చారుమతిని ఏదో దిగులు ఆవరించింది. కాని దేవి ఏడుస్తూ వెళ్ళకూడదు.
"దేవీ, అన్నీ బాగున్నాయిగాని, మీ ఆయన పేరే బాగులేదు" అంది చారుమతి రహస్యంగా. పద్మ నవ్వింది.
"ఆ పేరు నేను పెట్టలేదుగా" అంది శ్రీదేవి నీళ్ళతో నిండిన కళ్ళతో నవ్వుతూ.
ముగ్గురూ ఏడుస్తూకూడా ఎందుకు నవ్వుతున్నారో అర్ధంకాక ఆశ్చర్యంగా నిలబడిపోయాడు హనుమంతరావు.
శ్రీదేవితోకూడా పెద్దక్క ప్రభావతి గృహప్రవేశానికి వెళ్ళింది.
"మరిచిపోకుండా ఉత్తరాలు రాయి" అంటున్న చారుమతి, పద్మల గొంతులు బస్సు ఇంజను చప్పుడులో కలిసిపోయాయి. శ్రీదేవి భర్తపక్కనే కూర్చుని చేయి ఊపింది.
బస్సు కనిపించేవరకూ ఆడపెళ్ళివారు వీథిలోనే నుంచుని తరవాత లోపలికి బయలుదేరారు.
"మేం వెళతామండీ" అన్నారు పద్మా, చారుమతీ లక్ష్మీదేవితో.
"అప్పుడేనా కొంచెం కూర్చోకూడదూ? అన్నట్టు శ్రీదేవి భర్త మీతో ఎలా మాట్లాడాడు? సిగ్గు పడ్డాడా?"
"సిగ్గేం పడలేదే! ఎందుకలా అడుగుతున్నారు?" చారుమతి కుతూహలంగా అడిగింది.
"అతన్ని బలవంతంమీద మీరు ముగ్గురు కూర్చున్న గదిలోకి పంపించాం. కొత్త పెళ్ళికొడకు గదా, అందరి ముందు శ్రీదేవితో మాట్లాడడానికి ఇంకా సిగ్గుపడుతున్నాడు."
చారుమతీ, పద్మా నవ్వుకుంటూ ఆమెదగ్గిర సెలవు తీసుకుని ఇళ్ళకు బయలుదేరారు. ఇద్దరు విడిపోయేదాకా శ్రీదేవిని గురించే మాట్లాడుకున్నారు. సరదాగా ఉండే భర్త దొరకడం శ్రీదేవి అదృష్టం అనుకున్నారు.
'ఇవాళ జూన్ రెండో తారీఖు. ఈ రోజుతో తమ ముగ్గురి జీవితాలలోను కొత్త అధ్యాయాలు మొదలవుతాయి. శ్రీదేవి కాపరానికి వెళ్ళింది. ఇన్నాళ్ళుగా కలిసిఉన్న ముగ్గురు దూరమవుతున్నారు. పద్మకూడా కొద్ది రోజులలో మద్రాసు వెళ్ళిపోవచ్చును. ఎక్కడికీ వెళ్ళనిదీ, జీవితంలో ఏ మార్పు లేనిదీ నా జీవితమే' అనుకుంది చారుమతి.
ఇంటికి వెళ్ళగానే భానుమతి చెప్పింది:
"గది అద్దెకు కావాలని ఎవరో ఒకాయన వచ్చారు. గది చూసుకుని నచ్చిందనీ సాయంత్రం వచ్చి దిగుతామనీ చెప్పారు."
చారుమతి చాలా సంతోషించింది. "అద్దె ఎంతని చెప్పారు?"
"పద్దెనిమిది రూపాయలు."
