పెద్ద పెద్ద పరిశ్రమలకు, వ్యాపరస్తులకూ ముఖ్యమైన సమాచారాన్ని సంపాదించి అందజేసే సంస్థ అది. మరీ అంత పెద్ద సంస్థ కాకపోయినా, అది చేసే పని ముఖ్యమైనది కావడం వల్ల , అందులో పనిచేసే ఉద్యోగులు అందరికీ మంచి జీతాలు వస్తాయి. ఈ సంస్థకు దేశ మంతట బ్రాంచీలున్నాయి.
సుబ్బారావు కి నెలకు ఏడొందల యాభై రూపాయలు జీతం వస్తుందని తెలియగానే హరినారాయణగారికి కళ్ళు తిరిగినంత పనయింది. అయన తర్వాత ఆఫీసులో అడుగు పెట్టాడు. ఇక్కడి వాతావరణం ఆయనకు నచ్చింది. అక్కడి స్టాఫ్ సుమారు పది పదిహేను మంది వరకు ఉంటారేమో. అందరూ ఎవరి పని వారు చకచకా చేసుకు పోతున్నారు. అప్పుడే దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక ఫైల్లో కి చూస్తూ హుందాగా కూర్చున్న సుబ్బారావు అయన కళ్ళ పడ్డాడు.
హరినారాయణగారు తన వంక చూసే సమయానికే అనుకోకుండా సుబ్బారావు కూడా అయన వంక చూడడం జరిగింది. ఆయన్ను చూస్తూనే అతను లేచి "నమస్కారమండి. ఇలా వచ్చారేమిటి?' అన్నాడు.
"కాబోయే అల్లుడి ఆఫీసు చూద్దామని అన్నాడు హరినారాయణ గారు తృప్తిగా నవ్వుతూ.
సుబ్బారావు ఆఫీసులో అందరికీ హరినారాయణగారిని పరిచయం చేశాడు. అతని మిత్రుడు సత్యనారాయణను కూడా అప్పుడే చూశారు. 'ఈ ఆఫీసులో కుర్రాళ్ళందరూ చలాకీగా, అందంగా ఉన్నారు. ఒక్కక్కళ్ళనీ వివరాలు సంపాదించి ఎవరికైనా చెబితే చాలా సంతోషిస్తారు. అందరూ ఫస్ట్ క్లాస్ పెళ్ళి కొడుకులు" అనుకున్నారాయన. అప్పుడే ఆయనకు తెలిసింది అక్కడున్న వాళ్ళందరూ ఆదర్శ పురుషులు. కానీ కట్నం లేకుండా పేద ఇంటి పిల్లను పెళ్ళి చేసుకోవాలనే ఆశయంతో ఉన్నవారు.....
హరినారాయణగారికి కలిగిన సంతృప్తి అంతా ఇంతా కాదు. ఆ సాయంత్రమే అయన సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. అయన వెళ్ళేసరికి కుటుంబ సభ్యులు ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారు.
సత్యనారాయణ తల్లి పార్వతీ దేవిలా నిండుగా, చూడ ముచ్చటగా ఉంది. ఆవిడ భర్త గుంటూరు లో ఇంకా ఉద్యోగం చేస్తున్నాడుట. ఆవిడ ఇక్కడికి వచ్చి పదిహేను రోజులయిందిట. కొడుకేవరో అమ్మాయిని ప్రేమించానని ఇంటికి ఉత్తరం రాస్తే కాబోయే కోడలును చూసుకుందుకు వచ్చిందిట. పిల్ల ఆవిడకు అన్ని విధాలా నచ్చిందట.
సుబ్బారావు అంటే ఆవిడకు ఎంతో అభిమానం. తలిదండ్రులు లేని సుబ్బారావు వాళ్ళింట్లోనే చదువుకుని పైకి వచ్చాడుట. సుబ్బారావు లాంటి బుద్ధిమంతుడు స్నేహం వల్లనే తన కొడుకు కూడా బాగుపద్దాడని ఆవిడ చెప్పింది. ఇప్పుడు సుబ్బారావు కూడా పెళ్ళి చేసుకోదల్చినటా - ఆవిడకు తెలిసింది. వీలయితే ఇద్దరకూ ఒకేసారి పై వారంలో వివాహం జరిపించాలని ఆవిడ అనుకుంటుంది.
పెళ్ళి గురించిన ఆవిడా అభిప్రాయాలు కూడా హరినారాయణగారికి తెలిశాయి. పెళ్ళి అన్నది నూరేళ్ళ జీవితపు పంట. దానిలో ముఖ్యమైన వదూవరులకు చక్కగా ఈడూ జోడూ కుదరడం అది జరిగినప్పుడు మిగతా అర్బాటాలనవసరం , ఈ కరువు రోజుల్లో వీలయినంత సింపుల్ గా వివాహం జరిపించడం మంచిది. అందుకే సత్యనారాయణ , సుబ్బారావు ల పెళ్ళి గుళ్ళో జరిపించాలని ఆవిడ అభిప్రాయ పడుతోంది. పెళ్ళి సమయానికి గుంటూరు నించి ఆమె భర్త కూడా వస్తాడు.
"మగ పిల్లల తల్లిదండ్రులందరూ ఇలాగే ఉంటే ఎంత బాగుండును?" అనుకున్నారు హరినారయనగారు. సత్యనారాయణ తల్లి ఇచ్చిన అమృత తుల్యమైన కాఫీని సేవించి అక్కణ్ణించి బయట పడ్డారయన. బయట పడే ముందు "నీ జాతకమేదైనా ఉంటే ఇయ్యవోయ్" ముహూర్తానికి అవసరం" అనడిగాడాయన సుబ్బారావును.
"జాతకమంటూ నా దగ్గరే ఏదీ లేదు. కావాలంటే దరఖాస్తుల కోసం వాడుతున్న నా పుట్టిన తేదీ ఇవ్వగలను. ఇదీ సరయినదవునో, కాదో నాకు తెలియదు. అన్నాడు సుబ్బారావు.
అతని పుట్టిన తేదీ వివరాలు నోట్ చేసుకున్నాడు హరినారాయణగారు.
4
ముహూర్తం పెట్టించి విషయం సుబ్బారావు చెవిలో పడవేసి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి సుజాత ఒంట్లో నలతగా ఉన్నట్లు తెలుసుకున్నారు హరినారాయణగారు. ఒళ్ళు చూస్తె కొంచెం వేడిగా ఉంది. సూర్యవతి కూతురికి మిరియాల కషాయం ఇచ్చింది.
మర్నాటి కి కూడా ఆ జ్వరం తగ్గలేదు. అయినా హరినారాయణగారంతగా పట్టించుకోలేదు. సుజాతకు నాటు వైద్యమే జరిగింది.
ఆ మర్నాటికి సుజాత పరిస్థితి మరింత తీవ్రంగా తయారయింది. ఆమె శరీరపు వేడి హరినారాయణగారిలో కూడా వేడి పుట్టించింది. ఇంకా ముహూర్తం ఆరు రోజులుంది. సుజాత ఇలాగుంటే ఎలా?
అయన వెంటనే డాక్టర్ ని తీసుకు వచ్చాడు. డాక్టర్ రకరకాల పరీక్షలు చేశాడు.
"ఆర్రోజుల్లో దీనికి పెళ్ళి కావలసి ఉంది. ఈ మాయదారి జ్వరం తగ్గుతుందంటారా డాక్టర్..." అనడిగాడు హరినారాయణగారు.
డాక్టర్ అదోలా నవ్వాడు. "అమ్మాయికి అట్టే ఫరవాలేదు. కానీ, పెళ్ళి ముహూర్తం కాస్త వాయిదా వేయడానికి ప్రయత్నించండి.
"అంటే?' అన్నాడాయన అర్ధం కాక.
డాక్టర్ జవాబివ్వలేదు. "సాయంత్రం మళ్ళీ వస్తానుగా" అని వెళ్ళిపోయాడు.
సుజాతకు ప్రస్తుతం హోఫీవర్! డాక్టర్ చెప్పినట్లు ముహూర్తం వాయిదా వేయించడమే మంచిదేమో! అయితే ఈ విషయం సుబ్బారావు చెవిని వేయాలి ఆరోజు ఆదివారం కాబట్టి ఆఫీసు ఉండదు. అతని ఇంటికే వెళ్ళాలి.
హరినారాయణగారు సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇల్లు తాళం వేసి ఉంది. ఆరోజు రెండు మూడు సార్లయినా ప్రయత్నించాడు కానీ ఇంటి తాళం అలాగే ఉంది.
ఆయనకు కొద్దిగాకంగారు పుట్టింది. సుజాత దురదృష్టవంతురాలేమోనని ఆయనకు లీలగా అనిపించింది. లేకపోతె మొహూర్తం ముందు దానికి జ్వరం రావడమేమిటి? వచ్చిన జ్వరం వెంటనే తగ్గక పోవడమేమిటి? ముందుగా ఈసంగతి చేబుతామంటే సుబ్బారావు దొరక్క పోవడమేమిటి?
హరినారాయణగారికి మనస్సు స్థిమితం లేదు. ఈలోగా డాక్టరు అసలు సంగతి బైట పెట్టాడు. సుజాత కు టైఫాయిడ్ అట!
మరునాడు ఉదయం సుబ్బారావే ఆయనింటికి వచ్చాడు.
హరినారాయణగారి ముఖంలో విషాదం అలుముకుంది. "ముహూర్తం వాయిదా వేయాలి. అమ్మాయికి టైఫాయిడ్ వచ్చింది" చెప్పాడు.
"వ్వాట్" ఉలిక్కి పడ్డాడు సుబ్బారావు . అతని కళ్ళలో ఆశాభంగం పొందిన లక్షణాలు కనబడ్డాయి.
తర్వాత అతను సుజాతను చూశాడు. ఆ కొద్ది రోజుల జ్వరానికే సుజాత ఎండి పోయింది. నీరసం వల్లనయితేనెం, రోగం వల్ల నయితేనేం అమెముఖం కొద్దిగా నల్లబడింది. సుబ్బారావు కంటికి కనపడుతున్నది సౌందర్య మూర్తి సుజాత కాదు. ఒక రోగి!
అతను నిట్టూర్చి సుజాత తండ్రితో అన్నాడు. "మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అందువల్ల నావంటి దౌర్భాగ్యుడితో వివాహం తప్పిపోయింది అన్నాడు.
హరినరయనరావు గారు కంగారుగా "అలా అనకు బాబూ! ముహూర్తం మారినంత మాత్రాన వివాహం తప్పిపోతుందా?" అన్నాడు.
"నా విషయంలో అంతే" అదోలా నవ్వాడు సుబ్బారావు. "కనీసం ఒక ఏడాది వరకూ మళ్ళీ నేను పెళ్ళి ప్రయత్నాలు చేయను"
అతను తన గోడు హరినారాయణగారి ముందు వెళ్ళ బోసుకున్నాడు. ఎంత సంపాదించుకున్నా జాతకరీత్యా అతని జీవితం సాఫీగా నడవదట. ఒక ఏడాది క్రితమే అతను జ్యోతిష్యం చెప్పించుకున్నాడుట. జ్యోతిష్యం మీద అతనికి నమ్మకం లేకపోలేదు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం అతనికి వివాహమయేక ఏడాది తిరక్కుండా భార్య చనిపోతుందిట. అందుకే అతను వివాహాల గురించి ప్రయత్నాలు చేయడానికి భయపడ్డాడు. చివరకు సుజాతను చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముహూర్త్గం పెట్టేసరికి సుజాతకు టైఫాయిడ్ వచ్చేసింది. ఇది అతన్ని చాలా కలవర పెడుతోంది. ఓ ఏడాది వరకూ మళ్ళీ పెళ్ళి సంగతి తలపెట్ట దల్చుకోలేదతను.
"నీ నిర్ణయం సంగతి బాగానే ఉంది. కానీ ముహూర్తం నిశ్చయించిన సంబంధం తప్పిపోయిందంటే దానికి మళ్ళీ పెళ్ళి కావడమెంత కష్టమో ఆలోచించావా" అన్నారు బాధగా హరినారయణరావు గారు.
"బాధ పడకండి మీ అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలు. దురదృష్టం నాది" అని సుబ్బారావు వెళ్ళిపోయాడు.
హరినారాయణగారు నవ్వుకున్నారు. సుబ్బారావుకి సుజాత మీద చాలా ప్రేమ ఉంది. ముహూర్తం తప్పిపోయినందుకతను బాగా నిరుత్సాహ పడ్డాడు. అందువల్లనే అలా మాట్లాడాడు. సుజాతకు నయమాయేక తప్పక ఇద్దరకూ వివాహమవుతుంది. అనుకున్నాడు.
* * * *
వారం రోజుల అనంతరం బజార్లో హరినారాయణ గారికి పరంధామయ్య కనిపించాడు. పరంధామయ్య ముఖంలో కొత్త కళా, ఉత్సాహమూ ఆయనకు గోచరించాయి. పరంధామయ్య ఆయనకు చిన్ననాటి స్నేహితుడు.
హరినారాయణగారు పరంధామయ్యను పలకరించాడు. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. హరినారాయణగారికి పరంధామయ్య ఉత్సాహానికి కారణం తెలిసింది. అయన కూతురికి పెళ్ళి చేశాడు.
"మమ్మల్నేవర్నీ పిలవకుండా ఉషకు పెళ్ళిచేస్స్తావా?" కొంచెం నిష్టూరంగా అన్నాడు హరినారాయణ గారు.
"ఏం చేయను హరీ! అన్నీ అలా కలిసొచ్చాయి. పెళ్ళి కొడుకు బుద్ది మంతుడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఉష అతనికి నచ్చింది. పెళ్ళి వీలైనంత రహస్యంగా జరిగి పోవాలన్నాడు. అతనికో మేనమామ ఉన్నాడట. తన కుంటి కూతుర్ని అతనికి అంట గట్టాలని అయన ప్రయత్నిస్తున్నాడట. చిన్నప్పట్నించీ మేనమమా దగ్గరే పెరగడం వల్ల అతనికి ఆయనంటే భయమూ, గౌరావమూ కూడా ఉన్నాయి. అందువల్ల ఆయనకు తెలియకుండా పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడట. ముహూర్తం కూడా అతనే పెట్టించి తీసుకువచ్చాడు. మంచి సంబంధాన్ని కట్న మక్కరలేకుండా వెతుక్కుంటూ వస్తే వదులుకో బుద్ది కాలేదు. అతని షరతుల మేరకు వివాహం జరిపించేశాను."
"బాగుంది కానీ అల్లుణ్ణి చూడవచ్చా, అది రహస్యమా?"
"నీ నిష్టూరానికి తగ్గట్టే ఉంది కధ మొన్నే అల్లుడు కూతురు రాజమండ్రీ వెళ్ళిపోయారు."
