంగా ఏడుస్తుండటంతో ఆమె మనసు ద్రవించిపోయింది. మాధవరావు బాబాయ్ సుందరాన్ని పిలుచుకురా జయంతీ! ఎక్కడున్నాడో చూడమంటే అంతా వెతికి పైకోచ్చింది. అక్కడ ఆమె కంటపడిన బాబాయ్ కుమిలికుమిలి ఏడుస్తుండటంతో ఆమెకు కూడా దుఃఖం ఆగలేదు.
"ఏంటి బాబాయ్ ఇది....పోయిన పెదన్నాన్న తిరిగివస్తాడా? ఊరుకో బాబాయ్" అంది ఓదార్చుతూ.
"అమ్మా జయంతీ! నేనే మీ పెదనాన్నని చంపేశానమ్మా, నన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఎందుకురా ఇలా చేశానని నన్ను కొట్టినా, తిట్టినా నేను అంతగా బాధపడేవాడిని కాను, నాకు మౌనంగా శిక్ష విధించి వెళ్ళిపోయాడు" అంటూ భోరున ఏడుస్తున్న బాబాయ్ ని ఎలా ఓదార్చాలో జయంతికి అర్ధం కాలేదు.
ఆమె కూడా అతనితో పాటు ఏడుస్తూ "ఊరుకో బాబాయ్!" అంటుంది.
కాసేపటికి సుందరం తనని తాను సంభాళించుకున్నాడు.
చొక్కాతో ముఖం తుడుచుకుని సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. జయంతికి బాబాయ్ ని చూస్తే భయం వేసింది. ముఖం పిక్కుపోయి, గెడ్డం పెరిగిపోయి, కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా తయారయి జివశ్చవంలా వున్నాడు. అతను చేసిన తప్పుకు పశ్చాతాపపడుతున్నాడు.
మనిషిని పశ్చత్తాపం ఇంతగా దహించివేస్తుందా? అని అనుమానం కలిగింది జయంతికి.
"పద బాబాయ్ కిందకు వెళ్దాం.....మాధవరావు బాబాయ్ పిలుస్తున్నాడు" అంది జయంతి.
"పదమ్మా పోదాం" అన్నాడు నెమ్మదిగా ఆమె వెనకనే అడుగులు వేస్తూ.
"ఏంట్రా సుందరం ఎక్కడికెళ్ళావ్?" అన్నాడు మాధవరావు.
"పైన డాబామీద వున్నానన్నయ్యా!" అన్నాడు నీరసంగా.
"అక్కడేం చేస్తున్నావ్ ఒంటరిగా" అన్నాడు అందోళనగా.
అతనేం మాట్లాడలేదు. "సరే! ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే వస్తా" అంటూ "జయంతీ ఇటు రామ్మా" అని జయంతిని పక్కకు పిలిచి నెమ్మదిగా చెప్పాడు.
"వాడి వాలకం చూస్తుంటే ఏదైనా అఘాయిత్యం చేసుకునేలా వున్నాడు. రామశేషు అన్నయ్య తన మూలంగానే చనిపోయాడని బాధపడుతున్నాడు. కాస్త వాడిని ఓ కంట కనిపెడుతూ ఉండమ్మా" అన్నాడు.
జయంతికి బాబాయ్ చెప్పిన మాటలు నిజమే అనిపించింది. ఎందుకంటే సుందరం బాబాయ్ వాలకం అలానే వుంది.
"అలాగే బాబాయ్" అంది జయంతి.
33
కాలచక్రంలో ఏడాది గిర్రున తిరిగిపోయింది.
ఈ ఏడాది కాలంలో సర్వోత్తమరావు కుటుంబంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఎవరు వద్దంటున్నా వినకుండా పట్టుపట్టి సుందరం పట్టణం వెళ్ళిపోయాడు.
భార్యాపిల్లల్ని తీసుకుని ఆ విజయవాడ మహాపట్టణంలో మాధవరావు సహకారంతో ఓ ఇల్లు తీసుకుని వేరే కాపురం పెట్టాడు.
కాంట్రాక్టు పనులు మానేసి తను కూడా వస్త్రదుకాణమే ప్రారంభించాడు. మొదట్లో కాస్త ఆటుపోట్లు ఎదుర్కున్నా క్రమంగా ఆ వ్యాపారానికి అలవాటుపడిపోయాడు. దానికి మాధవరావు సహకారాన్ని పూర్తిగా అందించాడు. శివపార్వతి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ అందర్నీ వదిలి పట్టణం వెళ్ళిపోయింది.
సురేంద్ర, గిరిజలది ఒక ప్రపంచం. వాళ్ళకి మరొకరి విషయాలు పట్టవు. ఎవరితో మాట్లాడరు. పెళ్ళయిన కొత్తలో సురేంద్ర మొహమాటం కోసమైనా జయంతిని, దాక్షాయణిని పలకరించేవాడు ఇప్పుడసలు మాటా పలుకు లేకుండా బిగదిసుకుపోతున్నాడు.
