Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 27


                                మొహబ్బత్ ఖాన్
    
    రాజుగారు నపుంసకుడు అంచేత రాజ్యంలో రతి నిషేధం
    విధించారు. అయితే దానికి నిర్భంద బ్రహ్మచర్య చట్టం
    అని పారిభాషిక పదం సృష్టించి ఆ పిమ్మట ఆజ్ఞ జారి
    చేశారు యథా రాజా తథా ప్రజా అని శ్రుతిస్మృతి
    పురాణాదులు వేనోళ్ళ ఘోషించడం రాజుగారికీ తెలియని
    విషయమేమీ కాదు. రాజులాగే ప్రజలు కూడా మారినప్పుడే
    దేశమంతా (అంతా కలిసి పాతిక ముప్పయి చదరపు మైళ్ళని
    మించి వుండకపోయినా) శాశ్వతంగా శాంతి సౌఖ్యాలలో
    ఓలలాడుతుందనే గట్టి నమ్మకంతోనే మహానుభావుడు
    మన్మథ కార్య నిషేధానికి చట్టరూపం తెచ్చి దేశం మీద
    ప్రయోగించాడు.
    
    ఈ కథా కాలం యిప్పటికి అయిదు వందల సంవత్సరాలకు పూర్వమే అయినా రాజుగారిది మెచ్చుకోదగ్గ గొప్ప ప్రజాస్వామిక దృక్పథం. రకరకాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పదిహేను మంది మేథావులను సమావేశపరిచి తన అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు. సభాసదుల్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా రాజుగారు తమ అభిప్రాయాన్ని ప్రకటించిన ముందే ఆ అభిప్రాయంతో బేషరతుగా ఏకీభవించిన రాజభక్తిపరులు. రాజుగారు తీర్మానం పెట్టగానే "జై వీరాంజనేయ" "జై భీష్మాచార్య" అనే నినాదాలతో తమ సమ్మతిని తెలియజేశారు. ఇంత ప్రాచీనమైన సంఘ సంస్కారాన్ని పునరుద్దరించడంలో రాజుగారి ముందు చూపునూ, భవిష్యత్తు పట్ల గల వారికి గల అకుంఠిత విశ్వాసాన్నీ, సభ్యమైన భాషలో సముచితంగా పొగుడుతూ టూకీగా ఉపన్యాసాలు చేశారు.
    ప్రజాస్వామ్యంలో విభిన్నాభిప్రాయాలుండడం సహజమే అని రాజుగారికి తెలుసును కాబట్టి చేతులెత్తని ఇద్దరికీ, ఇతర బర్బర నియంతల్లాగ తక్షణ మరణశిక్ష విధించలేదు. వారిలో ఒకడు  తన ఆస్థాన కవి కాంస్య వృషభ క్రియాశక్తి రెండోవాడు సాక్షాత్తూ తన ప్రధానమంత్రి. "కవిగారూ, ఏమిటి మీ అభ్యంతరం?" అని రాజుగారు ప్రశ్నించారు. "మరేం లేదు మహాప్రభూ! మన మహాకవులంతా శృంగారాన్ని రసాది దేవతగా కీర్తించారు. ఈ యొక్క కొత్త చట్టంవల్ల ఆ యొక్క అమోఘరసం పూర్తిగా యింకి పోతుందేమోనని భయపడుతున్నాను. జీవితంలో ఇక రుచి అనేదే మిగలదని నాకు తోస్తుం"దని సవినయంగా మనవి చేసుకున్నాడు క్రియాశక్తి రతి కార్యంలో రుచి అంటూ ఏమీలేదని స్వానుభవంతో తెలుసుకున్న రాజుగారు కవిగారి అభ్యంతరాన్ని తోసి రాజన్నాడు. అప్పుడు ప్రధానమంత్రి ఏకాకి అయిపోయినట్లు గ్రహించి తటస్థంగా ఉండిపోతానని తప్పుకోవడానికి ప్రయత్నించాడు. "అలాక్కాదు మాకు తట్టని మహత్తర కారణాలు మీ దగ్గర వుండవచ్చును. అందువల్ల అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకులుగా మారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి సంకోచం లేకుండా మీ అభిప్రాయాన్ని మనవి చేసుకోవచ్చు" నన్నారు రాజుగారు. "ఇది ప్రకృతి విరుద్ధం అని నాకు తోస్తుంది" అన్నాడు మంత్రిగారు ముక్తసరిగా.
