తన శరీరంలోని కొంతభాగం తన నుంచి వేరుపడి పోయినట్టు గిలగిల్లాడి పోయింది.
"ఇక రండి పద్మజగారు! ఇంటికెళదాం" ఎప్పుడొచ్చిందో ఏమో చిన్న చెల్లెలు వెనుకజేరి తమాషా పడుతోంది.
"ఏయ్" అంటూ చెల్లెల్ని బెదిరించింది గానీ ఆమె అలా ఆట పట్టించడం బాగానే వుంది పద్మజకి.
"ఎవరే అక్కా అతను? సినిమా హీరోలా వున్నాడు" ఇంటికి నడుస్తున్నప్పుడు అడిగింది.
"పక్క ఊరే"
"చదువుకున్న కుర్రాడిలా వున్నాడు"
"ఆ ఎం.ఏ. పూర్తయిపోయిందట"
"పెళ్ళయిందా"
"కాలేదు ఏం నువ్వు చేసుకుంటావా?"
"వద్దు లేమ్మా- అక్కకు కావాల్సిన వాడ్ని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు"
"ఎవరే చెప్పింది?" ఈసారి కాస్తంత కోపం ప్రదర్శిస్తూ అడిగింది పద్మజ.
"ఎవరూ చెప్పలేదు. కానీ మీరు ఒకరి నొకరు చూసుకోవడంలోనే ఆ విషయం తెలుస్తోంది"
"అలాంటి మాటలు మాట్లాడావంటే నాలుక కోసేస్తాను. ఇక నోరు మూసుకుపద" అని తాత్కాలికంగా చెల్లెలి మాటలకు అడ్డుకట్టవేసింది.
రెండోరోజు ఉదయం పార్వతమ్మ ను తీసుకుని పొలానికి వెళ్ళింది పద్మజ.
శనగతోటలో కసువు తొవ్వాల్సిన టైమ్ అదే. కయ్యాల్లో గడ్డి బాగా పెరిగి వుంది. నిజానికి అతను ఎప్పుడో తొవ్వటం పెట్టుకుని వుండాల్సింది కానీ, కూలీలు దొరకలేదు. ఆ తరువాత పద్మజ పరిచయంతో ఆ వ్యవహారం పూర్తిగా మరిచిపోయాడు.
కొద్దిగా చెమ్మ వున్న పొలంలో గడ్డి తొవ్వటం ప్రారంభించారు పద్మజ, పార్వతమ్మ.
ఆ టైమ్ కి పద్మజ వచ్చి వుంటుందని తెలుసు గోపాల్ కి.
అందరి కూలీలకు పోసినట్టు ఉదయం సద్దన్నం పెట్టడానికి మన సొప్పదు లేదు. అందుకే తల్లికి "దోశెలు కావాలి- ఇద్దరి కూలీలకు" అని అడిగాడు.
ఆమె ఆశ్చర్యపోయింది. "కూలీలకు దోశెలు కావాలంటావేమిట్రా పిచ్చి సన్నాసీ సద్ది పంపిస్తాలే" అంది.
కానీ అతను ఒప్పుకోలేదు.
కొడుకంటే గారాబం కొద్దీ చివరికి సరేనని నాలుగు దోశెలు చొప్పున ఇద్దరికీ దోశెలు కట్టించింది.
అవి తీసుకుని పరిగెత్తాడు.
పొలానికి వెళ్ళగానే ఇద్దర్నీ పిలిచి దోశెలు పెట్టాడు. కూలీల్ని అంత బాగా చూసుకున్న అతన్ని పార్వతమ్మ పొగిడింది.
ఆ తరువాత వారం రోజులపాటు తొవ్వాటం జరిగింది.
కూలీల్ని పద్మజే అన్ని రోజులు పిలుచుకొచ్చింది.
ఇద్దరూ మరింత క్లోజ్ అయ్యారు.
