Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 28

 

      ఆమె ఎవర్నీ నమ్మదు, భర్తనే కాదు.                                         
    ప్రియుడ్ని కూడా!    
                                                                  14    
    అంతా చాలా ప్లాన్డ్ గా జరిగింది.    
    త్రిపుర బంకులో పెట్రోలు పోయించుకుని బయల్దేరబోతూంటే, నలుగురు వ్యక్తులు ఆ అమ్మాయిని చుట్టుముట్టి, ఆమెని కారుతోసహా ఎత్తుకుపోయారు. తరువాత ఫోన్ చేసి, వీరదాస్ ని అరవై నాలుగ్గంటల్లోగా వదిలెయ్యకపోతే ఆ అమ్మాయి శవాన్ని చూడవలసి వస్తుందని చెప్పారు.    
    మరుసటిరోజు "ఎం.పి. కూతురు కిడ్నాప్" అన్న వార్త అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.    
    పట్టణంలో ఒక ఎం.పి. కూతురికే భద్రత కల్పించలేని రాష్ట్ర పోలీస్ వ్యవస్థని నిరసిస్తూ, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ బంద్ కి పిలుపు నిచ్చింది.    
    ఆ మరుసటిరోజు బంద్ విజయవంతంగా జరిగింది. విజయవంతంగా అంటే గృహదహనాలు, లూటీలు, బస్సుల అద్దాలు పగలకొట్టడాలూ వగయిరా....    
    రాణా ఇలా ఇరుకునపడ్డాడు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా వుంది. తనే దానికి సెంట్రల్ పాయింట్ అవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డాడు. టెర్రరిస్టులు పెట్టిన గడువుకి కేవలం నలభై గంటలే టైముంది.    
    ఆ రోజు సాయంత్రం స్కూల్ ప్లే గ్రౌండ్ లో బ్రహ్మాండమైన మీటింగ్ ని "ప్రజా చైతన్య పరిషత్" అనే సంస్థ నిర్వహించింది. అది కొత్త సంస్థే అయినా ఎమ్మెల్యేలు, ఎం.పి.లు హాజరవడంతో దానికి విశిష్టత సమకూరింది. రెండు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులూ ఒకే వేదిక ఎక్కడం అంటే ప్రజలకి అంతకన్నా సంభ్రమం ఏముంటుంది? రోజంతా ఊరంతా అదే టాపిక్.    
    ముందు నాయుడు మాట్లాడాడు. "వీరదాసుగారిని జైల్లో పెట్టారు. వీరదాసు ఎలాంటి ప్రజాసేవకుడో అందరికీ తెలుసు. ఏదో హత్యానేరం ఆయన మీద మోపి ఆయన్ని జైల్లోకి తోశారు. అయన బయటకు బెయిల్ మీద రావాలనుకుంటే క్షణాల్లో రాగలరు కానీ ఆయన రాదల్చుకోలేదు. పోలీస్ వ్యవస్థ సామన్యులని ఎలా బాధపెడుతుందో చూపించడం కోసమే వీరదాసుగారు లాకప్ లో వుండిపోయారు. ఆయన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం పోలీస్ లే ఎం.పీ. గారి కూతుర్ని కిడ్నాప్ చేసి, ప్రజల్లో వీరదాసుగారి పలుకుబడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు విధించిన గడువు దాటిన తరువాత ఎం.పి. పులిరాజుగారి అమ్మాయికి ఏదో హాని చేసి, ఇదంతా వీరదాసే చేయించాడని కూడా ఈ పోలీసులు అనగలరు. ఇంతకన్నా వేరే కారణం నాకేమీ తోచడం లేదు."    
    తరువాత ఎం.పి. పులిరాజు మాట్లాడాడు. మైకు ముందు నిలబడి కళ్ళు తుడుచుకున్నాడు ముందు. తరువాత కంఠం సవరించుకున్నాడు. "నా కూతురి ప్రాణాలకి టెర్రరిస్టులు పెట్టిన గడువు కేవలం నలభై గంటలే వుంది. స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలు అడ్డుగా పెట్టిన దేశభక్తుల వంశం మాది. నా కూతురి జీవితం ఒక 'లక్ష్యం'కోసం నాశనమైనా నేను బాధపడను. ఒక తండ్రిగా నా గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నా ఒక రాజకీయ నాయకుడిగా, ఎం.పీ గా ఇలాంటి బెదిరింపులకు తల వంచను. నిజానికి వీరదాసు మా పార్టీ మనిషి కాడు. కానీ ఒక మనిషిని అన్యాయంగా పోలీసులు అరెస్టే చేస్తే - అక్కడ, పార్టీలూ, కులతత్వాలు, ముఠాలు కాదు- మానవత్వం కావాలి. నా కూతుర్ని పోలీసులే కిడ్నాప్ చేయించారంటే, నేను ముందు నమ్మలేదు. కానీ ఎమ్మెల్యే నాయుడిగారి ఉపన్యాసం వింటూంటే అది నిజమే అనిపిస్తోంది. వీరదాసుగారు ఏ క్షణమైనా లాకప్ లోంచి బయటకు రాగలరు. కానీ ఆయన రాదల్చుకోలేదు అనేహ్ది తెలుస్తూనే వుంది. మరి ఈ కిడ్నాప్ ఎందుకు? ఆయన మనుష్యులకి ఈ కిడ్నాప్ చేసి బెదిరించే అవసరం లేదు. పోలీసు దౌర్జన్యాల్ని ప్రజలకి తెలియజెప్పటం కోసం జైల్ నే సత్యాగ్రహశాలగా మార్చుకున్న మహనీయుడాయన. అందువల్లే, మా పార్టీ మనిషి కాకపోయినా ఆయనకి ఈ సభాముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను."    
    సభలో చప్పట్లు,    
    పులిరాజు కాస్త ఆగి అన్నాడు-    
    "రేపు నా కూతురు శవంగా మారి బయటపడవచ్చు. ఆమె శరీరం ముక్కలు ముక్కలుగా ఛిద్రమై ఏ కాలువ ఒడ్డునో కనిపించవచ్చు. నేను బాధపడేది అందుకే. పోలీసులకీ, పోలిటిక్స్ కీ మధ్య ఒక అమాయక ఆడపిల్ల అన్యాయంగా బలి అయిపోతుందే - అని. అది నా కూతురని కాదు. రేపు మీ కూతురవ్వొచ్చు- మీ భార్య అవ్వొచ్చు. మరి దీన్ని చూస్తూ వూరుకోవడమేనా? ప్రజల్లో చైతన్యం రాదా? కేవలం ప్రేక్షకుల్లా వుండిపోతారా? మీరుండరని నాకు తెలుసు. మీరు విప్లవం తీసుకొస్తారు. మనకి వున్నది కేవలం నలభైగంటలే. ప్రతీక్షణమూ విలువైనది. ఉద్యమించండి. పార్టీలకి దూరంగా, రాజకీయాలకి అతీతంగా ఉద్యమించండి-"    
    ప్రజలు ఉద్యమంగా కదల్లేదు. ఛోటా నాయకులూ, రెండు పార్టీల కార్యకర్తలు వారిని నడిపించారు. రౌడీలు వాళ్ళల్లో కలిసి పోయారు. అరగంటలో అరవై లక్షల ఆస్థి నష్టం జరిగింది. దొమ్మీలు- గృహదహనాలు మొదలయ్యాయి. కేంద్రం దూరదర్శన్ బృందాన్ని పంపింది. ఆ రాత్రి వార్తల్లో చాలాసేపు ఈ దృశ్యాలనే చూపించారు. టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన ఎం.పి. కూతురి (అమాయకమైన) మొహాన్ని చాలాసార్లు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రత విషయంలో ఎలా విఫలమయిందీ చెప్పడంలో కేంద్రం సక్సెస్ అయింది.    
    ముఖ్యమంత్రికి ఏం చెయ్యాలో అర్ధంకాలేదు. హోం మినిష్టర్ ని సలహా అడిగాడు. "ఆ ఇన్ స్పెక్టర్ ని ట్రాన్స్ ఫర్ చేసి, వీరదాసుకి క్షమాపణ చెప్పుకుంటే ఈ గండంలోంచి బయటపడగలమంటావా?"    
