Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 26

 

    "సమవర్తి! ఓ సుక్ష్మరహస్యమును విస్మరించుచున్నారు. బ్రహ్మదేవుడు అతనికి నిండు నూరేళ్ళు జీవించు ఆయువును ఇచ్చి వున్నాడు. బ్రహ్మరాతకు తిరుగులేదు. అయితే అందులో ఓ సుక్ష్మమున్నది" నారదుడు రహస్యంగా యమధర్మరాజు చెవి దగ్గర చేరి అన్నాడు.


    "సుక్ష్మ రహస్యమా? ఏమది?" నారదుని వైపు చెవి ఒగ్గి అడిగాడు.


    "ఏమున్నది యమధర్మరాజా! మా తండ్రిగారు అతను నూరేళ్ళు బ్రతుకుతాడని రాసి యున్నారు. అది అతని ఆయువు. అయితే ఆ మానవుడు తన స్వయుంకృతమున గానీ, అతని ఇష్టముచేత గానీ, అతనికై అతను మరణించవలయునని నిర్ణయించుకొనిన అది బలవస్మరణము అవును. అది ఆ మానవుడి ఇచ్చ మీద ఆధారపడి వుంటుంది. ఈ సుక్ష్మ రహస్యమును గుర్తుంచుకుని అటు వైపు నుంచి నరుక్కురండు. ఆ మానవుడి తన జీవితం మీద విరక్తి కలిగి చావే తనకు శరణ్యమని అనుకోనున్నట్లు చేయుము. అప్పుడతను బలవస్మరణ యత్నం చేయును. మీ పాశమునకు పని. మీ పంతమునకు గెలుపు. రెండూ ఏకకాలంలో లభించగలవు."


    
    నారదుడు తనవంతు కర్తవ్యం నిర్వహించాడు లోకకళ్యాణార్ధం.


    "లెస్స పలికితిరి నారద మహర్షి. ఏమియో అనుకున్నాను గానీ మీరు కలహాభోజులు కారు. బహు చమత్కారులు. బహు చక్కని దివ్యమైన యోచన చేసినారు. అప్పుడే ఆ మానవుడిని చిత్ర విచిత్రమైన వేదనలకు గురిచేసి విరక్తి కలిగించి మరణాన్ని ఆశ్రయించునటుల చేసి నా పాశం చేత అతని ప్రాణములు హరించివేసేద" గదను భుజంపై పెట్టి దర్పంగా అన్నాడు యమధర్మరాజు.


    తధాస్తు దేవతలు మౌనం వహించారు.


    నారదుడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ "నాకిక సెలవియ్యండి యమధర్మరాజా! లోకకల్యాణం కోసం ముల్లోకాలే కాదు, సర్వలోకాలు దర్శించవలసిన పని యున్నది" అంటూ అక్కడి నుండి జారుకున్నాడు.


    తధాస్తు దేవతలు ఆలోచనలో పడ్డారు.

 

                                                               * * *


    శ్రీచంద్ర బద్దకంగా నిద్ర లేచాడు.


    మనసులో ఏదో ఆందోళన ప్రారంభమైనట్టు అనిపించింది. రాత్రిపూట మెడ దగ్గర కొద్దిగా నొప్పి అనిపించింది.

 

    తనకేమైంది? ఒక్క క్షణం వూపిరి ఆగినట్టు తోచింది రాత్రి. ఏదైనా భయంకరమైన కల వచ్చిందా? ఎప్పుడూ రాత్రి వేళ నిద్రపోయాక ఏదో కల రావడం జరిగేది. రాత్రి మాత్రం ఏ కలా రాకుండానే గడిచిపోయింది.


    బ్రష్ చేసుకుంటుండగా జామ చెట్టు కింద ఓ స్టూలేసుకుని ఇంగ్లీషు నవల 'కిస్ మీ' చదువుకుంటోంది బామ్మ.


    "ఓసే బామ్మా! నువ్వెప్పుడూ బాగుపడతావే? హవ్వ.....ఈ వయసులో కిస్ మీ నవల చదవడం ఏమిటి?" అన్నాడు శ్రీచంద్ర.


    "వయసులో వుండగా మీ తాతయ్య నా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవడానికే భయపడేవాడు. పోనీ నేనైనా తెగించి ముద్దు పెట్టుకుందామా అంటే నేను 'ప్చ్' అనకముందే మెరికలు తిరిగి పోయి "నాకు సిగ్గేస్తోంది" అంటూ నాలుగిళ్ల అవతలకి పారిపోయేవాడు. ఓ ముద్దూ తెలియదు, ఓ సరసము తెలియదు" తాపీగా అంది బామ్మ.


    "నిన్ను కదిలించడమంత బుద్ది తక్కువ పని మరోటిలేదే బామ్మా. అయినా ఈ వయసులో కాసింత ఆద్యాత్మిక ధోరణి అలవర్చుకొవే  పుణ్యమైనా వస్తుంది" నెత్తి నోరు కొట్టుకుంటూ అన్నాడు శ్రీచంద్ర. బామ్మ పట్టించుకోలేదు. ఇంట్రెస్టుగా పేజి తిప్పింది.


    "అవును గానీ బామ్మా రాత్రి నీ కొడుకేంటే అసలు నా దగ్గరికే రాలేదు. నన్నోక్క తిట్టు కూడా తిట్టలేదు. కొంపదీసి మౌనవ్రతం ఏమైనా చేస్తున్నాడా?" అడిగాడు శ్రీచంద్ర.


    "అదే నాకు ఆశ్చర్యంగా వుందిరా. కానీ ఒరే రాత్రి నాకు పెద్ద కేక వినిపించింది. మంచమ్మిది నుంచి దబ్బున పడ్డ శబ్దం కూడా వచ్చింది. అది మీ అమ్మ గదిలో నుంచి" అంది.


    "చీ.....సిగ్గు లేకపోతే సరి" అన్నాడు మొహమంతా ఎర్రబడుతుండగా.


    "చాల్లే సంబడం. నాకేం తెలుసు. నాకా సౌండ్ వినిపించింది. అయినా ఏంటో వాడిలో కొద్దిగా చేంజ్ కనిపించిందిరా. నిన్నట్నుంచి అదోలా ఉంటున్నాడు. హుషారుగా వుంటున్నాడు" అంది బామ్మ.


    ప్యాట్ని సెంటర్ దగ్గర ఆంగ్లో- ఇండియన్ లేడితో తండ్రి స్కూటర్ మీద వెళ్ళిన విషయం బామ్మతో చెప్పాలా? వద్దా? అన్న డైలమాలో పడ్డాడు శ్రీచంద్ర. చెబితే ఊరంతా టాంటాం వేస్తుందేమో? అలా ఆలోచిస్తూ మొహం కడుక్కుని బాత్రూం లోకి దూరాడు.


    పావుగంటలో స్నానం పూర్తీచేసాడు.

    
    అతనికి మనసు మనసులో లేదు.


    తండ్రి గొంతు వినిపించకపొతే పిచ్చెక్కిపోతోంది. మాములుగా అయితే ఈపాటికి శత తిట్ల వ్రతం పూర్తయ్యేది. మినిమమ్ వంద తిట్లయిన తిట్టేసేవాడు. అలాంటి తండ్రి తిట్ల టోన్ వినిపించకపోవడంతో డీలా పడిపోయాడు.


    కిచెన్ లో టిఫిన్ చేస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళి-


    "అమ్మా! నాన్నేంటి మన్ను తిన్న పాములా వుండిపోయాడు. అదేంటో నన్ను తిట్టకపోతే మనసంతా పికుతోందే. వెళ్ళవే....నా బంగారు తల్లివి కదూ. వెళ్ళి చిన్నాడు బెంగపెట్టుకున్నాడు. ఓసారి తిట్టవయ్యా తిట్ల మొగుడా అని చెప్పవే- అన్నాడు శ్రీచంద్ర.


    "ఇవ్వాల నాకు సుఖంగా వుంది మీ నాన్న నోరు విప్పకపోతే . మళ్లా వెళ్లి పడుకున్న గాడిదను లేపి తన్నించుకొమంటవా?" కయ్ మంది తల్లి.

 

    రెండు చేతులు జోడించి--


    "అమ్మా! నీ జన్మ ధన్యమైందే. కట్టుకున్న మొగుడ్ని పడుకున్న గాడిదతో పోల్చిన నీ పాతివ్రత్యాన్ని చూసి సతి సుమతి, అనసూయ, దౌపది ఇంకా వాళ్ళ కజిన్లు నీకు రుణపడి వుంటారే" అన్నాడు తన్మయత్వంతో.


    నిజంగా అంటున్నాడా, వ్యంగ్యంగా అంటున్నాడా? అన్న డౌట్ తో కొడుకు మొహంలోకి చూసింది.


    ఈ మాటలన్నీ పక్క గదిలో పూజ చేసుకుంటున్న గరుడాచలానికి వినిపిస్తూనే వున్నాయి.


    అయినా చిత్రంగా నోట్లో నుంచి బూతులు రావడం లేదు. ఎదురుగా వున్న  వెంకటేశ్వరస్వామి పాటం వైపు చూసి చేతులు జోడించాడు.


    వెంటనే అందులో ఆ దేవుడి బొమ్మ మాయం అయింది. ఆంగ్లో ఇండియన్ ప్రత్యక్షమై "మై లవ్....గరుడా......కామన్" అంటూ చేతులు చాస్తున్నట్లు అనిపిస్తోంది.


    తల విదిల్చి వుండిపోయాడు.


    అతనికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.


    తన వెరైటి కాస్ట్యుమ్స్  వేసుకుని ఆ ఆంగ్లో- ఇండియన్ పిలుతో డ్యుయెట్ పాడుతున్న ఆలోచన వచ్చింది.


    "కసిగా వుంది కసికసిగా వుంది" అని తను ఎన్టిఆర్ లా పాడుతుంటే ఆమే వాణిశ్రీ లా కాస్ట్యుమ్స్ వేసుకుని తనతో స్టెప్పులు వేస్తోందిట.


    తను అక్కినేనిలా చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అంటే తనూ అలా డ్యుయెట్ అందుకుందిట.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS