సామ్రాజ్యం ఎందుకన్నా గానీ మధూళీ నిజంగానే అదోలాంటి స్పందనకి లోనైంది.
ఏ శాశ్వత మౌన ప్రవాసంనుంచో హటాత్తుగా దారితప్పి నిన్నటి దాకా కోరని ఏ పిల్ల గాలుల సవ్వడికో అణువంత కదిలినట్టు.....
ఎవరికి అంతుచిక్కని మనసు రాయినుంచి ఉన్నట్టుండి ఏ మొక్కో మొలిచి నాకు పూసే పూలన్నీ , నువ్వు మాలలుగా అల్లుకోటానికే అని గుండె హిమతల్పంపై వెన్నెల్ని కురిపించి స్వప్నానికి, స్వప్నానికి మధ్య విరామం లాంటి ఒక అందమైన అనుభూతిని అందించినట్లు.....
ఏ అక్షరాల అంతఃస్వరాలో నేపధ్యగేయాలుగా మారి జీవితాన్ని సజీవం చేస్తున్నట్టు అనిపించి యిక అక్కడ వుండలేనట్టు పైకి లేచింది బిడియంగా.
"అప్పుడే వెళ్ళిపోతున్నారేం?" అనబోయి ఆగిపోయింది సామ్రాజ్యం. " ధన్విని పరామర్శించరా?"
అర్ధంకానట్టు చూసింది మధూళీ.
"అదే మధూళీ! వాళ్ళ నాన్నగారు ప[పోయినట్టు ఆరోజే చెప్పానుగా, పలకరించారేమో అని....."
"కర్టేసిగా పలకరించాలనుకున్నాను. కానీ ఆ పని చేయలేకపోయాను....ఎందుకు అంటే నా దగ్గరా ఖచ్చితమైన జవాబు లేదు. బహుశా మా పరిచయం చాలా స్వల్పమనిపించడం కావచ్చు. లెదూ ఏ ఓదార్పు అందని ఆ వెలితిని మాటల్తో పూడ్చడం సాధ్యం కాదన్న భావం కావచ్చు....."
అసలు కారణం అదికాదు....ఆ నిజం యిప్పుడే తెలిసిందా?
"అయినా తనకు తానుగా ఓదార్చుకోగల ధన్వి లాంటి వ్యక్తులకి నా పరామర్శ అంత అవసరమనిపించలేదు సామ్రాజ్యంగారూ......"
"కానీ అతడు ఆశించి ఉండొచ్చుగా?"
"ఆశించే మనిషైతే అప్పుడతడు ధన్వి కాలేడు"
"కానీ గొప్ప సర్జెన్ అయినా గానీ తనకు జబ్బు చేస్తే తనకు తానే సర్జరీ చేసుకోలేదు.....మరో సర్జెన్ మీద అధారపడతాడుగా" అంది సామ్రాజ్యం నవ్వుతూ.
"అలాంటి సర్జెనుగా ఆయన్ని సమిపించాలి అంటే మికున్నంత చనువు వుండాలి సామ్రాజ్యంగారూ."
"వారం వారం రాసే మీ నవల గురించి నేను అడుగుతున్నాను మధూళీ....."ఉత్సుకతగా అడిగింది సామ్రాజ్యం "ధన్విపాత్రలోని విశిష్టతని అర్ధం చేసుకున్న రచయిత్రిగా సీరియల్ రాస్తున్నారు మీరు.
రాబోయే వారాల్లో ధన్వి కధని ఎలాంటి మలుపు తిప్పబోతున్నారు."
మధూళీ జవాబు చెప్పలేదు. చెప్పగలగటానికి ఆమె నవల చివరిదాకా ఆలోచించలేదు, ఆలోచించేదే.....కానీ ధన్వి పరిచయం ప్రారంభం దగ్గరే ఆగిపోయింది. ఒకవేళ ధన్విని తరచూ కలిసే అవకాశం దక్కితే పటిష్టమైన మలుపులతో ముందుకు నడిపించగలడేమో.
"పోనీ నన్ను వూహించి చెప్పమంటారా?" అంది సామ్రాజ్యం.
"వెల్ కమ్!"
"ఈ ప్రపంచంలో యిమడలేని పాత్రగా నడుస్తున్న ధన్విలాంటి వ్యక్తులు చివరికి మారేది విప్లవకారుడిగానే మధూళీ.....అవినీతితో రాజీపడలేనివాళ్ళు, అరాచకాన్ని భరించలేనివాళ్ళు. సంఘంతో పోరాటం మొదలుపెడతారు, చివరికి అందరికి శత్రువుగా మారి ఏ నక్సలైట్ గానో ముద్రవేసుకుని.
"లేదు" అర్దోక్తిగా అంది మధూళీ. "అలా జరగదు సామ్రాజ్యంగారూ! కనీసం నేను రాసే పాత్రనైనా అలా వెళ్ళనివ్వను."
"అంటే సమాజాన్ని మార్చేయగల పాత్రగా ముగింపు ఇస్తారా?"
"ఏం చేస్తానో వెంటనే జవాబు చెప్పలేను. కానీ ఆ పాత్రని ఆశావాదంతోనే బ్రతికించుకుంటాను, ఎందరో యువకులకి మార్గదర్శకత్వం వహించే స్థాయిలోనే నడిపిస్తాను."
"జీవితం కధకాదు మధూళీ."
"కనీసం నా కధని అతడి జీవితంగా అనిపించేట్టు రాస్తాను."
'సరిగ్గా యిదే సమయంలో....
* * * *
తండ్రి గదిని శుభ్రం చేస్తున్న ధన్వి రెక్ లోని బూజుపట్టిన పుస్తకాలను ఓ వరసలో వుంచుతుంటే హటాత్తుగా ఓ డైరీ పాదాల ముందు పడింది.
ఇప్పటిది కాదు.
చాలా ఏళ్ళక్రితం రాసినట్టుగా వుంది. అది సభ్యత కాదని తెలుసు. కానీ తండ్రి మరణానికి ముందు తనకేదో చెప్పాలని చేసిన ప్రయత్నానికి జవాబు దొరుకుతుందేమో అని చూశాడు. ఏకాగ్రతగా. అతని అంచనా తప్పు కాలేదు. కేవలం పది నిముషాల వ్యవధిలో తెలిసిపోయింది.
రెండు దశాబ్దాల క్రితందాకా స్టేజ్ నటుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన నాన్నకి మరో భార్య వుంది. ఎక్కడో ఓ విస్పోటనం.....
చేతులు కంపిస్తుంటే ఆఖరి పేజిలోని వాక్యాన్ని చదువుతూ వుండిపోయాడు చాలా సేపటిదాకా.
* * * *
"నేను తప్పు చేశాను....ఇది అంగికరించడానికి నేను సిగ్గుపడను. అసలు తన భర్తని మరో ఆడదానితో పంచుకోటానికి ఏ స్త్రీ అంగికరించగలదని.....అందుకే దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది మొదలుకుని ఓ తపస్సులాంటి తలపులతో నా సమక్షమే దేవాలయంలా భావించే సావిత్రిముందు నేను ఒక అల్పుడ్ని అనుకుంటూ వుంటాను. అసలు నేను తాగుబోతుగా మారింది యీ ఆత్మక్షోభతోనే." అయినా ఏ రోజు నాకు మరో భార్య వుందని సావిత్రికి చెప్పలేకపోయాను.
చెబితే నామీద తిరుగుబాటు చేస్తుందని కాదు. నన్ను నిలదీసి సాధిస్తుందని కాదు. సావిత్రి క్షమాగుణంలో ఎంతటి ఉన్నతురాలు అంటే మీ సుఖాన్ని మించి నాకేం అక్కర్లేదు అంటుంది. బహుశా మనోవేదాన్ని కోరుకున్న నివేదనగా మలుచుకుని ఎప్పుడో నా పాదాల దగ్గరే కన్నుముస్తుంది. అసలు నాకు సావిత్రి చాలాసార్లు భార్యగా అనిపించదు, అమ్మగా కనిపిస్తుంది. అమ్మంత ప్రేమని పంచుతూ నేను భాధపడినపుడు నాకు బదులు తను కంటతడి పెట్టుకుంటుంది. నేను ఏ క్షణంలో అయినా ఆనందాన్ని వ్యక్తం చేస్తే ఆ లిప్తల్ని తనకు దేవుడందించిన వరంలా భావించి పట్టలేని పరవశాన్ని ప్రకటిస్తుంది.
నేను తాగినప్పుడుకానీ, తాగి సూటిగా చెప్పలేని కధని వ్యదగా నా కొడుకు ధన్వి పైకి మళ్ళించుకుని గావుకేకలు పెట్టినా గానీ సావిత్రి ఏ రోజు నన్ను నిలదియలేదు. నిలదీసి వుంటే ఆవేశంలో నా జీవితంలో మరో సుమిత్ర వుందని కక్కేసేవాడినేమో. అబ్బే.....ఇసుకగూళ్ళు కట్టుకుని గువ్వలతో ఆడుకునే పసికందులాంటి సావిత్రి యిన్నేళ్ళుగా నాకా అవకాశం ఇస్తేగా....
ఇన్ని సంవత్సరాల నా సుదీర్ఘ జీవితంలో అలనాడు రంగస్థలం మీద నా సహానటిగా పరిచయమైన సుమిత్ర అనుకుని పరిస్థితుల్లో నాకు భార్యగా మారి ఓ ఆడపిల్లకి తల్లి అయినా గానీ ఏరోజు సావిత్రిని పల్లెత్తుమాట అనకపోవడం సుమిత్ర సంస్కారం. దిగంతానికి అవలివేపున ఎప్పుడో ఒక వేకువలాంటి కనిపించే అవకాశముంటుందని ఆశించకుండా బ్రతుకు రంగస్థలంపై బడలికగా మిగిలిపోయిన సుమిత్రని చూసి కూడా నాకు జాలిగా వున్న మాట నిజమే. కానీ నేను ఏం చేయగలనని? తనూ సావిత్రిలాంటి సంస్కారవంతురాలు మాత్రమే కాదు , సావిత్రి అక్కయ్యకి ద్రోహం చేశానంటూ బాధపడే అమాయకురాలేగా.
అందుకే నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న సుమిత్రకి అన్యాయం చెయ్యలేకపోయాను. అసలు సుమిత్ర అయినా నన్నేం కోరిందని? సావిత్రి అక్కయ్య లాంటి నిజానికి తనో నీడగా మారి బ్రతికితే చాలంది.....నేను మగావాడిలా నలుగురి మధ్య నిలబడితే చాలంటూ నా పాదాలని కన్నీటితో అభిషేకించింది. నాకున్న సమస్య యిప్పుడు ఒక్కటే....నా కూతురు క్షితాజకి పెళ్ళి చెయ్యటం....నాకు అంత తాహతు లేదని తెలుసు. కానీ అది నా చివరి కోరిక.
ఒకవేళ నేను ధన్వి మనసు గెలుచుకున్న తండ్రినే అయితే ఏదో ఒకరోజు ధన్వి చేతులు పట్టుకుని నా జీవితపు రహస్యపుటల్ని వాడికి తెలియచెప్పి క్సమాపర్పణలు కోరేవాడినేమో! కానీ ధన్వి ముందు అంత సాహసం ఎలా చేయగలను?
