తనకు కూడా ఉత్తరం వుండడంతో ఆశ్చర్యపోయింది రీటా.
అయినా సమాధిలోకి వెళ్ళబోతూ ఇలా ఉత్తరాలు రాయడమెందుకో? అది తప్పని తెలిసినా , బాధ్యతగల కలెక్టరు కు రాసిన లెటర్ ని తెరిచి చూసింది ఆత్రుతగా రీటా.
"మిస్ ధీరజా నన్ను గురించి మీ ఆఫీసర్లు వాదించుకున్నా విషయం నాకు తెలుసు. నా ప్రాణాలు నిలుస్తాయో లేదోననే సందేహంతో నేను సమాధిలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చే విషయమై మీలో మీరే తక్కించుకుంటున్నారు. కానీ చివరకు మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు.
కారణం నాపై నీకు అచంచలమయిన విశ్వాసం వుంది. నాకు ఒక విధంగా మొన్నటివరకు అంతటి నమ్మకమే వుంది. కానీ ఈ జనారణ్యములో పవిత్రంగా మనశ్శాంతితో నిర్మలంగా బ్రతకాలన్నా కష్టమే! నేను సంసార జీవితానికి దూరంగా వున్నా, ఒకప్పుడు నేను కోరుకున్న వాళ్ళు.......ఇప్పుడు నేను కావాలనుకుని నాకు దగ్గరయిన వాళ్ళు కూడా నా నిగ్రహాన్ని పరీక్షిస్తున్నారు.
"దృడదీక్షతో పూజాదికాలు నిర్వహించే నాలో సైతం ఇప్పుడు తడబాటు మొదలయింది. అది బౌతికమే కావచ్చు. కాని అది నా పతనానికి నాందిగా భావించాను. అందుకే నా అంతట నేను సమాధిలోకి వెళ్ళి పోవాలని నిశ్చయించుకున్నాను. నాలోని యోగశక్తి నన్ను కాపాడుతూనే వుంటుందని నాకు తెలుసు. కానీ రకరకాల ఆలోచనలతో నా మనసు కలుషితం అయిపొయింది. ఇక మహా అయితే మూడున్నర గంటలపాటు నేను ప్రాణ వాయువును నిశ్చలంగా స్తంభించగలనేమో! అంతకుమించి యోగ సమాధిలో నేను వుండలేకపోవచ్చు. నాలుగు గంటల తర్వాత నేనెటూ ప్రాణాలతో వుండను. కాబట్టి సమాదితవ్వి నా మృతదేహాన్ని చూడవలసిన పనిలేదు. ఇప్పుడు మీరు మీ స్వహస్తాలతో చేసిన సమాదినే నా జీవ సమాధిగా భావిస్తున్నాను......
గుడ్ బై టు యూ అండ్ అల్"
పూర్తిగా చదివిన రీటాకు మతిపోయినంత పనైంది.
మైగాడ్ చదివిన రీటాకు మతిపోయినంత పనైంది.
మైగాడ్ అనుకుంటూ వాచీ చూచుకున్నదామె.
విష్ణు చెప్పిన టైం కి ఇంకా అరగంట మాత్రమే వ్యవధి వుంది.
లెటర్లో
రాసిన ప్రకారం అయితే మూడున్నర గంటలు గడిచి పోయాయి కాబట్టి విష్ణు ప్రాణాలతో వుంటాడో లేదోననే సందేహం వచ్చిందామెకు!
ఇప్పుడు ఏం చేయాలి తాను?
ఎలుగెత్తి అరిచినా తన మాటలు ఎవరూ నమ్మరు.
తాను ఇప్పుడు ఏం చేసినా సమాదిలోని విష్ణును బయటకు రప్పించలేదు. ఒక్క కలెక్టర్ ధీరజ తప్ప తన మాటలు ఎవరూ పట్టించు'కోరు. ఆమెను కలిసి ఈ లెటర్ యిస్తే తప్ప విష్ణును రక్కించుకోలేదు తను.
అయినా సమాధి తవ్వే లోపు విష్ణు ప్రాణాలతో వుంటాడో లేదో!
ఆ మాట అనుకోవడం ఆలస్యం జన సందోహాన్ని నెట్టుకుంటూ ధీరజ కోసం పరుగు తీసింది రీటా.
కానీ, మహా ప్రవాహంలాంటి భక్త జనులు దారి తొలగితే కదా!
విష్ణు సమాధిలోకి వెళ్ళిన చోటే చింతా క్రాంతురాలై కూర్చుని వున్నది ధీరజ.
రీటా ఎలగయినా ఆమెను చేరుకోవాలనే విశ్వ ప్రయత్నం చేస్తూన్నది.
ఆడ్డుగా వున్న వాళ్ళను నెట్టుకుంటూ అంగుళం అంగుళం చొప్పున ముందుకు చొచ్చుకుని వస్తున్న]దామె.
నిముషాలు భారంగా కదిలిపోతున్నాయి.
రీటాకు ఏడుపు వచ్చినంత పనయింది.
విష్ణు ప్రాణాలతో బయటపడే అవకాశం అంటూ ఏమయినా వున్నదీ అంటే అది తన చేతిలో వున్నది. కాని తను బయట పడాలంటే ఈ జనం త్రోవ వదలాలి. మొండి విశ్వాసంతో వున్నజనం తనకు త్రోవ ఎలా యిస్తారు?
రీటా అలుపు అయాసాలను లేక్కవేయడం లేదు. బహుశా ఆమె జీవితంలో ఎప్పుడూ అలా ఆరాటం చెందలేదేమో! తనకు ఏమీ కాని వ్యక్తీ కోసం....ఒక పరాయి వ్యక్తిని కాపాడాలన్న తాపత్రయంతో అంతగా వెంపర్లాడడం అదే తొలిసారి.........చివరిసారి కావచ్చు! అప్పటికి నాలుగు గంటలు దాటింది.
అతి కష్టం ,మీద ధీరజను సమీపించి వగరుస్తూ నిలిచిందామె.
"వాట్ హపెండ్ రీటా"
ధీరజ మాటలను పట్టించుకోకుండా విష్ణు యిచ్చిన ఉత్తరాన్ని ఆమె చేతుల్లో వుంచింది, ఇక మాట్లాడే సమయం కూడా లేనట్టు దీనంగా రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది.
చదివిన ధీరజ స్థాణువై పోయింది.........నోట మాట రానట్టు బిగుసుకుపోయింది.
వాళ్ళ పరిస్థితి గమనించిన కమీషనర్ పృద్విరాజ్ ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాడు విషయం ఏమిటో అర్ధమైందతనికి.
"కమాన్ హరియప్ వెంటనే సమాధిని తవ్వండి" కమీషనర్ సిబ్బందిని ఆదేశించాడు.\
ధీరజలో అప్పుడు కదలిక వచ్చింది.
"నో వద్దు విష్ణు ఆఖరి కోరికను మన్నించడం మన కర్తవ్యం"
"మిస్ ధీరజా......డోంట్ టాక్ పూలిష్. ఇప్పుడు సమాధి తవ్వగలిగితే విష్ణుని మనం రక్షించినవాళ్ళమవుతాము....." కమీషనర్ కోపంగా అన్నాడు.
"విష్ణు తన హస్తాలతో రాసిన లెటర్ చదివారుగా.......అతడు ఉద్దేశ్యపూర్వకంగానే తాను సమాధి కావడానికి సిద్దపడ్డట్టు తెలుస్తున్నది. అందుకే కావాలని నాలుగు గంటల వ్యవధి చెప్పాడు. లెటరులో రాసిన ప్రకారం మూడున్నర గంటల వరకు మాత్రమే తాను ప్రాణాలతో వుండగలను అన్నాడు.......ఆ సమయం మించిపోయి అరగంట పైనే అయింది.
