"ఏమైంది?" శంకరం అడిగాడు.
"నాకంటే మా చెల్లెలు పదేళ్ళు చిన్నది. చెల్లెలికి పదిహేను ఏళ్ళు వచ్చేసరికి అమ్మ చెల్లెలి పెళ్లిని గురించి బెంగపెట్టుకుంది. కట్నాలు ఇచ్చి పెద్ద ఉద్యోగస్తున్ని తేలేం కనక, కొంచెం తెలివైన పిల్లవాణ్ణి తెచ్చి పెళ్ళిచేసి, అతని చదువుకి నేనే సహాయం చెయ్యాలనుకున్నాను. పెళ్ళికొడుకుకోసం తిరుగుతూ ఉండగానే ఒక రోజు అమ్మకి పక్షవాతం వచ్చి మంచాన పడింది. సరే, దానితో నా ఊహలన్నీ తలకిందులైనాయి. అస్తమానం 'కాంప్'లు ఉండే ఆఫీసు ఉద్యోగం మానెయ్యమంది అమ్మ. నేను కాంప్ కి వెళ్ళితే ఇంట్లో అమ్మ, చెల్లెలు ఇద్దరూ ఒంటరిగా ఉండటానికి భయపడే వాళ్ళు. నేను ఆఫీసులో పని మానేసి హైస్కూలులో లోయర్ గ్రేడ్ టీచరుగా చేరాను. మా చెల్లెలికి పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళి చెయ్యగలిగాను. పెళ్ళికొడుక్కి ఇరవై రెండేళ్ళు. అతను ఎస్. ఎస్. ఎల్. సి. పాసై మిడిల్ స్కూలులో టీచరుగా ఉండేవాడు. అతన్ని ప్రోత్సహించి, పరీక్షకి ఫీజు కట్టి, ఇంటరు పరీక్ష వ్రాయించాను. తరవాత నేనూ, మా బావమరిదీ ఇద్దరం చదివి ఒక్కసారే బి. ఎ. కట్టి పాసయ్యాం. తరవాత ఇద్దరికీ హైస్కూలులో సెలవు దొరికింది. బి. ఇడి. ట్రైనింగ్ చదివాం. టీచర్లుగా స్థిరపడ్డాం. ఇదీ మా కథ"
"మరి, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు, మాస్టారూ?"
"నేను పెళ్ళి చేసుకున్నానని ఎవరు చెప్పారు? నేను పెళ్ళి చేసుకోలేదు. నాకు మా కుటుంబ బాధ్యతలు తీరేసరికి ముఫ్ఫై ఏళ్ళు దాటిపోయాయి. అమ్మ చనిపోయింది. పిల్లని చూసేవాళ్ళూ లేరు. అంత పెద్దవాడికి పిల్లని ఎవరిస్తారు?"
"అదేమిటి, మాస్టారూ! మీరు పెళ్ళిచేసుకుని ఉండవలసింది," మాస్టారి కథ విని. ఆయనమీద కలిగిన జాలితో, పెరిగిన గౌరవంతో అన్నాడు శంకరం.
"నాకు పెళ్లెందుకోయ్? ఇప్పుడు నా కేమిటి తక్కువ? హాయిగా గడిచిపోతూంది జీవితం."
తలుపు వెనకనించి వీళ్ళిద్దరి మాటలూ వింటున్న భానుమతి ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళూ మాస్టారికి పెళ్ళి అయిందనీ భార్య పిల్లలు వేరేచోట ఉండి ఉంటారనీ ఊహించారు అంతా, మాస్టారి కథ విన్నాక భానుమతికికూడా ఆయనమీద గౌరవం ఇనుమడించింది.
సాయంత్రం చారుమతి ఇంటికి వస్తూనే చిరాగ్గా వచ్చింది. స్కూలులో పని ఏదో సమంగా చెయ్యలేదని హెడ్ మిస్ట్రెస్ సన్నగా చీవాట్లువేశారు. 'ఛీ, ఛీ, వెధవ జీవితం' అని విసుక్కుంది తనమీద తనే. చికాకుగా ఉన్న ఇంటి పరిస్థితులతో విసుగెత్తిన చారుమతికి స్కూల్లో పనికూడా విసుగ్గా ఉంటూంది. చీటికీ మాటికీ పిల్లల్ని కేకలేస్తుంది; కసురుకుంటుంది. ఉదయం లేవగానే ప్రైవేట్లు. తరవాత స్కూలు. మళ్ళీ సాయంత్రం పైవేట్లు. 'ఈ జీవితానికి అంతం ఎక్కడ?' అనుకుంది తల పట్టుకొని.
'పేదవాళ్ళుగా బ్రతికేంకంటే చాపటం మేలనిపిస్తుంది. ఇంత కష్టపడినా ఏమాత్రం సుఖం లేదు. వయస్సులో తీరవలసిన కోరికలు ఎలాగా లేవు. కనీసం విసుగ్గా ఉన్నప్పుడు ఒక సినిమాకో, గానసభకో వెళదామన్నా, ఆ ఆశకూడా లేదు. డబ్బులు లేక అన్ని ఆశలు చంపు కోవాలి.' చారుమతికి ఎవరిని చూసినా కోపం, ఏది చూసినా విసుగు కలుగుతూంది. రోజు రెండుపూటలా కడుపునిండా తిండి, కట్టుకోను బట్ట, కనీసం చిన్న చిన్న కోరికలు, సరదాలు తీర్చుకొనే అవకాశం ఉంటే ప్రతి మనిషి సరదాగానే, మంచిగానే ఉంటాడు. ఎదటిమనిషితో స్నేహం చేస్తాడు. పక్కమనిషిని ప్రేమిస్తాడు. అందరితోను హాయిగా, సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతాడు. మన జీవితం మనం కోరుకున్నవిధంగా నడిచిపోతూఉంటే లోకమంతా అందంగా ఇంద్రధనుస్సు రంగులతో కనబడుతుంది. జీవితమంతా చీకటిగా, ఎదురుదెబ్బలు తింటూ గడిపే వాళ్ళకి లోకంకూడా వికారంగానే కనిపిస్తుంది.
చిరాగ్గా వచ్చిన చారుమతిని చూస్తూనే శాంతమ్మ అడిగింది: "ఏమయిందే, అలా ఉన్నావు?"
"ఏదో ఒకటి. నా తల పగిలిపోతూంది. విపరీత మైన తలనొప్పి." చారుమతి తల పట్టుకుంటూ వెళ్ళి చాప పరుచుకుని పడుకుంది.
భానుమతి మంచినీళ్ళలో పంచదార వేసి గ్లాసుతో తీసుకువచ్చింది. అది చూస్తూనే చారుమతి ఇంత ఎత్తున లేచింది.
"ఎన్నిసార్లు చెప్పాను నాకు స్కూలునించి రాగానే గుక్కెడు కాఫీ పొయ్యమని, లేకపోతే నా ప్రాణం నిలవ దనీను? అన్నం లేకపోయినా ఫరవాలేదు. కాఫీ లేకపోతే బ్రతకలేనని చెబితే ఒకళ్ళూ వినిపించుకోరేం? నాకేం అక్కరలేదు. తీసుకువెళ్ళు" అంటూ ధన్ మంటూ విసురుగా గ్లాసు పెట్టి పక్కకి తిరిగి పడుకుంది.
నెలాఖరు రోజులలో కాఫీపొడి, పంచదార లాంటివి అయిపోవడం మామూలే.
గుమ్మం దగ్గిరే నుంచున్న శాంతమ్మ నొచ్చుకుంది.
"భానూ, శంకరాన్ని పంపి హోటల్ నించి కొంచెం కాఫీ తెప్పించమ్మా" అంది.
కాని భానుమతి అక్కడే తచ్చాడుతూంది.
"ఏమిటి కావాలి?" శాంతమ్మే అడిగింది.
"అమృతాంజనం కోసం చూస్తున్నాను, చారుకి రాయవచ్చని."
"అమృతాంజనం ఎప్పుడో అయిపోయిందమ్మా. మామ్మకి రాయడానికికూడా లేదు. శంకరం చేత అదికూడా తెప్పించు." శాంతమ్మ మెల్లిగా చెప్పింది.
"శంకరం ఇంట్లో లేడు. బయటికి వెళ్ళాడు" అంది భానుమతి.
అన్ని మాటలూ వినిపిస్తున్నా, చారుమతి మాట్లాడకుండా పడుకుంది. ఆ మౌనం తుఫానుముందు ప్రశాంతతలా ఉంది.
ప్రైవేట్లకోసం వచ్చిన పిల్లల్ని ఇళ్ళకి పంపేసింది భానుమతి.
చారుమతి విసుగ్గా తలనొప్పి అంటూ ఇంటికి రావడం, ఏమాత్రం తేడా వచ్చినా, ఇంట్లో అందరి మీదా కసురుకోవడం ఇంట్లోవాళ్ళకి అలవాటే. కాని ఈ రోజు మౌనంగా పడుకున్న చారుమతిని చూస్తే ఇంకా భయం వేసింది.
"అక్క అలా పడుకుందేం?" అంటూ వచ్చింది మాలతి. మాలతి పొద్దున్న ఎనిమిది గంటలకి టైపు నేర్చుకోవడానికి వెళుతుంది. సాయంత్రం అయిదు గంటలకి హిందీ నేర్చుకోవడానికి వెళ్ళి ఏడు గంటలకి తిరిగి వస్తుంది.
మాలతి ప్రశ్నకు, 'నువ్వు ఊరుకో' అన్నట్టు సంజ్ఞ చేసింది భానుమతి. మాలతి స్వభావం విషయంలో భానుమతి పోలిక. చాలా నెమ్మది.
వంట కాగానే భోజనానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా రాలేదు చారుమతి. అలాగే కదలకుండా పడుకుంది. ముసలమ్మకి అన్నం తినిపించి, శాంతమ్మ వంటఇంటి గుమ్మంలో కూర్చుంది. చారుమతి కోపం అంతా శంకరం మీద అని గ్రహించింది భానుమతి. 'వాడు రాగానే ఇంట్లో ఏం అల్లరి జరుగుతుందో?' అనుకుంటూ ఆందోళనతో కూర్చుంది భానుమతి. మాలతి మాస్టారిదగ్గిరనించి తెచ్చుకున్న పత్రికలు చదువు కుంటూంది.
తొమ్మిది గంటలకి శంకరం వచ్చాడు. బట్టలు మార్చుకొని, "అమ్మా, అన్నం పెడతావా?" అంటూ వంటింట్లోకి వెళ్ళాడు.
"మాలతీ! నువ్వూ, అక్కయ్యలూ కూడా భోజనానికి రండి. వడ్డించేస్తాను" అని కేకేసింది శాంతమ్మ.
"అక్కా, భోజనానికి రా" అంటూ చారుమతిని లేపింది మాలతి.
"నేను రాను, మీరు తినండి" అంది చారుమతి, అటు తిరిగి పడుకునే.
"లే, చారూ పొద్దున్ననగా తిన్నావు. ఆకలేస్తూ ఉంటుంది. నువ్వు తినకపోతే మే మెవ్వరం తినం" అంటూ లాలింపుగా చెప్పింది భానుమతి.
చారుమతి ఏమనుకుందో, లేచి వంటింట్లోకి వచ్చింది. అప్పటికే శంకరం భోజనానికి ఉపక్రమించాడు. చారుమతి కంచంముందు కూర్చుంటూ శంకరాన్ని చూసి అడిగింది :
"మహారాజుగారు ఎక్కడ తిరుగుతున్నారేమిటి?"
శంకరం ఒకసారి తలఎత్తి చూసి, మళ్ళీ వంచేసు కున్నాడు.
"చేసే పని ఎలాగా లేదు. ఇంట్లో కావలసిన వస్తువు లేనా తేకూడదా? అవసరం వచ్చినప్పుడు ఎప్పుడూ కనిపించవు. సాయంత్రం గుక్కెడు కాఫీనీళ్ళు లేక విలవిల లాడాను. పోనీ, కొంచెం హోటల్ కి వెళ్ళి కాఫీ తెచ్చావా? అసలు ఇంట్లో ఉండి ఏడిస్తే గా! ఊరుమీద బలాదూరు తిరగడానికి వెళతారు అబ్బాయిగారు."
"ఎందుకే, చారూ, ఇప్పుడా మాటలన్నీ. భోజనలయ్యాక మాట్లాడుకోవచ్చును." తల్లి కూతుర్ని శాంతపరచాలని అంది.
చారుమతి మరీ రెచ్చిపోయింది. "చూడు, ఇన్ని అన్నా ఒక్క మాట అంటాడేమో! తనకేం? పూలరంగడిలా భోజనంచేసి షికార్లు కొడతాడు. ఎంతమందికి ఉద్యోగాలు దొరకటంలేదు? తెలిసినవాళ్ళందరి దగ్గిరికి వెళితే ఎవరేనా సహాయం చెయ్యకపోరు. వీడు వెళతాడా? అబ్బాయిగారికి నామోషీ. తనంటే చిన్నది చెల్లెలు సంపాదిస్తూఉంటే తినడానికి సిగ్గు లేదు. ఇంట్లో కష్టసుఖాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఉదయం లేచినదగ్గిరనించి ఇంట్లో భానక్కా, బయట నేనూ కష్టపడుతున్నామే. ఏమైనా జాలి ఉందా? సహాయం చెయ్యాలనే తలపు ఉందా?"
చారుమతి వాగ్దోరణి సాగుతూనే ఉంది.
"వాణ్ణి అన్నం తిననియ్యవేమిటి?" అని శాంతమ్మా, శాంతపరుస్తూ భానుమతీ ఎంత ఆపాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు.
శంకరం గబగబా అన్నం తిని, మౌనంగా వెళ్ళిపోయాడు. చారుమతికూడా సగం భోజనంచేసి కంచంలో చేతులు కడిగేసుకుని లేచిపోయింది.
"నీ కోసం భోజనం మీద చూపిస్తే ఎలాగే! అర్ధాకలితో లేచిపోకు" అంటూ శాంతమ్మ వెనకనించి చెపుతున్నా, "నా మనస్సు బాగుండలేదు" అంటూ వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయింది.
భానుమతి, మాలతి, శాంతమ్మ బొమ్మల్లా కూర్చుండిపోయారు. భానుమతే అంది చివరికి:
"చారుకి ఒంట్లో బలం లేదమ్మా రోజూ సాయంత్రం రాగానే నీరసం అంటుంది. పనికి తగ్గ బలమైన ఆహారం లేదు. మనిషి చూశావా ఆర్చుకు పోతూంది. నీరసం మీద కోపం ఎక్కువయింది."
"రేపటినించీ ప్రైవేట్లు నేను చెబుతానమ్మా. ఇన్నాళ్ళూ నాకు తోచనేలేదు. అక్కకి కాస్త విశ్రాంతిగా ఉంటుంది" అంది మాలతి.
శాంతమ్మ కొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది.