శాంతమ్మకూడా ముందరిగదిలోకి వచ్చింది. అప్పుడే అత్తగారికి భోజనం పెట్టింది. ఆవిడికి కంచంలో అన్నం పెట్టి, మెత్తగా కలిపితే, కొద్దిగా ఓపిక తెచ్చుకుని, మంచంమీద దిండ్లను ఆనుకుని కూర్చుని, గంటసేపు నమిలి, మెల్లిగా తింటుంది. ఆవిడ తిన్నంతసేపు పక్కనే ఒక మనిషి ఉండాలి. పైగా, భోజనం చేస్తున్నంతసేపూ ఆవిడ ఆయాసపడుతూ ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళ చిన్నప్పుడు రూపాయికి పదహారు శేర్లు మంచి బియ్యం ఇచ్చేవారనీ, కానీకి ఒక ముంత రాయిలాంటి గట్టి పెరుగు దొరికేదనీ, కమ్మటి నెయ్యి రూపాయికి అయిదు పాపులనీ, మూడు రూపాయలకి మంచి ఎనిమిది గజాల చీరనీ-ఏవో పాతకబుర్లు చెపుతుంది. పక్కన కూర్చున్నవాళ్ళు ఊకొట్టాలి. లేకపోతే కోపం. రోజూ శాంతమ్మే కూర్చుంటుంది.
"శ్రీదేవి వెళ్ళిపోయిందా?" అంది శాంతమ్మ కూతుళ్ళదగ్గిరికి వస్తూనే.
"ఆఁ, వెళ్ళింది" అంది చారుమతి.
ఏ అమ్మాయికి పెళ్ళయి, అత్తవారింటికి వెళ్ళిందన్నా శాంతమ్మకు కొంచెం ఈర్ష్యగా ఉంటుంది. తన కూతుళ్ళకి పెళ్ళి కాలేదని దిగులు.
"మీ పద్మ ఎప్పుడు వెళుతుంది కాపరానికి?"
"నాకు తెలీదు."
"వెళుతుందిలే, పెళ్ళయ్యాక కాపరానికి వెళ్ళదా? అంతా అదృష్టవంతులు. మనకే అన్ని దురదృష్టాలూను. మనింట్లో ఒక్కటీ కలిసిరాదు" అంది శాంతమ్మ నిస్పృహగా.
"ఎందుకలా అనుకోవాలమ్మా. అదృష్టం, దురదృష్టం అందరి జీవితాలలోనూ కలిసి ఉంటాయి. మనమే దురదృష్టవంతులమని ఎందుకనుకోవాలి?" అంది భానుమతి.
భానుమతి అచ్చు తండ్రి పోలిక. అదృష్టదురదృష్టాలని రెండూ ఒక రకంగానే చూస్తుంది.
కొంతమంది పెద్ద కోరికలు పెట్టుకుంటారు. ఆ కోరికలు తీరకపోయినా, ఏమాత్రం అటూ ఇటూ అయినా, తాము దురదృష్టవంతులమనీ, తమ చుట్టూ ఉన్నవాళ్ళు దురదృష్టవంతులనీ నిందించు కుంటారు. తమ పరిస్థితులనుబట్టి, వాతావరణాన్ని బట్టి మనిషి కోరికలు పెంచుకోవాలి. ఆకాశహర్మ్యాలు నిర్మించుకోవడం అవివేకం. చివరికి దుఃఖమే మిగులుతుంది.
అందంగా, తెల్లగా, ముద్దబంతిపూవులా ఉండే శాంతమ్మ ధనవంతుడైన, అందగాడైన భర్త వస్తాడని కలలు కంది. కర్మవశాత్తూ ప్లీడరు గుమాస్తా సూర్యారావుకి భార్య అయింది. మొదటిసారి కాన్పు రాగానే తనకు చక్కటి కొడుకు పుట్టాలని కోరుకుంది. కానీ మొదటిసారికాదు, నాలుగు సార్లదాకా ఆడపిల్లలే పుట్టి, అయిదో కాన్పుకి శంకరం కలిగాడు. శంకరంముందు పుట్టిన నలుగురు ఆడపిల్లలలోను ఇద్దరు చిన్నతనంలోనే పోయారు. శంకరం తరవాత నలుగురు ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక పిల్ల రెండేళ్ళు పెరిగి పోయింది. ఆమెకు తొమ్మిది కాన్పులైనా, మిగిలినవాళ్ళు ఆరుగురు. ఒక్కడే కొడుకు. ఇంకా కొడుకులు పుట్టాలనే కోరిక అలాగే మిగిలిపోయింది.
శాంతమ్మకు జీవితంలో ఇలాటి ఎదురుదెబ్బలు తగిలినా కోరికలు పెంచుకోడం మానలేదు. కూతుళ్ళంతా తెల్లగా బొద్దుగా ఉంటారు, ధనవంతులైన ఉద్యోగస్థులు వచ్చి పెళ్ళిచేసుకుంటారని అనుకుంది. అది తారుమారయింది. పెద్దకూతురు రేవతి పెళ్ళి చేయడానికే పెద్ద అవస్థ అయింది. అప్పు చేసి మొక్కు తీర్చినట్టు పెళ్ళి చేశారు. తరవాత మొదటికే మోసం వచ్చి భర్తనే పోగొట్టుకుంది.
తన కోరికలు నేల విడిచిన సాములాటివని ఎప్పుడూ గ్రహించలేదు శాంతమ్మ. తను దురదృష్ట వంతురాలనీ, తనకన్నీ కష్టాలేననీ, తనలాగే పిల్లలుకూడా దురదృష్టవంతులనీ అనుకుంటుంది. తామే లోకంలో దురదృష్టవంతులమనీ, తమకే అన్నీ కష్టాలూ వస్తాయనీ అనుకునేవాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు.
తల్లీ కూతుళ్ళూ మాట్లాడుకుంటూ ఉండగానే శంకరం వార్తాపత్రిక పట్టుకుని వచ్చాడు.
"ఏం, రిజల్ట్సు వచ్చాయా?" అడిగింది చారుమతి అతన్ని చూస్తూనే.
"ఆఁ, వచ్చాయి. నేను పాసయ్యాను."
చారుమతి ఒక్కసారి బరువు తీరినట్లు నిట్టూర్చింది. భానుమతీ, శాంతమ్మా సంతోషించారు.
చారుమతి లోపలికి వెళ్ళి శ్రీదేవి నంబరు తెచ్చి, పేపర్లో చూసింది. శ్రీదేవికూడా పాసయింది. రెండవ పార్టు తెలుగులో క్లాసుకూడా వచ్చింది.
ఆ రోజు సాయంత్రమే రామారావుగారు వచ్చి ముందుగదిలో అద్దెకు దిగారు. ఆయన మధ్యవయస్కుడు. నలభై ఉండవచ్చును. మనిషి కొంచెం రంగు తక్కువైనా, స్ఫురద్రూపి. చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడనిపిస్తుంది. ఇప్పుడు మనిషి కొంచెం లావు. జుట్టు అక్కడక్కడ నెరుస్తూంది. ఆయనని చూడగానే అనుకుంది చారుమతి, 'చిన్నవాడు, బ్రహ్మచారి కాదు. అమ్మ కోరుకున్నట్లు పెద్దాయనే వచ్చాడు' అని.
ఆయన వచ్చి ముందుగదిలో చేరగానే, రెండు గదులకీ మధ్య ఉన్న తలుపు మూసేశారు. ఇల్లు ఇరుకై, ఇబ్బంది కలిగినా, అద్దె వస్తూందన్న ఆశ అందరినీ సర్దుకోనిచ్చింది.
ఆ వారంలో పద్మ ఇంటర్మీడియట్ ఫలితాలూ, మాలతి ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షా ఫలితాలూ తెలిశాయి. ఇద్దరూ పాసయ్యారు. భగవతి కూడా పరీక్షపాసయినట్టు విశాఖనించి ఉత్తరం వచ్చింది. ఇంటర్ అంతా పాసవడం అంధకారంలో వెలుగురేఖలా అనిపించింది. ఇకముందేం చెయ్యడం అన్న సమస్య తలఎత్తింది. తొందరలోనే ఉద్యోగం వెతుక్కోడం శంకరం కర్తవ్యమని నిశ్చయమైపోయింది. పోతే, మాలతి. ఎస్.ఎస్.ఎల్. సి. మాత్రం పాసయినవాళ్ళకి ఉద్యోగం దొరకడం కష్టమే. మాలతి టైపు నేర్చుకుంటాననీ, హిందీపరీక్షలకు కడతాననీ అంది.
15
కోడల్ని కాపరానికి పంపమంటూ వియ్యపురాలి దగ్గిరినించి ఒక్క ఉత్తరమూ రాకపోయేసరికి కంగారుపుట్టింది వరలక్ష్మికి. కూతురి కాపరంగురించి బెంగపట్టుకుంది. "కాపరానికి ముహూర్తం పెట్టి, మనమే అమ్మాయిని మద్రాసు తీసుకువెళ్ళి అత్తగారి ఇంట్లో వదిలేసివద్దాం" అంది ఆమె భర్త నారాయణరావుతో.
అతనికికూడా వేరే మార్గం కనిపించక, పురోహితుడి చేత ముహూర్తం పెట్టించుకు వచ్చాడు. వరలక్ష్మి వియ్యపురాలికి, నారాయణరావు అల్లుడికి ఉత్తరాలు రాశారు, తాము మద్రాసు వచ్చి పద్మని కాపరానికి వదిలిపెడుతున్నట్టు.
పద్మ ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. భర్త రమ్మని రాయకుండా తాను వెళ్ళడం సుతరామూ ఇష్టంలేదు. తల్లితో, తండ్రితో చెబుదామనుకుంది, "నేను మద్రాసు వెళ్ళను. మీదగ్గిరే ఉండిపోతాను" అని. కాని దానివల్ల లాభం లేదు. తన కాపరం చక్కబడేవరకు వాళ్ళిద్దరికి మనశ్శాంతి ఉండదు. ఏమీ చెయ్యలేక మౌనంగానే ఉండిపోయి దుఃఖించింది పద్మ.

ప్రయాణం ఇంక రెండురోజులు ఉందనగా కాంతమ్మగారినించి జవాబు వచ్చింది, పద్మను తీసుకువచ్చి మద్రాసులో వదిలెయ్యమని.
పద్మకి, వరలక్ష్మీ నారాయణరావుగార్లకి కొంచెం మనస్సులు కుదుటపడ్డాయి. కాంతమ్మగారు కోరినట్లు వజ్రాల దుద్దులతో, ఖరీదైన స్టీలుగిన్నెల సెట్టుతో కాపరానికి వెళ్ళింది పద్మ.
సెంట్రలుస్టేషనుకి మాధవరావు, తల్లి వచ్చారు. వాళ్ళని చూడగానే కొండంత బరువు తీరినట్లయింది వరలక్ష్మికి.
"రండి, వదినగారూ. ఎలా ఉన్నావు, పద్మా?" అంటూ నవ్వుతూ పలకరించింది కాంతమ్మ.
మాధవరావు మామగారి యోగక్షేమాలను గురించి అడిగాడు. తరవాత అంతా టాక్సీ కట్టించుకుని ఇల్లు చేరారు.
రవ్వల దుద్దులు, స్టీలుగిన్నెలు, కోడలు తెచ్చిన సారె చూసి సంతోషించినట్టే కనిపించింది కాంతమ్మ. వియ్యపురాలు, వియ్యంకుడు ఉన్న రెండు రోజులు మర్యాదగానే చూసింది.
మాధవరావు పద్మతో ఒక్క మాట మాట్లాడ లేదు. అతను తండ్రితో మాట్లాడుతున్నందుకే సంతోషించింది పద్మ.
మూడవ రోజు ఉదయమే తిరుపతికి వెళ్ళిపోయారు పద్మ తల్లిదండ్రులు, అటునించి అటే కాకినాడ వెళ్ళిపోవడానికి.
కూతుర్ని వదిలి వెళుతున్నప్పుడు వరలక్ష్మి కంటినీరు ప్రవాహమయింది.
"వదినగారూ, మా కున్న ఒక్కగా నొక్క కూతుర మీ చేతుల్లో పెట్టాం. ఇక పద్మకి తల్లి, తండ్రి మీరే" అంటూ కాంతమ్మ చేతులు పట్టుకుంది.
"మీరు ఇంతగా చెప్పాలా?" అంది కాంతమ్మ.
మాధవరావుకూడా వాళ్ళని బస్సు ఎక్కించడానికి బ్రాడ్వేకి బయలుదేరాడు. కూతురు, అల్లుడు ఒక్క సారైనా మాట్లాడుకోవడం చూడని వరలక్ష్మి ఆ కొరత తీర్చుకోవాలనుకుంది. పద్మ తమతో బస్సు స్టాండుకి వస్తే వాళ్ళేమన్నా మాట్లాడుకోవచ్చును.
