" ఏం చెయ్యనోయ్ ('రా' అనటం మానేశాడు) ఈ యేడాది ఒక్క రైతూ శిస్తు వసూలివ్వలేదు. ఒక పని చెయ్యి! నలుగుర్నీ అడుగు. నేనూ సాయం చేస్తాను"
ఒకరోజున రాఘవయ్య తాతగారు వచ్చారు. ఆయన ఒళ్ళంతా విబూది, హృదయం అంతా బొగ్గు! యజ్ఞం చేయించటంలో అంతటివాడు లేడని ప్రతీతి.
"ఒరేయ్, రాఘవా! మన సోమయ్య కూతురు - మహాలక్ష్మిలా వుంటుందిరా! మాంచి సాంప్రయాదమైన కుటుంబం. ఆరువేలు కట్నం యిస్తాడురా!" అన్నాడు తాతగారు.
మరుసటిరోజున 'ఆ సంబరం స్థిరపరచమని' చెప్పాడు రాఘవయ్య. తాతగారు 'తథాస్తు' అన్నాడు.
సుబ్బయ్యశెట్టితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు మంచిరోజున ఇనప్పెట్టెకొని గదిలో వుంచి, లక్ష్మీపూజ ప్రారంభించాడు రాఘవయ్య, ఏజెంట్సుద్వారా వడ్డీవ్యాపారమూ మొదలెట్టాడు.
గదిలో వున్న ఒక శిల్పమూ, కుషన్ కుర్చీలూ తీయించి ఒక చిన్న గదిలో పడేయించి, ఒక చాపా ఎకౌంటు పుస్తకాలూ, ఒక గుమాస్తా వాటి స్థానే వుంచాడు.
శర్మకాని, రాజుకాని, గోపాలంకాని, కనపడితే 'చిరునవ్వు' నవ్వేవాడు. క్రమంగా అదీ మానేశాడు.
పెళ్ళి అయిదు రోజులయితే ఖర్చు ఎక్కువని, ఒకరోజున పెళ్ళి ఎవరికీ తెలియకుండా చేసుకొచ్చాడు. ఎలాగో లలితకి తెలిసింది. "నన్ను అన్యాయం చేశావ్! దుర్మార్గుడా ఇప్పుడు నాకు గర్భిణీ -అయిదవ నెల" అని యేడ్చింది. "గర్భం ధరించటం గొప్ప విశేషమేమీ కాదు. ఏదో మహా కష్టపడినట్టు మాటాడుతున్నావు! పోనీ,మా వర్ణంకాదు నువ్వు. ఓపిక ఉంటే పిల్లాణ్ణి పెంచుకో. లేకపోతే గోదావరిలో పడెయ్" అని, నౌకరుచేత ఆమెను పంపించేశాడు. కొన్నాళ్ళకి ఆమె నూతిలోపడి చచ్చిందని వార్త.
ఒకరాత్రి రాఘవయ్య యంట్లో దొంగలు పడి ఏమీ దొరక్క, ఆ గడియారం తీసుకుపోయారు. రాఘవయ్య మిక్కిలి సరిచూసుకుంటాడు. ఇంట్లో పిల్లల్ని (ఇద్దరు సంతానం) తిట్టుతాడు. తర్వాత వడ్డీ వ్యాపారం! సుబ్బయ్య శెట్టితో కబుర్లు, రైతుల్ని జడిపించటం -యిలాంటివే రాఘవయ్య పనులు. "ఒరేయ్, ఇప్పుడు టైము ఎంత అయిందిరా!" అని ఒకడూ, "రాఘవయ్య శెట్టి ఇంటికి బయలుదేరాడు - పన్నెండయిందన్నమాట! అని మరోహడూ!
రాజూ, శర్మా పట్నం వెళ్ళిపోయారు, ఏ పేపర్లోనో పని చెయ్యటానికి తక్కిన మిత్రులు రాఘవయ్య ఇంటివేపే వెళ్ళరు.
కావలిస్తే రండి -మోకాలుదాకా మొద్దు బట్టతో, పెరిగిన గడ్డంతో, మొలకు తాళాలు తగిలించుకొని శెట్టి ఇంటికి వెళ్ళే ఆ రాఘవయ్యని చూద్దురుగాని.
(వాణి -సచిత్ర పక్ష పత్రిక 10 అక్టోబరు, 1941)
****************
