దొరలూ దొరసాన్లూ చక్కగా పెద్దవాళ్ళయినాక వాళ్ళంతట వాళ్ళే పెళ్ళి చేసుకుంటారు. చిన్నతనంలోనే పెళ్ళి చెయ్యటం తప్పు. పెద్దయిన తరువాత మొగుడు పెళ్ళాలు ఒకరికొకరు నచ్చక పోతే ఏం కావాలి? వెధవముండల పెళ్ళిళ్ళుకూడా చెయ్యాలిసిందే. వెధవముండలకి జుట్టుగొరిగికి నెత్తిన ముసుగేసి కూచోబెట్టటం చాలా ఘోరం... ఆడవాళ్ళంతా జుట్టూ, నగలూ, చీరెలూ ఉండి తిరుగుతుంటే చూడటానికి ఎంత బాగుంటుంది!....
అయితే సుందరానికి సందేహాలు లేకపోలేదు. చాలా ఏళ్ళు వచ్చినతరువాత వెధవముండలకి పెళ్ళి చెయ్యాలా. వద్దా? పిల్లలున్న వాళ్ళు పెళ్ళిచేసుకుంటే ఏమవుతుందీ? ఛా, ఛా! వాళ్ళనెవరు చేసుకుంటారు?
ఇంతలో ఇంకో భయంకరమైన ఆలోచన కలిగింది: తన తల్లికి మళ్ళీ పెళ్ళిచెయ్యటమా? సుందరానికి ఒళ్ళంతా ఒక్కసారి భగ్గునమండిపోయింది. అది ఎంతమాత్రం వీల్లేదనుకున్నాడు. ఆవిడ జుట్టు పెంచి, చీరెలుకట్టి, నగలు పెట్టుకోవటంకూడా వాడికి సమ్మతం కాలేదు. ఆవిడలో కాస్త మార్పుకూడా వాడు సహించలేడు....
* * * *
పాపం, శేషగిరి చాలా చిత్రమైన ఆవేదనకు గురి అవుతున్నాడు. సంజీవిలాటి ఔషథం దగ్గర ఉండికూడా అనుపానం తెలియని వైద్యుడల్లే ఆయన ఎంతో ఉన్నతాశయాలు కలిగి ఉండిన్నీ వాటిని ఎట్లా అమలులోకి తేవాలో తెలియక కొట్టుకుంటూ. అడుగడుగునా సంఘం తనకు అడ్డంవస్తున్నట్టు భావిస్తున్నాడు. ఆదర్శవాదుల కందరకీ ఈ గతి ఎప్పుడో ఒకప్పుడు కలగక తప్పదు. వారు సంఘంమీద కొన్ని సంస్కరణలు పడ వెయ్యటానికి ప్రయత్నంచి విఫలులై, చిట్టచివరకు ప్రాణం విసిగి, "ఈ పాడు సంఘానికి బాగుపడటం ఇష్టంలేదు. దీనికి బాగుపడే గీతలేదేమో" అనుకుని వైరాగ్యంలో పడతారు.
శేషగిరి వైరాగ్యంలో పడటమేగాక, తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక కృష్ణవేణికి పదకొండో ఏడు వెళ్ళుతుందనగా పెళ్ళిఏర్పాటు చేశాడు. జాతీయ విద్యాలయంలో అస్పృశ్యుల పిల్లలను ప్రవేశ పెడతానన్నందుకే వెలివేసినంతపని చేసిన వాళ్ళున్నారు. కూతురుకి రజస్వలానంతర వివాహం కూడా చేస్తే ఊళ్ళోఉండే ఆస్కారం లేకుండాపోతుందని శేషగిరి భయపడ్డాడు.
కృష్ణవేణికి నిర్ణయించిన వరుడు ఉద్యమంలో చదువు చాలించుకుని ఆరుమాసాలు శ్రీ కృష్ణ జన్మస్థానం సందర్శించిన వాడు, అతనికి విశేషం ఆస్తిలేదు, కట్నమూ, లాంఛనాలూ లేకుండా పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఖద్దరు బట్టలతో పెళ్ళిఅయింది. శేషగిరి బంధువులకీ పెళ్ళి చాలా వేళాకోళంగా ఉన్నది.
"ఇదేం పెళ్ళి? నా మొహం పెళ్ళి! అలాగాజనం కూడా ఇంతకన్న బాగా చేసుకుంటారు. బాజా లేవి, ఊరేగింపులేవి, మేజువాణీ ఏది, దండాడింపేది, బూజంబంతి ఏది, కట్నాలేవి, కానుకలేవి?" అని ఉభయ పక్షాలవారు కూడా చప్పరించారు.
"ఇది స్వరాజ్యంపెళ్ళి కాబోలు" అన్నారు మరికొందరు వెటకారంగా.
ఎవరేమన్నప్పటికీ సుందరానికి రంగారావు__ కృష్ణవేణి భర్త__ వచ్చాడు. అతను పెళ్ళికొడుకుపోజు పెట్టనేలేదు. పెళ్ళితానే చేయిస్తున్నవాడల్లే తానుకూడా ప్రతిపనిలోనూ తోడవుతూ. అందర్నీ పలకరిస్తూ, ఎక్కడబడితే అక్కడ ఎవరితో బడితే వాళ్ళతో కూచుని ఏదిపడితే అది మాట్లాడాడు.
చీకటిపడేవేళ రంగారావూ, సరుసూ, సుందరమూ, ఇంకా ఒకరిద్దరు పిల్లలూ కలసి చెరువు అవతలి గట్టుమీద కూచున్నారు. రంగారావు స్వరాజ్యం గురించి కబుర్లు చెప్పాడు.
ఆ రోజు పౌర్ణమి కావటంచేత ఎప్పుడు సూర్యకాంతిపోయి వెన్నెల వచ్చిందీకూడా తెలియరాలేదు. చెరువుగట్టుమీద చెట్ల నీడలు దీర్ఖంగా పడుకుని ఉన్నాయి. వాటి మధ్య కూచుని రంగారావు ఉద్యమంగురించి మాట్లాడాడు,
స్వాతంత్య్రోద్యమం అయిపోయిందనుకోవటం పొరపాటు. ఇది ఆగదు. కొండమీదినుంచి మైదానాలు ప్రవేశించే నదిలాగావడితగ్గింది. ఇప్పుడిది విస్తరించాలి. నిజంగా ఇవాళ బ్రిటిషువాళ్ళు వెళ్ళిపోతే మనం స్వరాజ్యం సాగించటానికి సిద్దంగా వున్నామా? లేము. ప్రతి రాష్ట్రంలో, ప్రతీ జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలోనూ స్వరాజ్యవాదం వేళ్ళుతన్నాలి. జీవితం అన్ని రంగాలలోనూ చైతన్యం కలగాలి. మనం రాజకీయాలు ఓనమాల దగ్గిర్నుంచీ నేరవాలి. కాంగ్రెసుసంస్థను నిర్మించాలి. దానిద్వారా విద్యార్దులలో, ఉద్యోగులలో, ఆఖరుకు పొలాలు దున్నుకునే రైతుల్లోనూ, ఫాక్టరీ కార్మికుల్లోనూ చైతన్యం కలగాలి. ఇదంతా ఒక్కరోజులో జరగాలంటే సాధ్యంకాదు. కాని, ప్రతి కాంగ్రెస్ వాడూ స్వార్ధరహితంగా పనిచేస్తే ఇవాళ ఒకడున్నచోట రేపు పదిమంది కాంగ్రెస్ వాళ్ళుంటారు. ఎల్లుండి నూరుమంది వుంటారు. ఆ విధంగా ఉద్యమం వ్యాప్తిచెందితే స్వరాజ్యం రాక ఏంచేస్తుంది?
రంగారావు ఖద్దరుగురించి చాలా ఉద్రేకంతో మాట్లాడాడు. అతను శేషగిరి మామయ్యంత ఆదర్శవాదీకాదు, నిరాశావాదీకాదు.
ఈ సంగతులు రంగారావునోట వింటుంటే సుందరానికి మరింత నమ్మదగినట్టుగా కనపడ్డాయి. వాడు ఇక ఖద్దరుతప్ప కట్ట రాదనుకున్నాడు.
దీనికోసంవేరే ప్రయత్నం చెయ్యనక్కర్లేకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు శేషగిరి తన మేనల్లుడికీ మేనకోడలికీ కలిసి పది గజాల ఖద్దరుగుడ్డ పెట్టాడు.
* * * *
రోజులూ, మసాలూ గడిచిపోతున్నాయి. జానకి ఆడపిల్లల బడికిపోయి చదువుకుంటున్నది. దాన్ని మగపిల్లలబడిలో చదివించవచ్చునని ఎవరో సూచించారు. సీతమ్మగారు ఈ ఆలోచనకు సుతరామూ ఒప్పుకోలేదు. సుందరం ఒక్క నిట్టూర్పు నిట్టూర్చాడు. తన చెల్లెలు తనతోకూడా రోజూబడికి వచ్చి చదువుకుంటుందేమోనని వాడు చాలా భయపడ్డాడు.
చిక్కేమిటంటే సుందరం క్లాసులోనే__ మరొక సెక్షనులో __ కొత్త మునసబుగా రమ్మాయి చదువుకుంటున్నది. మునసబుగారి గుర్రబ్బండీలో రోజూ ఆ పిల్ల బడిముందు దిగేది. ఆమెకు ముందుగా డవాలీ బంట్రోతుదిగి ఆమె పుస్తాకాలు పట్టుకుని ఆమె క్లాసుదాకావచ్చి పుస్తకా లామెకిచ్చి వెళ్ళిపొయ్యేవాడు. స్కూలు ప్రారంభమైన ఒకటి రెండు నిమిషాల కామె సరిగా ఎట్లా హాజరయ్యేదో అందరికీ వింతగా ఉండేది. ఈ పిల్లను గురించి తన తోటివిద్యార్ధులు మాట్లాడుకునే మాటలు సుందరం వినేవాడు. ఈ మాటలకు సుందరం బాధపడేవాడు కాడు__ ఎప్పుడైనా ఆ పిల్లనుగురించి కాస్త జాలిపడేవాడేమో. తన చెల్లెలు స్కూలుకువస్తే దాన్నికూడా అటువంటిమాటలే అంటారనీ, పైపెచ్చు తను ఎదటలేనప్పుడు అంటారేమోననీ అనిపించగానే సుందరానికి చలవలు కమ్మినంతపని అయింది.......