తొవ్వాటం అయిపోయాక ఇద్దరు కలుసుకోవడానికి కుదరడం లేదు.
అతనూ ధైర్యంగా ఆమె ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు.
వేరుశనగ నూర్పుళ్ళ కాలం వచ్చేసింది.
అందరూ శనగ పెరికేస్తున్నారు.
కూలీలు దొరకడం లేదు.
ఓరోజు సుబ్బరామయ్య కొడుకుని పిలిచి "ఒద్దురా అంటే ఏట్లో పైరు పెట్టావ్. మరి వండిన దాన్ని ఇంటికి తెచ్చుకోవా మళ్ళీ జాతర మొదలైదంటే వర్షాలు వస్తాయి. అప్పుడు కాయలకి మొలకలు వచ్చేస్తాయి. పక్క వూరి నుంచైనా కూలీల్ని పిలుచుకొచ్చి ఆ పని చూడు" అని కేకలేశాడు.
తండ్రి అరుస్తున్నా అతను పట్టించుకోలేదు.
కూలీల కోసం పక్క వూరికి వెళ్ళే ఛాన్స్ వచ్చిందని సంబరపడి పోయాడు.
సాయంకాలం కాగానే హడావుడిగా బయలుదేరి పక్క వూరికి వెళ్ళాడు.
అప్పటికి ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుని పదిరోజులు పైగానే అయింది.
పద్మజ అతన్ని చూడడంతోనే సంతోషం పట్టలేకపోయింది.
ఆమెకి తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వూరాయి.
ఏదేదో మాట్లాడాలనిపించింది. కానీ తండ్రీ, చెల్లెలూ అడ్డుగా నిలబడి పోయారు.
"కూలీలు కావాలి వేరుశనగ ఇప్పటికే బాగా ముదిరిపోయింది"
"రూపాయో, రెండు రూపాయలో ఎక్కువైనా ఫరవాలేదు. రేపు ఇరవై మందైనా కావాలి" అని చెప్పాడు.
"నువ్వేం దిగులుపడకు రేపు తెల్లారికల్లా నీ పొలంలో ఇరవై మంది వుంటారు. మా ఇంట్లోనే నలుగరం వున్నాం. మా పనులన్నీ అయిపోయాయి. అందరం వచ్చేస్తాం" అతనితో అని పద్మజ వేపు తిరిగి "నువ్వు వెళ్ళి మరో పదిహేను మందిని పిలువ్" అన్నాడు శివయ్య.
గోకుల్ లేచాడు.
"నేనూ అలా వెళ్ళి కూలీల్ని పిలుస్తాను" అని పద్మజ కూడా బయలుదేరింది.
తన వెనకాలే చెల్లెళ్ళు రాకుండా "అన్నం వండడం అయిపోయింది. టెంకాయ పచ్చడి చేస్తూ వుండండి. చిటికెలో వచ్చేస్తాను" అని పని పురమాయించింది.
గోకుల్, పద్మజ బయటకొచ్చారు.
మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. వేసవి కాలం కావడంతో గాలి హాయిగా వీస్తోంది. అక్కడక్కడా కనిపిస్తున్న కిరోసిన్ దీపాలు ఇప్పుడు 'మద్రాసు ఐ' వచ్చినట్టు వెలుగుతున్నాయి.
"ఎన్ని రోజులయింది నిన్ను చూసి నిన్ను క్షణం చూడకపోతే గుండె వుండ చుట్టుకుపోతోంది. అలాంటిది పదిరోజులు" అన్నాడు చివరి కొచ్చేటప్పటికి గొంతు బరువెక్కింది.
"నాకు మాత్రం ఈరోజు ఉదయం పోస్టుడబ్బాను వెళ్ళి చూసొచ్చాను."
"పోస్టు డబ్బానా" తనను చూడాలనిపించి పోస్టుడబ్బాను చూడడం ఏమిటో అతనికీ అర్ధం కాలేదు.
