తన మనసు , శరీరం కూడా తన మాటను మన్నిమ్చాడంలేదే? స్వాధీనం తప్పుతున్నాయే.....!
ఎక్కడో ఏదో లోపం జరిగింది. తనకు తెలియకుండానే తనలో ఏదో లోపం జరిగింది. తనకు తెలియకుండానే తనలో ఏదో స్వార్ధ చింతన మొలకెత్తి వుండవచ్చు. కనుకనే అసంకల్పిత సంఘటనలు జరుగుతున్నాయి. తన గురించి , తన స్వీయ మనుగడ గురించిన ఆలోచన మొదలవబట్టే లౌకికానందాలు, బౌతిక ప్రపంచం గురించిన భావనలు తన మనసులో కదులుతున్నాయి. శరీరం వశం తప్పుతున్నది.......
కాదు........ఇలా కావడాన్కి వీల్లేదు....
ఇటువంటి ఆలోచనలతో ఆ రాత్రి అతనికి జాగారణే అయింది.
పద్మాసనంలో కూర్చుని, ధ్యానముద్ర వట్టి, ఇష్ట దైవాన్ని సంకల్పించుకున్నాడు. ఊహూ! మనసు కేంద్రీకృతం కావడం లేదు. మనసు మనసులో లేదు....
తన ఆశ్రమ వాతావరణం కలుషితమైపోతున్నది. పవిత్రత ప్రశాంతత భగ్నమవుతున్నది కొందరు వ్యక్తుల ప్రవేశంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పుడు ఇక తనకు ఏకాగ్రత దుస్సద్యం...!
తనకు ఏకాగ్రత కావాలి. ఒంటరితనం కావాలి. ప్రశాంత వాతావరణం కావలి.......
అందుకనే తెల్లవారుఝామునే బయలుదేరి కృష్ణ తీరానికి చేరుకున్నాడు ! ఒక నాటు బోటును ఎంచుకుని, తెడ్డు వేశాడు. అది భవానీ ద్వీపం దిశకు కదిలింది.
* * *
ధీరజ మనసు ఎప్పుడో చేయి జారిపోయింది.
తను ఒక జిల్లాకు ఉన్నతాధికారి అనే విషయాన్ని ఆమె మరచినట్టు కనిపిస్తున్నది.
గతకాలపు జ్ఞాపకాలు ఆమెను చుట్టుముడుతున్నాయి.
అసలు విష్ణు ఎవరు? విష్ణు గురించి అసలు తనెందుకు ఇంతగా మాధనపడాలి?
విష్ణు ఆధ్యాత్మిక బోధనలు తనను ఆకర్షించాయి. అట్టి ఆధ్యాత్మిక చింతన పట్ల తనకూ జిజ్ఞాస వున్నది, ఆసక్తి వున్నది. నమ్మకం కుదిరింది శిష్యురాలయింది. ప్రణమిల్లింది, అంతే.......అంతకు మించి ఏమీ లేదు...కాని, కాని.....
పోలీస్ ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ విష్ణును అనుమానిస్తున్నాడు. దానిని తను సహించలేకపోతున్నది. కారణం....
విష్ణు నిర్దోషి, పవిత్రుడు. ఇది తన గట్టి నమ్మకం. ఇది తన అంతరాత్మకు తెలుసు. కానీ, లోకానికి తెలియదే......!
విష్ణు విషయంలో ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ కు కనువిప్పు కలిగించాలి. లోకానికి పూర్తిగా తెలియపరచాలి. ఇది తన ప్రధమ కర్తవ్యం.
ఈ దుష్ట్యానే ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ను విష్ణు మందిరానికి అప్పటికప్పుడే తోడ్కొని వెళ్ళింది, కాని విష్ణు తొందరపాటు కారణంగా తను చులకనయింది....
కలెక్టర్ ధీరజ మానసికంగా ఎంతగానో మధన పడుతున్నది. ఆవేదన చెందుతుంది. తన నమ్మకాన్ని వమ్ము చేశాడు విష్ణు. గుండెను పిండి చేశాడు. వ్యధను మిగిల్చాడు. అంతేకాదు, తన అభిమాని, ఆరాధకుడు అయిన విష్ణు నిందల పాలవుతున్నాడు......అతనిపై పడిన అపనిందలను తుడిచివేయడానికి తను చేసిన ప్రయత్నాన్ని ఒకే ఒక్క సయితం స్వయంగా చేడగోట్టుకున్నాడు విష్ణు.
విష్ణు మొదటి నుంచీ దుందుడుకు స్వభావే. అతని తొందరపాటు చర్య వలన...
ధీరజ ఆలోచనలు అర్ధ దశాబ్ది వెనకకు వెళ్ళాయి.....
సరిగ్గా ఇదే సమయాన విష్ణు మనసు సయితం అయిదేళ్ళ గతం లోకి తొంగిచూసింది.
* * * *
మనిషి పరిస్థితులకు అనుగుణంగా తనను తను మలుచుకోవాలి! ఇదే జీవిత పరమార్ధం!
నడిసముద్రంలో నావ చిక్కుకున్నప్పుడు మనిషి మడి కట్టుకుని ఆహార పానీయాలు తీసుకోకుంటే కుదురుతుందా? అతను తప్పని సరిగా చేపను పట్టాలి! వండుకు తినాలి! అలాగే, కారడవిలో చిక్కుకున్నప్పుడు మనిషి తప్పనిసరిగా టార్జాన్ పాత్ర వహించి తనను తాను క్రూర మృగాల బారి నుంచి రక్షించుకో గలగాలి! అదే జీవితం అంటే!
విద్యార్ధి జీవితం ఎంతో ఉల్లసకరం, ఉద్వేగభరితం, అన్నీ సక్రమంగా , సజావుగా జరిగితే విద్యార్ధి జీవన దశకు మించింది మరి లేదేమో!
తల్లిదండ్రులు డబ్బు వెదజల్లుతూ తమ పిల్లలను విజ్ఞానాన్ని పెంపొందించుకొమంటారు. అధ్యాపకులు తమ మేదోపటిమ మేరకు పాఠాలు చెప్పుకుపోతారు. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు జీవిత పాఠాం మాత్రం ఒకరు చెబితే అబ్బేది కాదు!
తన జీవిత విధానాన్ని , భవిష్యత్తును, గమ్యాన్ని విద్యార్ధి దశలోనే విద్యార్ధి ఎంచుకోవలసి వుంటుంది. వీటిని ఎమరచినవారు జీవన సర్వస్వాన్ని కోల్పోవచ్చు. ఆ పిదప విచారించి ప్రయోజనం శూన్యం!
ఏం.ఏ పైనలియర్ తత్వశాస్త్ర పరీక్ష వ్రాయవలసి వుంది విష్ణు మూర్తి! అతనికి అన్నీ తెలుసు. జీవితమూ తెలుసు. దాని అర్ధం తెలుసు, పరమార్ధం తెలియవలసి ఉంది.
తన పుట్టుక అర్ధం తెలుసు. తన కుటుంబంలో తన పాత్ర ప్రమేయం కూడా తెలుసు. తన పూర్వపరాలను పరిస్థితులను బేరీజు వేసుకున్నవాడు విష్ణుమూర్తి. కనుకనే అతను దేనికీ చలించక మేరునగదారునిగా నిలిచాడు.
అది సాయం సమయం. సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని నింగికెగసి పడుతున్న నీలి కెరటాల వైపుకు దృష్టిని సారించి ఏకాగ్రతను అనుభవిస్తున్నాడు విష్ణుమూర్తి.
అక్కడకు ఎవరో వచ్చారు. పిలిచారు. అదేమీ అతనికి తెలియదు. అతని ఏకాగ్రత అట్టిది.
తీగ వంటి మెత్తటి చేతివ్రేళ్ళతో తన కనులను మూసిందెవరో కూడా అతను గమనించలేదు. అనుకోని స్పర్శకు అతను త్రుళ్ళిపడలేదు. అయితే , తన ఏకాగ్రతను చెదర గొట్టినందుకు, ఏకాంతవాసాన్ని భగ్నపరచినందుకు తపోభంగం కలిగించినందుకూ మాత్రం కించిత్ చికాకు పడ్డాడు , చిరాకు వేసింది.
