గుమ్మందగ్గిర నుంచున్న పద్మని చూస్తూ, "నువ్వూ బస్సుస్టాండుదాకా వస్తావా, అమ్మా" అంది.
పద్మకి ఏం చెయ్యాలో తెలియక అత్తగారి వైపు చూసింది.
"పద్మ ఎందుకు లెండి? అబ్బాయి మిమ్మల్ని బస్సు ఎక్కించి, అటే ఆఫీసుకు వెళతాడు. పద్మకు ఊరు కొత్త. తిరిగి ఒంటరిగా రాలేదు" అంది కాంతమ్మ.
పద్మ అలాగే నిలబడిపోయింది. తల్లి, తండ్రి వెళ్ళిపోయారు.
బస్సు కదిలాకకూడా వరలక్ష్మి ఏడుస్తూనే ఉంది.
"ఎంతసేపు ఏడుస్తావు? ఆడపిల్ల అన్నాక ఇంకో అయ్య చేతిలో పెట్టకా తప్పదు, అత్తవారింట్లో వదలకా తప్పదు" అన్నాడు నారాయణరావు.
"ఆవిడ తత్త్వమేమిటో అర్ధం కావటంలేదు నాకు. శోభనం మాట ఎత్తనేలేదు. ఏదో ఆ అడ్డు తీరిపోతే అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండవచ్చును కదా" అంది కళ్ళు తుడుచుకుంటూ.
"ఈ రోజులలోకూడా ముహూర్తాలు, శోభనాలు ఏమిటి? ఎదిగిన పిల్లలు సిగ్గుపడతారు. ఇప్పుడింక ఒంటరిగానే ఉన్నారుగా. వాళ్ళే ఆ విషయం చూసుకుంటారు" అన్నాడు ఆయన.
భార్యలా కుంగిపోకపోయినా అతనికికూడా మనస్సులో దిగులుగానే ఉంది.
16
కాకినాడ వదలి వెళ్ళిన నెల్లాళ్ళకి శ్రీదేవి చారుమతికి ఉత్తరం రాసింది.
"ప్రియమైన చారుమతికి,
ఉత్తరం రాయలేదని తిట్టుకుంటున్నావా? క్షమించు. ఇంత ఆలస్యంగా నే నెందుకు ఉత్తరం రాస్తున్నానో నీకూ పెళ్ళయి, భర్తతో హనీమూన్ కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మేము బెంగుళూరు, మైసూరు చూసి వారం రోజులకిందటే హైదరాబాద్ వచ్చాం. బెంగుళూరులో మైసూరులో అన్ని చూశాం. 'చూశాం! చూడలేదు!' ఏం రాయాలో తెలియటంలేదు. బృందావన్ గార్డెన్స్ లో బావపక్కనే నడుస్తూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టుంది. నీకూ తొందరలో పెళ్ళి కావాలని ఆశిస్తున్నాను, చారూ! పెళ్ళిలో ఉండే ఆనందం, పెళ్ళి అయిన తరవాతనే తెలుస్తుంది. ఈ నెలరోజులు ఇంత ఆనందం, సంతోషం అనుభించాక నాకు అనిపించింది, 'ఈ జీవితానికి ఈ అనుభవం చాలు. ఇక చచ్చిపోయినా ఫరవాలేదు' అని. గంటలు క్షణాల లాగా, రోజులు గంటలుగా గడిచిపోయాయి. బావ నా చెయ్యి పట్టుకుని అన్ని చూపిస్తున్నప్పుడు లోకాలు జయించిన మహారాణిలా సంతోషంగా ఉండేదాన్ని.
ఎన్నో రాయాలని ఉంది. నీకు ఎలా రాయడం? ననీకుకూడా పెళ్ళి అయితే మనం అన్ని విషయాలు స్వేచ్చగా రాసుకోవచ్చును.
ఈ ఉత్తరం ఇంతటితో ఆపుచేస్తున్నాను. కొత్త కాపరమా? ఇల్లు సర్దుకోవడంలో మునిగి పోయాను. హైదరాబాద్ విశేషాలన్నీ వేరే రాస్తాను.
పద్మ ఎక్కడ ఉంది? మద్రాసు వెళ్ళిందా? పద్మ ఎడ్రసు వ్రాయి. ఉత్తరం రాస్తాను.
ఇంట్లో అందరు బాగున్నారని తలుస్తాను. మాలతి పరీక్ష తెలిసిందా?
భానక్కకి, అమ్మకి, మామ్మకి నమస్కారాలు. మాలతిని, అన్నని అడిగినానని చెప్పు. జవాబు రాయి.
ప్రేమతో,
-దేవి."
చారుమతి ఉత్తరం రెండుమూడు సార్లు చదువు కుంది. ప్రతి వాక్యంలోను శ్రీదేవి మానసికానందం వెల్లడి అవుతూంది. 'వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం' అనుకుంది చారుమతి.
'నా కెప్పటికైనా ఇలాంటి భర్త ప్రేమ, దాంపత్య సౌఖ్యం లభిస్తవా? శ్రీదేవి 'నీకు పెళ్ళి అయితే' అని రాస్తుంది. నన్ను ఎవరు చేసుకుంటారు? పెళ్ళి కొడుకుని చూసిపెట్టే తండ్రిలేడు. వరుడుని ఎవరేనా చూపించినా, కొనుక్కోడానికి, పెళ్ళిఖర్చుకి డబ్బు లేదు.' చారుమతిలో ఏదో నిరాశ ఆవరించింది. మళ్ళీ నిరాశమధ్యే ఆశ! డాక్టర్ గిరిధారినిగురించిన ఊహలు!
చారుమతి సాయంత్రం పద్మ ఇంటికి వెళ్ళింది. వరలక్ష్మి ముందువరండాలో స్తంభానికి చేరబడి కూర్చుంది. నారాయణరావు ఆమె కెదురుగా పడకకుర్చీలో పడుకున్నాడు.
"చీకటిలో కూర్చున్నారేమిటండీ?" అంటూ వచ్చింది చారుమతి.
"ఎవరూ? చారుమతా? రామ్మా, రా" అంటూ లోపలికి పిలిచి, వరండాలో లైటు వేసి, చాప తెచ్చి వేసింది వరలక్ష్మి.
"శ్రీదేవి ఉత్తరం రాసింది, పద్మ ఎడ్రసు కావాలంటూ పద్మ ఎడ్రసు ఇస్తారా?" అంది చాపమీద కూర్చుంటూ చారుమతి.
"పద్మ ఎడ్రసు తప్పక ఇస్తాను. శ్రీదేవి బాగుందా? ఏమిటి రాసింది ఉత్తరంలో?"
"శ్రీదేవి బాగుందిట. ఈమధ్యే బెంగుళూరు, మైసూరు తిరిగివచ్చి హైదరాబాద్ లో కాపరం పెట్టారుట. పద్మ ఎలా ఉందండీ? ఉత్తరాలు రాస్తూందా? నాకు ఒక్క ఉత్తరం రాయలేదు" అంది చారుమతి.
"ఏం బాగోనమ్మా! పద్మ మాకే సమంగా ఉత్తరాలు రాయదు. మళ్ళీ బి.ఎ. లో చేరిందిట. ఈ చదువేమిటో, ఏం గొడవో తెలియటంలేదు" అంది వరలక్ష్మి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.
"ఎందుకు అస్తమానం ఏడుస్తావు? మాట్లాడితే ఆడవాళ్ళకి కళ్ళనీళ్ళు వస్తాయి" అన్నాడు నారాయణ రావు.
"ఆడపిల్లని కన్నందుకు ఏడుపేనండీ! బంగారం లాంటి పిల్లని అపురూపంగా పెంచుకుని, పెళ్ళి చేస్తే, అది సుఖపడకపోతే కష్టం కాదా? చారుమతీ, నువ్వే చెప్పమ్మా."
చారుమతి వరలక్ష్మి వైపే సానుభూతిగా చూస్తూ, మౌనంగా కూర్చుంది.
"ఎలా ఉందమ్మా మీ స్కూలు? శంకరానికి ఏమైనా ఉద్యోగం దొరికిందా?" అంటూ ప్రసంగాన్ని మార్చాడు నారాయణరావు.
"శంకరానికి ఉద్యోగం ఏమీ దొరకలేదండీ! ఉద్యోగ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఎక్కడేనా దొరికితే బాగుండును."
"ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉందమ్మా. ఎమ్. ఎ, బి. ఎ. చదివినవాడికంటే కూలివాడు నయం. వాడికి తొందరగా పని దొరుకుతుంది."
చారుమతి కాస్సేపు మాట్లాడి, పద్మ ఎడ్రసు తీసుకుని లేచింది.
"పద్మ ఉత్తరం రాయకపోయినా, నువ్వు రాస్తూ ఉండమ్మా స్నేహితురాళ్ళ దగ్గిరనించి ఉత్తరం వస్తే దానికి కొంచెం ఊరటగా ఉంటుంది" అంది వరలక్ష్మి
"అలాగేనండీ" అంటూ వాళ్ళిద్దరికీ నమస్కరించి ఇంటిముఖం పట్టింది చారుమతి.
17
పద్మ మద్రాసు వచ్చి రెండు నెలలు దాటిపోయింది. పద్మ జీవితంలో మార్పేమీ లేదు. పొద్దున్నే లేచి అత్తగారికి వంటలో సాయంచేసి, తొమ్మిది గంటలకి భోజనం చేసి కాలేజీకి వెళుతుంది. సాయంత్రం ఆరుగంటలకి ఇల్లు చేరుతుంది. రాత్రి వంట పద్మ మీదే పడింది. ఎనిమిది గంటలకి మాధవరావు వస్తాడు. అతనికి దగ్గిర కూర్చుని అత్తగారే భోజనం పెడుతుంది. తరవాత పద్మ, అత్తగారు కూర్చుని భోజనంచేస్తారు.
మాధవరావు పద్మతో ముభావంగా ఉంటాడు. పద్మ అనే మనిషి ఇంట్లో ఉన్నట్టే తెలియనట్టు ప్రవర్తిస్తాడు. తల్లితోనే మాట్లాడుతాడు, అత్తగారే పద్మతో మాట్లాడుతుంది. అదికూడా వంటలను గురించే. "ఇంత పెద్దదానివి, నీకు వంట చేతకాకపోవడమేమిటి? మీ అమ్మ ఎందుకు నేర్పలేదు? ఇక్కడ అరవవాళ్ళ పిల్లలు పనిలో ఎంతో నేర్పరులు, పదేళ్ళ పిల్ల కూడా కమ్మటి సాంబారు పెట్టి, భోజనం పెట్టగలదు." ఆవిడ సంభాషణ ఈ ధోరణిలోనే నడుస్తుంది. ప్రతి పనికి అరవ పిల్లల్ని మెచ్చుకుని, కోడల్ని కించపరుస్తూ ఉంటుంది.
'ఇంటికంటే కాలేజీయే నయం' అనుకుంటుంది పద్మ. కాలేజీలో కూడా ముభావంగా ఉండే పద్మకి పరిచయస్థులు చాలా తక్కువ. 'ఇంత అందమైన పిల్ల అంత విచారంగా కనిపిస్తుందేం?' అనుకుంటారు క్లాసు పిల్లలు.
ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి పద్మ పుస్తకాలు ముందర వేసుకుని తన గదిలో కూర్చుంది.
ఆ ఇంటికి మూడు గదులు. ఒకటి పెద్దహాలు లాంటి గది. దాన్ని ఆనుకుని రెండు చిన్న గదులు. ఒక గది మాధవరావుది. ఒక గది పద్మది. అత్తగారు హాలులోనే కూర్చుంటుంది. అక్కడే రాత్రి ముగ్గురు మంచాలు వేసుకుని పడుకుంటారు. మధ్యన అత్తగారు, చెరోపక్కన కొడుకు, కోడలూను. అలా పడుకోడానికి కొత్తలో ఎంతో సంకోచంగా ఉండేది పద్మకి. కాని రానురాను అలవాటైపోయింది.
పుస్తకాలు ముందర వేసుకుని కూర్చున్నా మనస్సు పాఠాల మీద నిలవడంలేదు.
"అమ్మాయ్, అన్నట్టు నీ కో ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం" అంటూ ఒక కవరు తెచ్చి ఇచ్చింది పద్మకి కాంతమ్మ.
పద్మ కవరు విప్పి చూస్తూ ఉంటే, "ఎవరు రాశారు?" అంది అక్కడే నుంచున్న కాంతమ్మ.
"శ్రీదేవి. మా స్నేహితురాలు" అని పద్మ ఉత్తరం చదువుకోవడం మొదలుపెట్టింది. కాంతమ్మ అక్కడి నించి వెళ్ళిపోయింది.
"ప్రియ పద్మకు,
ఎలా ఉన్నావ్, పద్మా? మీ శ్రీవారి ఒళ్ళో పడుకుని నా ఉత్తరం చదువుతున్నావా? తనే ఉత్తరం చదువుతా నంటూ నీ చేతులలోనించి ఉత్తరం ఆయన లాగేసుకుంటున్నారా? నీ మృదువైన చేతులు జ్ఞాపకం వస్తున్నాయి. వాటితో ఒక దెబ్బ వేసినా ఆయనకు దెబ్బే తగలదు!
నీకు ఉత్తరం రాస్తూంటే నాకు నువ్వు, మీ శ్రీవారు జ్ఞాపకం వస్తున్నారు. నీలాంటి అందగత్తెను భార్యగా పొందటం ఆయన అదృష్టం. మీ ఇద్దర్ని మీ పెళ్ళిలో చూసి, మేం ఏమనుకున్నామో తెలుసా? ఈడు, జోడు -రతీమన్మథుల్లా ఉన్నారనుకున్నాము.
అబ్బ! బావ నన్ను ఉత్తరం రాయనివ్వడంలేదు. నా చేతిలోనించి పెన్ను లాగేసుకుని, దీపం ఆర్పేస్తారుట. 'నువ్వు ఎలా ఉత్తరం రాస్తావో చూస్తాగా?' అని అల్లరిపెడుతున్నారు.
మద్రాసు జీవితం ఎలా ఉందో రాయి. మీవారిని గురించి, అత్తగారిని గురించి అన్ని విషయాలు రాస్తావు కదూ. నాకు హైదరాబాద్ చాలా నచ్చింది. ఈ మధ్యే సాలార్ జంగ్ మ్యూజియం చూసివచ్చాం. ప్రతి ఆదివారం పబ్లిక్ గార్డెన్స్ కు వెళుతూ ఉంటాం.
పద్మా, నువ్వు వంట నేర్చుకున్నావా? నీకేం! దగ్గిర అత్తగారు ఉన్నారు. అన్ని సలహాలూ చెబుతారు. నాకు బలే కష్టంగా ఉందనుకో. 'బియ్యంతోకూడా ఎన ఎక్స్పెరిమెంట్లు చెయ్యవచ్చునో, నువ్వు వంట మొదలు పెట్టాకే తెలిసింది. రోజుకో రకంగా, పూట కో విధంగా అన్ని వండటం నీకే తెలుసు' అంటూ బావ ఎగతాళి చేస్తూ ఉంటారు.
పెద్ద ఉత్తరం రాస్తావుగా! నేను మా సంసార విషయాలన్నీ రాస్తాను. మీ శ్రీవారిని అడిగానని చెప్పు. అత్తగారికి నమస్కారములు.
ప్రేమతో
-శ్రీదేవి."
ఉత్తరం చదవడం పూర్తిచేసి, బల్లమీదే తల పెట్టుకుని పడుకుంది పద్మ. ఆపుకుందామన్నా కళ్ళనీళ్ళు ఆగటం లేదు. 'మా శ్రీవారు నాతో అసలు మాట్లాడరు. ఇంక నా చేతుల అందం చూడటం ఏమిటి? ఏం రాయమన్నావు, శ్రీదేవీ? నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలో లేదని రాయనా?'
మధ్య హాలులో లైటార్పేసి అత్తగారు, భర్త పడుకుని కబుర్లు చెప్పుకోడం వినిపిస్తూంది. 'తల్లితో మాట్లాడడానికి అన్ని మాటలు ఉన్నప్పుడు, భార్యని చూడగానే మూగితనం వస్తుందేం?' అనుకుంది పద్మ, మాధవరావు మీది కోపంతో.
18
సెప్టెంబరు మాసం. ఒకటే వర్షాలు. ఆ రోజు తెల్లవారుతూనే మొదలైన వర్షం ఉదయం తొమ్మిది గంటలైనా తగ్గు ముఖం పట్టలేదు. చారుమతి స్నానంచేసి వచ్చి, స్కూలుకు వెళ్ళటంకోసం జడ వేసుకుంటూంది. ఇంట్లో అంతా లేచి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ముసలమ్మ నులకమంచంమీద ఒక మూల బొంత కప్పుకుని పడుకుంది. రెండో వైపు చాపమీద శంకరం నిండా దుప్పటీ ముసుగు పెట్టి ఇంకా నిద్రపోతున్నాడు. 'ఎంత అదృష్టవంతుడు! పొద్దున్న లేచి బయటికి పరిగెత్తవలసిన పనిలేదు. నిశ్చింతగా పడుకున్నాడు' అనుకుంది చారుమతి, అసూయతో. శంకరం ఉద్యోగ ప్రయత్నాలు ఏమి కలిసి రాలేదు. అర్హతలు సరిపోతాయని తోచిన ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తులు పెడుతున్నాడు. కొడుక్కి ఉద్యోగ మైతే, నేతిదీపం పెట్టి వెంకటరమణమూర్తికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంది శాంతమ్మ 'కూతురికి పెళ్ళి అయితే కొబ్బరికాయ కొడతానని మొక్కుకోకూడదా? భానక్కకి పాతికేళ్ళు వచ్చి ఇంట్లోనే ఉండిపోయింది' అనుకుంది చారుమతి.
