మధూళీ విప్పరితంలా చూస్తుంది.
"ప్రపంచంలో మరణాలే లేకుండా చేయగల శాస్త్రజ్ఞుడ్ని నేను కాపాడితే ఆ తర్వాత ఇక ప్రపంచంలో చావులుండవు. అవసరమైతే శిలువ వేయబడ్డ జిసేస్ నీ బ్రతికించగలడు.....సోక్రటిస్ లాంటి వేదాంతుల్ని మనకి మిగల్చగలడు. ఈ లోకంలో ప్రాణభితి అన్నపదాన్ని తుడిచి పెట్టగలడు. నిజమే కాని ఆ వ్యక్తితో నాకు పనిలేదు. ముందు అతడ్ని బ్రతికించిన ఆ తర్వాత అతడి ద్వారా మిగతా ఇద్దర్ని బ్రతికించుకోగలమేమో కాని అందర్నీ బ్రతికించగల శక్తి ఆ వృద్దుడికే దక్కేది. మరో రోజు తర్వాత మాత్రమే అన్నారు. మీరు.....అయితే ఆ ముగ్గురి ప్రాణాలు మిగిలేది మరో నిముషం మాత్రమే. ఆ విషయాన్ని మీరు స్పష్టం చేశారు."
సునిశితంగా ఆలోచించి మాట్లాడుతున్న ధన్విని చాలా ఏకాగ్రతగా గమనిస్తూ "ఆఫ్ కోర్స్" అంది మధూళీ.
"పుట్టుకలు, చావులు తప్పనిసరయిన ఈ ప్రపంచంలో ఒక బుద్దుడు పోయినా ఇంకో మహావీర జైనుడు పుడతాడు. లెదూ అంతకు మించిన సంస్కర్త ఉద్భవించే అవకాశమూ వుంది. అయితే సంస్కర్తలు లేకపోయినా వాళ్ళ ప్రవచనాలు ఇంకా బ్రతికే వున్నా, వాటిని ఆచరించని ఈ ప్రపంచంలోని మనుషులు మారనిది చెప్పేవాళ్ళు లేక కాదు. వినాలనే ఆలోచన లేక, పైగా పుట్టిన ప్రతివాడు బ్రతికివుంటే వుండటానికి చోటు, తినడానికి తిండి దొరకడం పెద్ద సమస్యగా మారుతుందన్న ఆలోచనతో "ఎకలాజికల్ బేలెన్స్' కోరే మనిషిగా వృద్దుడైన శాస్త్రజ్ఞుడ్ని బ్రతికించలేను."
వెంటనే రియాక్టయింది మధూళీ. "ఆయన్ని ముందు బ్రతికించుకుంటే మానవాళికి అవసరమైన వ్యక్తుల్నయినా మనం అతడి ద్వారా దక్కించుకోవచ్చుగా?"
"మనుషుల్ని బ్రతికించడం కన్నా మనుషుల్లోని మానవత్వాన్ని బ్రతికించగల మనిషైతే అయన విషయంలో నేను సుముఖంగా రియాక్టయ్యేవాడ్ని మిస్ మధూళీ.
"వెల్....చెప్పండి" అంది మధూళీ.
"ఇకపోతే అమ్మ నిడన బ్రతుకుతున్న ఓ అయిదేళ్ళ అనాధ బాలుడు....నన్ను కన్నతల్లికి ప్రాణప్రదమైనవాడు కావచ్చు. రేపు ఒక గాంధిగానో, లేక జిసేస్ గానో ఎదిగేటంత గొప్పవాడు కావచ్చు. కానీ.....ఒక్క క్షణం ఆగాడు.
"మూడో వ్యక్తీ గర్భవతిగా వున్న స్త్రీ....కడుపులో వున్న ఆమె బిడ్డ కూడా రేపు సంఘాన్ని ఉద్దరించగల సమర్ధుడై వుండొచ్చు. అంతకుమించి ప్రపంచంలో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఓ కడుపున పడ్డ ప్రాణి అందరిలా తనూ బ్రతకాలనే ఆసక్తితో ఇంకా కళ్ళు తెరవని మాంసపు ముద్ద.....రేపు పుట్టాక మీరు చెప్పిన శాస్త్రజ్ఞుడ్ని మించిన వ్యక్తీ కాగల అవకాశం వున్నవాడు. పైగా ఆమెను నేను బ్రతికిస్తే ఆమెకి, ఆమె కడుపులో బిడ్డకి, ఇద్దరికీ ప్రాణబిక్ష పెట్టినవాడ్ని అవుతాను. సో.....నేను ఆమెను కాపాడటాన్నే ఇష్టపడతాను."
అరనిముషం మౌనం తర్వాత మధూళీ వాలెట్ లో నుంచి మూడు ఎన్ వలప్స్ ని తీసింది.
సామ్రాజ్యం, ధన్వి ఇద్దరూ విభ్రమంగా చూస్తుంటే "ఈ ఎన్ వలప్స్ లో వున్న మూడు జవాబులూ మేధావులైన ముగ్గురు వ్యక్తులనుంచి ఇదే ప్రశ్నకి నేను కలెక్ట్ చేసిన జవాబులు. ఓసారి చూడండి" అంది వాటిని అందిస్తూ.
మధూళీ ఏం ఆశించి ఇదంతా చేసిందో సామ్రాజ్యానికి అర్ధం కాలేదు.
ధన్వి మొదటి ఎన్ వలప్ తెరిచాడు. రామకృష్ణ మఠానికి చెందిన చైతన్యానందస్వామి అభిప్రాయం వుంది అందులో.
"మరణాన్ని ఆపడం అంటే సృష్టికి ప్రతిసృష్టి చేయడం వంటిది . ఇది మర్త్యలోకం. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పోవాల్సినవాళ్ళే. బౌతికమైన దేహాన్ని తిరిగి పంచ భుతల్లో విలీనం చెయడం సృష్టికి అవసరం. అందుకే ప్రాణదానం చేయగల శాస్త్రజ్ఞుడ్ని కాపాడటం అనవసరం. ఇకపోతే గర్చవతి అయిన స్త్రీ ...ఆమె గర్భంలో వున్న బిడ్డ గురించి ఆలోచించడం రూపం లేని స్వప్నాన్ని దర్శించడం వంటిది. అందుకే ఎక్కడో పొదలో వుందనిపించే పక్షి కన్నా చేతిలో వున్న ఫలం మనిషికి ముఖం కాబట్టి అయిదేళ్ళ పసికందుని కాపాడటమే నయం."
పైకి చదివాడు ధన్వి.
సామ్రాజ్యం అబ్బురంగా చూస్తుంది.
మరో అభిప్రాయాన్ని రాసింది తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞానపీఠ బహుమతి సాధించిన కవిది.
"సంఘానికి శాస్త్రజ్ఞానుల అవసరమే కానీ శాస్త్ర పరిజ్ఞానం కన్నా తరాన్ని రేపటి తరంలోకి నడిపించే మనవతా దృక్పధం గల సంస్కర్తలు ఈ ప్రపంచానికి అవసరం. అందుకే శాస్త్రజ్ఞుడికన్నా అనాధగా ప్రపంచం అండకోసం ప్రాకులాడుతున్న అయిదేళ్ళ బాలుడికన్నా సాంఘిక సమస్యల పద్మ వ్యుహల్ని చేధించగల బిడ్డని మోసే గర్భవతి అయిన స్త్రీని బ్రతికించడం అవసరం."
చిత్రమైన కాంట్రాడిక్షన్ లా అనిపించింది.
చివరది డిఫెన్స్ రిసెర్చికి చెందిన ఓ శాస్త్రజ్ఞుడి అబిప్రాయం.
"చరిత్ర పరిణామ దశ గురించి మనం లోతుగా ఆలోచిస్తే మనిషి మనుగడని శాసించింది శాస్త్రపరిజ్ఞానం. ఒక విషయాన్నీ శోధించి సాధించాలి అంటే ఏ వ్యక్తయినా అపారమైన సాధన ఒక్కటే కాదు తనకి చెందిన చాలా సుఖాల్ని త్యాగం చేయగల ఔన్యత్యము కావాలి. అందుకే అహోరాత్రులు శ్రమించి మనిషికి మరణం లేకుండా ఆపగల ఫార్ములాని కనిపెట్టిన శాస్త్రజ్ఞుడ్ని మనం బ్రతికించుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ మనిషి అణ్వస్త్రాల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఆకలి చావులు వుండవు. అంతేకాదు- అంత శక్తివంతుడైన ఆ శాస్త్రజ్ఞుడు రేపు మనుషుల మనసుల్ని మార్చి ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దగల మరో మార్గాన్ని కనిపెట్టగలడేమోగా?"