    అందులో ఎంత హాస్యం ఉందో ఏమో గాని రాజుగారు పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వడం మొదలు పెట్టారు. తర్వాత సభా మర్యాదలు గుర్తుకొచ్చి మళ్ళీ స్థిమితపడి, "మంత్రిగారూ! ఇంతేనా ఏమిటో అనుకున్నాను?.....ప్రకృతి శక్తులను జయించడమే మానవుడి లక్షణం. ప్రకృతికి బానిసగా పడివుంటే పాతకాలపు అలవాట్ల నుండి మానవుడు బైట పడేవాడు కాడు. అంచేత మీ వాదంలో పనిలేదు. విప్లవాత్మకమైన ఈ శాసనాన్ని విజయవంతంగా అమలు చేస్తే భావి చరిత్రకారులు నాపేరు సువర్ణాక్షరాలలో లిఖిస్తారని మరచిపోకండి. దయచేసి ఆ కీర్తి నాకు దక్కనివ్వండి. కాదు పోదూ అని మీరంతా తీర్మానానికి వ్యతిరేకిస్తే ఈ క్షణమే దాన్ని ఉపసంహరించుకోవటానికి సంసిద్దున్ని" అన్నారు రాజుగారు తీర్మానం నెగ్గిపోయిందన్న ధైర్యంతో.
    అలాగే తీర్మానం నెగ్గింది. ఆనాటి అర్దరాత్రి నుంచీ రతీ నిషేధం అమలులోకి వచ్చింది. ఆస్థాన కవి అసమ్మతి సూచకంగా దేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు.
    శాసన పాఠాన్ని రాళ్ళమీద రాగి  రేకుల మీదా చెక్కించారు. తాటాకుల మీద రాయించారు మూల మూలలా దండోరాలు వేయించారు. ఇందువల్ల చాలామందికి ఉద్యోగాలు కాకపోయినా, వ్యాపకాలు దొరికాయి. వాటినే సద్యోగాలంటారు కాబోలు.
    రాజుగారు శాసనమైతే జారీ చేశారు. కాని దాన్ని సజావుగా అమలు జరపడం మాటలా? అందుకు చాలా అదనపు సిబ్బంది కావలసి వచ్చింది. ఆ సిబ్బందిని పోషించడానికి అదనపు పన్నులు వెయ్యవలసి వచ్చింది. శాసనాన్ని కఠినంగా అమలు చెయ్యాలని ఉత్తరువు తీసుకున్న రక్షకభట శాఖలోనే చాలామంది రతి నిషేధ వ్యతిరేకులున్నారని రాజుగారి గూఢచారులు రహస్యపత్రాలు దాఖలు చేసుకుంటున్నారు. గూఢచారుల్లో కూడా చట్టం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలివైనవారు కాబట్టి రాజుగారు సులువుగానే పసికట్టారు.
    శాసనాన్ని కట్టుదిట్టంగా అమలు చెయ్యడానికి మొదటి చర్యగా రాజుగారు వివాహ వ్యవస్థని రద్దుచేశారు. వివాహితులందరూ నిర్భంధంగా విడాకులు తీసుకోవాలని కట్టడి చేశారు. ఇందువల్ల న్యాయస్థానాల సంఖ్య పెరిగినా నిరుద్యోగుల సంఖ్య తరిగింది. రాజుగారికి మరో ప్రశస్తమైన ఆలోచన తోచింది. ఆడదాన్ని మొగాడూ - మొగాన్ని ఆడదీ చూస్తేనే కదా రతి క్రియకి అవసరమూ, అవకాశమున్నూ? కాబట్టి తన రాజ్యంలో స్త్రీలనూ, పురుషులనూ వేరు చెయ్యాలి ఇందుకు వీలుగా దేశం మధ్యన ఉత్తర సరిహద్దు నుండి దక్షిణ సరిహద్దుదాకా ఇరవై అడుగుల గోడ నిర్మించాలి. తూర్పు వైపున స్త్రీలనూ, పడమటి వైపున పురుషులనూ కేటాయించాలి. ఇందుకో ఐదేళ్ళు పట్టవచ్చును గాక. అయినా ఇదే అత్యుత్తమమైన మార్గం.
    ఇదే ప్రపంచంలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అని కొంతమంది చరిత్రకారుల ఉద్దేశం.
    అడ్డుగోడ నిర్మాణం నిరాటంకంగా జరిగిపోతోంది. వందలాది కూలీలకు చేతినిండా పని దొరికింది. చరిత్రలో మొదటిసారిగా నిరుద్యోగాన్ని నిర్మూలించిన ఘనత కూడా మన రాజుగారికే దక్కింది. గోడ లేవడానికి ముందే తూర్పు వైపంతా ఆడవాళ్ళూ, ఎడమవైపంతా మొగవాళ్ళూ తోలబడ్డారు. గోడకి రెండు వైపులా నూరేసి గజాలకు ఒక్కొక్కరి చొప్పున ఆరెక భటుల నియామకం జరిగింది. ఇటున్న మొగాళ్ళని అటూ అటున్న ఆడవాళ్ళని ఇటూ రాకుండా అటకాయించడమే వాళ్ళ నిత్య విధి. రాజుగారు తరచు నిజస్వరూపంతో గుర్రంమీద ఒకప్పుడూ, మారువేషంతో కంచర గాడిద మీద ఎక్కి మరొకప్పుడూ పర్యవేక్షణ జరుపుతున్నారు. శాసనం ఉల్లంఘించిన వాళ్ళకి ఆరునెలలు మొదలు ఏడాదిదాకా కారాగార శిక్ష కాని ఎందువల్లనో చెరసాలలన్నీ పలచగానే వున్నాయి. స్త్రీ పురుషులు ఒకర్నొకరు కలుసుకోవడానికి ఎటువంటి కొత్త ప్రక్రియలు కనిపెట్టేరో అందుకు రక్షకభటుల సహకారం ఎంతవరకూ వుందో చరిత్రకారుల పరిశీలనకు వదిలేద్దాం.
    ఈ లోగా ప్రధాన మంత్రిగారు పెద్దగారికో పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టాడు. నిర్భంధ బ్రహ్మచర్య చట్టం పూర్తిగా విజయవంతమయితే, వచ్చే తరానికి మనుష్యులే మిగలరనేది అతని వాదన.....దీన్నలా అలా కొట్టి పారెయ్యడానికి వీల్లేదు. దీర్ఘంగా ఆలోచించవలసిన సమస్యే ఇది! మరయితే దీన్నెలా పరిష్కరించడం?
    రాజుగారు తన అంతరంగిక ఆలోచనా మందిరంలో కూర్చుని దీక్షగా సమస్యను అధ్యయనం చెయ్యడం ప్ర్రారంభించారు. శాస్త్రీయంగా విశ్లేషణ చేసి ఈ సమస్యకు రెండు ధృవాలన్నట్లు నిర్ణయించారు. ఒకటి రతి కార్యం జరగకూడదు. రెండు ప్రజావృద్ధి జరగాలి పరస్పర వ్యతిరేకమయిన యీ విభిన్న ధ్రువాలను సమన్వయ పరచడం ఎలా?
    సంఘంలో సమర్దులూ, సత్పురుషులూ అయిన వాళ్ళు కొంత మందిని ఎంపిక చేసి మాత్రం తూర్పు వైపు వెళ్ళడానికి అదయినా నెలకు రెండు, మహా అయితే మూడుమార్లు మాత్రమే వెళ్ళడానికి అనుమతిస్తూ రాగి బిళ్ళలను మంజూరుచేస్తే? చాలా బాగుంది నిర్భంద బ్రహ్మచర్యానికి అపరాధంగా స్వచ్చంధ వ్యభిచారం. ముఖ్యంగా సైన్యంలో ఒక పెద్ద అసంతృప్తి వ్యాపించినట్టుంది. కాబట్టి ముందుగా వాళ్ళని హెచ్చు సంఖ్యలో తృప్తిపరచాలి. పోనీ వాళ్ళని పెళ్ళిచేసుకోనిస్తే-వీల్లేదు అప్పుడు చట్టం ఉద్దేశమే విఫలమయి పోతుంది. రాగి బిళ్ళల పద్దతి చాలా బాగుంది.
    సైన్యం తరువాత ఈ చట్టం అంటే లోలోపల అసహ్యించుకుంటున్న వాళ్ళెవరూ మరెవరు? మన కుర్రకవులు వీళ్ళచేత ప్రబంధాలు చదవడం మానిపించినా భజన కీర్తనలు వ్రాయించి పారితోషికాలిస్తున్నా దొంగతనంగా వీళ్ళు నిషిద్ద సంస్కృత సాహిత్యాన్ని చదువుతున్నట్లు రాజుగారికి తెలుసు. అంచేత ఎందుకొచ్చిన గొడవ? వీళ్ళందరికీ తలో రాగిబిళ్ళా పారేస్తే......వీల్లేదు వీళ్ళని తూర్పు దిక్కుకి వెళ్ళనియ్యనే కూడదు. వెళ్ళనిస్తే ఇంకేమైనా వుందా?
    రాజుగారి మానసిక వ్యధల జాబితా ఇంతటితో పూర్తి కాలేదు. తన తదనంతరం ఎవరీ దేశాన్ని పాలించాలి? వాన రాకటా, ప్రాణంపోకటా చెప్పలేం కదా? హఠాత్తుగా ఈ త్రివిక్రమ కీర్తి భూపాలుడు హరీ అంటే, ఆ తర్వాత పడమటి కొండల అవతల వున్న తన దాయాది హరిశ్చంద్రకీర్తి అమాంతంగా ఒక్క నెత్తురు చుక్కయినా చిందించని అహింసాత్మకంగా యీ దేశాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకుంటాడు. అందుకు ధర్మశాస్త్రం కూడా అంగీకరిస్తుంది. తాను మరణించిన తర్వాత మరెవ్వరు రాజయినా మంచిదేగాని ఆ హరిశ్చంద్రకీర్తిగాడు మాత్రం ఈ గడ్డిమీద అడుగు పెట్టకూడదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS