Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 21

 

    రాత్రి తొమ్మిదవుతున్నా గోపాలరావు ఇంటికి రాలేదు.


    "ఏం-వీడింకా రాలేదు. ఎంతసేపు రాకుంటే అంత మంచిది" అంటూ కాంచనమాల టీవీ ముందు కూర్చుంది. ఆమె మనసులో భర్తను వాడూ వీడూ అనే అనుకుంటుంది. ఫ్యాన్ వేసుకోబోయి మళ్ళీ కరెంటు ఛార్జీ పెరగడం గుర్తొచ్చి ఆ పని మానుకుంది.


    ప్రభుత్వమంటే మొగుడిలాగా మన కనీస సుఖాలను హరించేది అని మనసులో కసిగా అనుకుని కూర్చుంది. అప్పుడు వార్తల టైమ్ కాబట్టి ఏదీ ఇంట్రెస్టింగ్ గా అనిపించక టీవీ ఆఫ్ చేసింది.


    మానసకోసం చూసింది. హాల్లోనూ లేదు. ముందు వరండాలోనూ లేదు. ఎక్కడికెళ్ళింది? బాత్ రూమ్ లో దూరి సురేష్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ వుంటుంది కాబోలు.


    మరి మనమిక డిస్ట్రబ్ చేయటం ఎందుకని తన గదిలోకి వచ్చింది. చేతికొచ్చిన మ్యాగజైన్ ఒకటి తీసుకుని చదవడం ప్రారంభించింది.


    భర్త వచ్చేవరకూ అలా ఏదన్నా పుస్తకం చదవడమో, టీవీ చూడడమో ఆమెకి అలవాటు.


    గోపాలరావు ఎప్పుడో తప్ప తొందరగా యింటికి రాడు. అతనికి డబ్బుయావ. అది కూడా అతను కేవలం పెళ్ళాం కోసమే సంపాదిస్తున్నాడు. ఇదివరకయితే ఇలా సంపాదన మీద పిచ్చిలేదు. కాంచనమాలను రెండో పెళ్ళి చేసుకున్నాక డబ్బుపిచ్చి పట్టుకుంది.


    దీనికి కారణముంది. రెండో భార్యని గ్రిప్ లో వుంచుకోవాలంటే, డబ్బు ఒక్కటే మార్గం అనిపించింది. ఇక అప్పట్నుంచీ కష్టపడటం ప్రారంభించాడు.


    అవును-కాంచనమాల గోపాలరావు రెండో భార్య. గోపాలరావుకు ఇరవై రెండేళ్ళు వచ్చేటప్పటికి శ్రీనివాసరావు పెళ్ళిచేశాడు. అప్పటికీ అతను ఇంటర్ పాసై ఆపైన చదవడం ఇష్టం లేక ఇంట్లో వుండిపోయాడు.


    "మరిక చదువూలేదు చట్టుబండలూలేదు - పెళ్ళి చేసుకుని తగలడు" అని శ్రీనివాసరావు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు.


    చివరికి నగరి పక్కనున్న పల్లెటూరిలో సంబంధం కుదిరింది. అమ్మాయి పేరు జయంతి. ఛాయ కాస్తంత తక్కువైన కళగలిగిన ముఖం గోపాల్ కి బాగా నచ్చింది.


    ఆమెతో పెళ్ళయిపోయింది.


    వ్యవసాయం చేసుకుంటూ కొత్తపెళ్ళాంతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ గడిపేస్తున్నాడు.


    అతనికీ, మానసకీ మధ్య పదిహేనేళ్ళు తారతమ్యం వుంది. అప్పటికి అది చిన్నపిల్ల.


    "చిన్నవయసు- ఇప్పుడే పిల్లలొద్దు" అని భార్యాభర్తలు ఇరువురూ నిర్ణయించుకోవటం వల్ల ఆ బాధలు కూడా అతనికి ఏమీ తగల్లేదు.


    మరో అయిదేళ్ళు గడిచాయి. గోపాలరావుకు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి. యిక సంతానం కలిగినా ఫరవాలేదనుకుని కుటుంబనియంత్రణ పద్ధతులన్నిటికీ స్వస్తిచెప్పాడు. కానీ అదేం ఖర్మో జయంతకి నెల తప్పలేదు. రెండేళ్ళు పూర్తికావడంతో ఆందోళన ప్రారంభమైంది.


    గుడులూ గోపురాలూ తిరగటం ప్రారంభించారు. ఏళ్ళు గడుస్తున్నా జయంతి గర్భవతి కాలేదు.


    అప్పుడు మందులూ మాకులూ తినడం ప్రారంభించారు. ఒకరోజు ఏదోపేరు చెప్పుకుంటూ ఓ స్వామి ఆ ఊరొచ్చాడు. పెద్దపార్టీ అని తెలియటంతో ఆయన సరాసరి గోపాలరావు ఇంట్లో దిగాడు.


    భార్యాభర్తలిద్దర్నీ చూశాడు. ఏవేవో దోషాలపేర్లు చెప్పాడు. శాంతులు చేశాడు. వెళుతూ వెళుతూ ఏదో మందు జయంతికిచ్చాడు. పదిహేను రోజులపాటు తానిచ్చిన భస్మాన్ని తేనెలో రంగరించుకుని తినమన్నాడు. ఆమెకు సంతానం తప్పదన్నాడు.


    ఆమె అలాగే తిన్నది. మరి ఆ మందువల్లో లేక సహజంగానే వచ్చిందో తెలియదుగాని ఆమెకు ఏదో తెలియని జబ్బుచేసింది. డాక్టర్లు జబ్బు ఇదీ అని తేల్చేలోపు ఆమె చనిపోయింది.

    భార్య చనిపోవడం అష్టకష్టాలలో ఒకటిగా ఎందుకు చేర్చారో అర్ధమైంది గోపాలరావుకి.


    ఆ విషాదంలోంచి బయటపడడానికి చాలాకాలమే పట్టింది తనకి. భార్యపోయిన ఆరు నెలలనుంచీ పోరుతున్నా రెండోపెళ్ళికి నాలుగేళ్ళ తరువాతగానీ ఒప్పుకోలేదు. తీరా ఒప్పుకున్నాక, కాంచనమాలను పెళ్ళిచూపుల్లో చూశాక కొత్తదిగులు పట్టుకుంది.


    ఆమెకు ఇరవై రెండేళ్ళ వయసు. తనకేమో ముఫ్ఫై ఎనిమిది. పదిహేనేళ్ళ వయసు డిఫరెన్స్.


    అదీగాక పొలంలో ఏపుగా పెరిగిన జొన్నమొక్కలా వున్న ఆమెను తన కంట్రోల్లో వుంచుకోగలనా అన్న సమస్య పట్టుకుంది. అయితే అంత వయసువల్ల, గడించిన అనుభవం చూపిన జీవితంవల్ల ఏదోవిధంగా మేనేజ్ చెయ్యొచ్చులే అని తనకుతనే సర్దిచెప్పుకున్నాడు. స్నేహితులు, బంధువులు చేసుకోమని ఒత్తిడి చేశారు.


    మొదట అతను వేసుకున్న ప్లాన్ ఇద్దర్నో, ముగ్గుర్నో పిల్లల్ని కనడం. పిల్లలు పుట్టుకొచ్చేకొద్దీ అమ్మాయిలో మిగిలిన అనుభూతులు చచ్చిపోతాయనీ, లేని వయసు మీద పడుతుందని తెలుసు. అందుకే మొదటి పెళ్ళాం దగ్గర మొదట్లో పాటించినట్లు కుటుంబనియంత్రణ పద్ధతులేమీ పాటించలేదు.


    సంవత్సరం తిరక్కమునుపే కాంచనమాల నెలతప్పింది. తను అనుకున్నట్టే జరగడం- ఇంత కాలానికి తండ్రి కాబోతున్న ఆనందం రెండూ అతన్ని ఊపేశాయి.


    కాంచనమాల ఆడపిల్లను కన్నది.


    ఆడపిల్ల కావడం కొంత నిరుత్సాహం కలిగించినా అదీ ఒకందుకు మంచిదనుకున్నాడు. మగపిల్లాడు పుట్టేవరకు పిల్లల్ని కంటూనే వుండచ్చు.


    కానీ అతని అంచనా తప్పయింది.


    "ఇక చాలు- ఆపరేషన్ చేయించుకుంటాను" అంది.


    అతనూహించలేదు. షాక్ కొట్టినట్టు గిలగిల్లాడాడు.


    "ఒక్కబిడ్డకే!" తేరుకున్నాక అన్నాడు.


    "ఏం ఒక్కబిడ్డ చాలదా-దేశ జనాభా ఎంతనుకున్నారు? తొంభై దాటింది. ఎక్కడపడ్డా క్యూలు. మన దేశమంటే మనకే అసహ్యం కలగడంలేదూ? అందువల్లే వద్దు."


    తను ఊహించినదానికంటేనూ - తనకు తెలిసిందానికంటేనూ ఆమె తెలివయినదన్న విషయం అర్ధమైంది. మరో మాట మాట్లాడటానికి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. "మగపిల్లాడైతే...." అంటూ గొణిగాడు.


    "ఏం ఆడపిల్ల బిడ్డగాదూ- అలా అనుకుంటూ మగపిల్లల్నే కంటే నిన్ను కనడానికి మీ అమ్మ వుండివుండదు. నిన్ను చేసుకోవడానికి నేనూ ఉండను. మితిమీరిన అహంభావం వున్నవాళ్ళే మగపిల్లాడికోసం పిల్లల్ని కంటూ వుంటారని నా నమ్మకం."


    తలతిరిగింది అతనికి. ఏమీ మాట్లాడలేకపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS