"ఉండు ముండుము అతడు రంగు వేయుచున్నాడని కదా పల్కితివి? ఎక్కడ?
"ఆ గది తలుపులకు, కిటికీలకు వేయుచుండెను. నేనేగుసరికి రెండు పూర్తియైనవి.
"కాని యిది నీ కాశ్చర్యదాయకము కాలేదా? రాత్రి యేడుగంటలకు వేయుచుండుటేమి? ఏమందువు?
"అది చిత్రమే! కాని యతడింకను చిత్రపు మనిషి భార్య చిత్రమును చింపుట చిత్రము కాదా? అదియుగాక వానికి వేరొకపని యేదియు దోచుట లేదు మనస్సు త్రిప్పుకొనుట కేదైన చేయవలదా?"
"సరే! మరేమైనను చెప్పవలసినది కలదా?"
"కలదు ముఖ్యమైన దదియే! నేను రైలెక్కునంతట సరిగా నాకు దారి జూపిన మనుజుడే తాను గూడ ప్రక్క బండిలోని కెక్కినాడు. ఆ ముఖము, ఆ మీసములు ఆ కోరచూపులు.
"ఆ బంగారు సులోచననములు, ఆ కుక్క మూతి చేతికర్ర."
"ఓహో! అసమాన ప్రజ్ఞానిధి యగుచున్నావే! అది నీ వెట్లు గ్రహించితిని?"
"దానికేమీగాని ప్రస్తుతమునకు రమ్ము-అనంతా! ప్రపధమమున నీ రహస్యము సులభభేద్యమనుకొంటిని కాని రానురాను మిక్కిలి యగాధమగుచున్నది. నిజముగా నీవు పని నెరవేర్చితివి. కాని కొన్ని ముఖ్య విషయముల గమనింపనైతివి సుమా?"
"నేనేమైనా మరచితినా?"
"అనంతా! చిన్నపుచ్చుకొనకుము. నీ వొనర్చిన పని యమోఘమైనదియే! అట్లయున్న కొన్ని ముఖ్యాంశముల వదలివేసితిని. ఇటు చూడుము ఆ దంపతుల గూర్చి జనుల యభిప్రాయమేమి? ఇవి అవసరములు కదా! ఎవరిని కనుగొన్నను తెలిసిపోవునే! వీనిని నీ పరయకపోతివి."
"కాని యింకను చేయి మించుట లేదు కదా! వానిని గనుగొనవచ్చును."
"కనుగొనబడినవి-తంతి మూలమునను పోలీసువారి సహాయమునకు నాకన్ని సంగతులు నిల్లు కదలకుండ చేతికందుచుండును. వాస్తవముగ నేను గ్రహించిన దానివలన సంగతులు స్థిరపడినవి. ఈ సుబ్రహ్మణ్యము లోభియని ప్రతీతి కలదు. భార్యను కష్టపెట్టు చుండుననియు ననుకొనుచుందురు. ఆనందుని సంగతియు నవగతమైనది. ఇక నేటికి పని చాలును! తరువాత చూచుకొంద"మని మధుసూదనుదు వేళ యతిక్రమించునని భుజింపనేగెను-నేనును గృహోన్ముఖుడనైతిని-
ఆ మరుదినము నేనొంటరిగ నింట గూర్చుండి యుంటిని. అంతలో నొక పిల్లవాడు మధుసూదనుని దగ్గరనుండి యొకలేఖ తెచ్చి నాకొసగెను. అందిట్లుండెను. "మిత్రుడగు ననంతరావుకు-
రహస్యము పూర్తి కావచ్చినది. తెలిసికొనవలసిన యంశములిక నొకటి రెండు కంటే నదికములు లేవు ఆ పిమ్మట నిది భేదింపబడినట్లే-ఈ-లోపున నీవు నేటి మధ్యాహ్నము మూడు గంటలకు మా యింటికి రాగోరెదను.
-మధుసూదనరావు
సరిగా మూడు గంటల కాతని యింటికి బోయితిని మధుసూదనుడు మేడ మీద యుండెను అటకేగితిని-ఏవో ప్రశ్నలు వేయుచుంటిని. కాని జవాబు రాలేదు.
అంతలో సుబ్రహ్మణ్యము వచ్చియున్నట్లు తెలిసెను. మధుసూదనుడాతనిని మీదికి రావించెను. రోజుకొనుచు వచ్చి యాతడు "మధుసూదనరావుగారూ! నాకీ తంతి వచ్చినది. నమ్ముటో-నమ్మకుండుటో తెలియకున్నది" యని పల్కుచు తంతినిచ్చెను.
"వెంటనే వచ్చితివేని నీవు కోల్పోయిన వానిని బడయగలవు - జాగు చేయరాదు.
-కరణము రామలింగము. కళింకోట."
దానిని చదివి మధుసూదనరావు "సరే! మీరిప్పుడు కళింకోటకు బోవుడు. నాల్గు గంటలకు రైలున్నది-"యనియెను.
కాని సుబ్రహ్మణ్య మేగుట కిష్టపడినట్లు లేదు. అతనికి తొందరయే లేకపోయెను. "ఎందుకండీ! ఇది యంతయు తంత్రము! మీదు మిక్కిలి డబ్బు దండుగ! వృధా కాలయాపనము! నాభార్య గూర్చి యీ రామలింగని కేమి తెలియును?" అని యతడు పల్కుచుండెను.
"ఏమిది? అతని కేమియు తెలియకున్న తంతివార్త ఎందులకంపును? మీ రేగవలయును."
"నేనేగవలసిన యగత్యమున్నట్లు తోపదు."
మధుసూదనునకు బట్టరాని కోపము వచ్చెను. "అయ్యా! యిదుగో! వినుడు ఇట్టి బలవత్తరమగు సూత్రము దొరుకుచుండ మీరు దానిని సంగ్రహింపకపోయినే వ్యర్ధముగ చిక్కులు కలుగును మీకిందు పట్టుదలయే లేనట్లు తోచును-కావున నిదియే నా శాసనము మీరు వెళ్ళక తీరదు."
ఈ మాటలు విని యాతడు కొంచము జంకెను - "మీరిట్లనినచో నేనడ్డు చెప్పగలవా? కాని వృధా శ్రమ" యనుచుండ 'ఆ సంగతి నాకు తెలియును! మీరు తత్ క్షణమే బయలుదేరుడు' అని మధుసూదను డడ్డుగ బల్కెను, ఎట్టకేల కతడిష్టము లేకున్నను నిందుల కంగీకరించెను.
మధుసూదనరావు నన్ను రహస్యముగ బిల్చి "ఓయీ! మీరిరువురును కలిసి కళింకోటకు పొండు. ఈపని యెంతయో ముఖ్యమైనది. ఒక్క క్షణమైనను నీతని నెడబాయకుము. వింతలున్న వెంటనే తంతి నంపుము -ఇక్కడ నెక్కడున్నను నాకది యందునట్లు కట్టుబాట్లు చేసుకొనియెదను" అని యాతనికి సాయముగ నన్నంపెను.
సాయంకాలపు బండిమీద కశింకోటకు బోయితిమి. కష్టపడి కరణంగారి యిల్లు కనుగొంటిమీ మారాక నెరింగింప నతడు గౌరవ పురస్పరముగ మమ్ము లోనికి దోడ్కొని పోయెను. పిమ్మట మేము వచ్చిన కార్యమేమని ప్రశ్నించెను.
"తా మంపిన తంతి జూచుకొని వచ్చితి" మని నేనంటేని
"నా తంతియా! నేనేదియు నెవ్వరికి నంపలేదే!"
"లేదా! యీ సుబ్రహ్మణ్యముగారికి నేడంపిన తంతి మాట యేమి?" యని దానిని జూపితిని.
"ఇది హాస్యమేమైన నాలోచింప దగినదే! ఎంత ధూర్తకృత్యము!"
నేనును సుబ్రహ్మణ్యము నొకరి మొగమొకరము చూచుకొంటిమి.
"మీ పేరు కలవారింకెవరైనా గలరా? కరణము లిర్వురుందురేమో! మేము పొరబడి యుండవచ్చును" అని నేనంటిని.
"పొరబాటు లేదు-గిరబాటు లేదు-పొండు-పొండు ఇది యబద్దపు తంతియైన బోలీసువారే కలరు మీరికపోవచ్చును" అని మమ్మతడు సాగనంపెను.
జరిగినదంతయు దంతిమూలమున మధుసూదనునికి దెలియజేసితిని అంతయు నతిచిత్రముగ నున్నదనుకొంటిని. సుబ్రహ్మణ్యము లుబ్దుడనుటకు దగినవాడని నేను గ్రహించితిని. మొదట రైలు ఖర్చులకు మూలిగి మూడవ తరగతిలో బోవ నిశ్చయించెను ఇప్పుడు పూటకూటి ఖర్చులకు గొణుగుకొనజొచ్చెను. ఎట్లో నాటి రాత్రి గడచినది మధుసూదనుడు మమ్ముల ననకాపల్లికి రమ్మని తంతి సంపెను.
ఆ మరునా డనకాపల్లి చేరితిమి. వృధాప్రయాణ మయ్యెను కదా యని సుబ్రహ్మణ్యం మాడిన మాట లన్ని యిన్ని కావు. ఎట్లో మేమతని యింటి కేగితిమి.
ఇంటిలో నున్నవారిని జూడ నాకాశ్చర్యమయ్యెను. అక్కడ మధుసూదనుడొక్కడే కాక నేను జూచిన కోరమీసములవాడు కూడా నుండెను.
మధుసూదనరావు లేచి "సుబ్రహ్మణ్యముగారూ! ఇతడు నా మిత్రుడగు శ్యామసుందరరావు. ఇతడు గూడ మీ విషయమై పరిశోధన చేయుచుండెను. అయిన నేమి! మీ యిరువురి యూహలేకీభవించియె యున్నవి. ఇద్దరము గూడ నొక ప్రశ్నయునే యడుగనుంటిమి." అనెను.
వ్యస్తహృదయుడై సుబ్రహ్మణ్యము కూర్చొండెను. కాని యతని ముఖమున ననుమాన చిహ్నములు ద్యోతకము లగుచునే యుండెను. ఏదో చేయి మించిన పని జరుగనున్నదని యతడు వసిపట్టెను. తడబడుచునే యాతడు "మీరడిగెడు నదియే" మని యెను.
"ఇది! ఆ కళేబరముల నేమి చేసితిరి?"
సుబ్రహ్మణ్యము దిగ్గున నెగిరిపడెను అతని చేతులు గాలిలో నెగయుచుండెను. ముఖ లక్షణములు వర్షాకాల మేఘములట్ల క్షణక్షణము మార్పు చెందుచుండెను నోరు వెళ్ళబెట్టి కఠోరముగ నరచుచున్న యాతడు మూర్తీభవించిన బీభత్సరసమేమోయన నొప్పెను అతని నిజస్వరూప మప్పుడవగతమైనది. వక్రదేహుడే కాక వక్రమానసుడని కూడ బోధపడినది.
ఒక ఘోర రాక్షసుని వలె నతడు ముందున కురికెను. అతడు బలవంతుడే కాని పేరెక్కిన నిరూపకు తిర్వురి ముందాతని యాటలు సాగనయ్యెను. కొంతవరకు పెనుగులాడినపిదప నాతడు స్వాధీనుడయ్యెను.
కొంతసేపటికి రక్షకభటాధికారి యా ప్రదేశమున గాలించెను. 'హత్యలు జరిగినవాయని యాతడాశ్చర్యము సూచించెను. మే మందర మింటిగదిలో నాసీనులమై యుంటిమి మధుసూదనుడు నన్ను గాంచి "అనంతా! శ్యామసుందరుడు గూడ సుప్రసిద్ధ నిరూపకుడే మొదట నీవతనిని గొంతవరకు వర్ణించిన పిమ్మట తెలిసిన నేను మిగిలినదానిని పూర్తిచేసెను. వింత యేమి?" అనెను.