    "అక్కడ జరుగుతున్న గొడవలో ప్రజలు అందరూ రాజకీయాల్నే నమ్మడం లేదు. ఆ ఇన్ స్పెక్టర్ చేసింది కూడా కరక్టే అని నమ్మే జనం వున్నారు. వాళ్ళని కూడా నమ్మించకాపోతే కష్టం" అన్నాడు హోం మినిష్టర్.    
    "మరేం చేద్దాం?"    
    "ఏక సభ్య కమీషన్ వేద్దాం" సలహా యిచ్చాడు రెడ్డి. ".....నేనే ఆ కమిషన్ మెంబర్ గా వెళ్తాను" అని కూడా అన్నాడు.    
    వెంటనే ఆ ప్రకటన వచ్చింది-    
    "వీరదాసుని లాకప్ లో పెట్టిన సందర్భంలో ప్రభుత్వం కమీషనర్ ని నియమించింది" అని.    
    రాణా జరుగుతున్న విషయాలన్నీ గమనిస్తూనే వున్నాడు. దెబ్బమీద దెబ్బ అన్నివైపుల్నించీ వత్తిడులు. లోకల్ గా రెండు పార్టీలూ ఏకమై పోవడంతో - రౌడీ ఎలిమెంట్స్ నుంచి చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోంది. పైన డియస్పీ -ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నాడు. ప్రజల్లో సానుభూతి వుంది. కానీ దానివల్ల లాభంలేదు. నోరున్న వాడిదే రాజ్యం ఒక పద్దతి ప్రకారం తనకి వ్యతిరేకంగా కాన్వాసింగ్ జరుగుతూ వుందని తెలుసు. వీరదాసు రిమాండ్ కి పంపవలసిన గడువు ఇంకెంతో లేదు. తొందరగా వదిలించేసుకుని చేతులు కడుక్కోవడం ఒక పద్దతి. అటో ఇటో తేల్చుకోవడం మరో పద్దతి.    
    ప్రతి మనిషీ పోరాడగలడు. కానీ ఎంతసేపు పోరాటం కొనసాగించగలడు అన్నది అతడి మానసిక స్థయిర్యం మీద ఆధారపడి వుంటుంది. ఆ పోరాటం వ్యక్తులతోనే అయివుండనవసరం లేదు. పరిస్థితుల్తో పోరాడటం... వ్యక్తుల్తో పోరాడటం కన్నా భయంకరమైనది. మనసు జారిపోకుండా నిలదొక్కుకోవడానికి చాలా ఆత్మస్థయిర్యం కావాలి.    
    హోం మినిష్టర్ వెంటనే బయల్దేరి వచ్చాడు. ఎం.పి. కూతుర్ని ఏ విధంగానూ బాధపెట్టవద్దని టెర్రరిస్టులను కోరుతూ ప్రకటన ఇచ్చాడు. మరో గంటలో కమీషన్ మొదలవుతుందని ప్రెస్ కి చెప్పాడు.    
    పోలీస్ స్టేషన్ మధ్య హాల్లో ఎమ్మెల్యే- ఎం.పి., హోం మినిష్టర్ డియస్పీ కూర్చుని వున్నారు. వీరదాస్ ని కూడా ఒకవైపు కూర్చోపెట్టారు.    
    రాణా నిలబడి వున్నాడు.    
    "వీలైనంత త్వరగా మనం ఈ ఎంక్వయిరీ పూర్తిచేసి, ఎం.పి.గారి కూతుర్ని కాపాడుకోవాలి" అన్నాడు హోం మినిష్టర్.    
    రాణా నవ్వేడు.    
    "ఎందుకు నవ్వుతున్నావ్?"    
    "పులిరాజుగారి కూతురి నెవరూ కిడ్నాప్ చెయ్యలేదనీ, ఎం.పీ గారే కూతుర్ని దాచేసి ఈ విధంగా నాటకం ఆడుతున్నారనీ, ఇక్కడున్న మన అయిదుగురికీ తెలుసు. మనమధ్య ఈ హిపోక్రసీలు ఎందుకు సార్, విషయానికి రండి" అన్నాడు.    
    "నువ్వు చాలా తెలివైనవాడివి" అన్నాడు హోం మినిష్టర్.    
    'నా తెలివితేటలన్నీ ప్రజల్ని రక్షించడానికన్నా ప్రజాప్రతినిధుల్ని ఎదుర్కోవడానికే సరిపోతున్నాయి' అనుకున్నాడు రాణా. "ఇంక ఎంక్వయిరీ ప్రారంభిద్దామా?"    
    రాణాకి మనసు కుతకుత ఉడికిపోతున్నది. అది తన పోలీసు స్టేషన్ తన సీట్లో హోం మినిష్టర్ కూర్చుని వున్నాడు. అతని ఎదురుగా ఎం.పి., ఎమ్మెల్యేలు కూర్చుని వున్నారు పక్కగా వీరదాసు కూర్చుని వున్నాడు.    
    తాను నిలబడి వున్నాడు!!!    
    ఆ దృశ్యం చిత్రకారుడు గీసిన బొమ్మలా వుంది. సామాజిక అసంబద్దం ఆ చిత్రం.    
    "నీ తండ్రి పేరు?"    
    "రామస్వామి సర్!"    
    "ఏం పని చేస్తూ వుండేవాడు?"    
    "స్టూవర్ట్ పురం సెటిల్ మెంట్ గ్యాంగ్ లో మనిషి ప్రభుత్వం ఇచ్చిన పొలం దున్నుకుంటూ జీవిత పంథా మార్చుకున్నాడు."   
    "ఓహో! అయితే నువ్వు దొంగ కొడుకువన్నమాట."   

    "నేను పోలీస్ ఆఫీసర్ని సర్"    
    "రామస్వామిని ఉరి తీసినట్టు రికార్డుల్లో వుంది?"    
    "అవును సార్."    
    "టెంపుల్ గార్డులని చంపిన నేరానికి?"

    "అవును సార్! రికార్డుల్లో అలాగే వుంది."    
    "ప్రభుత్వం దగ్గిర పొలం తీసుకుని తిరిగి మర్డర్లు చేయించడం ప్రారంభించాడా?" వీరదాసు అడిగాడు. అతడి మొహంలో నవ్వు కొట్టొచ్చినట్టు కనబడుతూంది. రాణా ఆవేశాన్ని అణచుకున్నాడు.    
    "నా తండ్రి మర్డర్ చేయలేదుసార్. గుళ్ళో దొంగతనం చేసిన వ్యక్తులు, సాక్షి అయిన నా తండ్రిని కొట్టి, బెదిరించి హత్యానేరం వప్పుకునేలా చేశారు. స్టూవర్ట్ పురం దొంగలకు ఇలాంటి శిక్షలు మామూలే."    
    "ఇదంతా నీ కెవరు చెప్పారు?" ఎమ్మెల్యే అడిగాడు.    
    "రామాచారి చెప్పాడు. మరణ వాంగ్మూలంలో అదంతా వ్రాస్తే సంతకం పెట్టాడు."    
    "అసలు విషయం అదికాదు రాణా జరిగింది నేను చెబుతాను విను. నీ తండ్రి టెంపుల్ గార్డుని చంపింది నిజమే అయితే నగల దొంగతనానికి వెళ్ళికాదు. గార్డునే చంపడానికి వెళ్ళాడు గార్డుకి ఒక స్త్రీతో సంబంధం వుంది. ఆ కక్షతో చంపడానికి వెళ్ళాడు. అందుకే నగల దొంగతనం ఆ రోజు జరగలేదు...."    
    "నగల దొంగతనం జరిగింది. ఒరిజినల్ నగలు తీసేసి డూప్లికేట్ వి పెట్టారు. అందువల్లే ఎవరికీ అనుమానం రాలేదు."        "అలాగే అయితే, మొన్న పోలీస్ స్టేషన్ లో నువ్వు తెచ్చిన నగలు డూప్లికేట్ వా?"

    "కాదు ఒరిజినల్...."    
    "ఎక్కడ దొరికాయి?"    
    "ఎమ్మెల్యే నాయుడి ఇంట్లో...."    
    'మరి ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదేం?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS