Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 9


    ఆలయం దాటి వీధిలోకి వచ్చిన తరువాత హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇంటి పనివారు ఎవరయినా గమనిస్తారని అనుమానించింది. కాని వారంతా యాగశాల దగ్గర అమ్మగారిని కనిపెట్టుకుని ఉన్నారు.

    వీధి మలుపు తిరిగిన తరువాత స్వేచ్ఛా విహంగం అయిపోయింది ఆమని! యువతీ యువకులు అప్పటికే ఉజ్జీల పండుగలో పాల్గొనేందుకు చెరువు గట్టుకు పరుగులు పెడుతున్నారు.

    ఆమెకు కూడా ఆ దారి తెలియనిదేమీ కాదు,

    గ్రామం చిన్నది. వీధులు చిన్నవి! అయినా అధిక సంఖ్యలో జనం వస్తారు కాబట్టి ఊరు దాటి వీధులు దాటిన తరువాత కూడ ఇంకా అంగళ్ళు కన్పిస్తున్నాయి. ఊరికి కొద్ది దూరంలో ఉంది చెరువు!

    గ్రామానికి ఈశాన్యంగా చెరువు ఉండటం మంచిది అని రాణి సుమిత్రాదేవి ఇంటివారే ఎప్పుడో ఆ చెరువు త్రవ్వించారు.

    యువతీ యువకుల మధ్య సమాజం గీచిన అడ్డు రేఖలుంటాయి. వాటిని దాటిన వారికి చెడ్డపేరు వస్తుంది.

    కాని ఇలాంటి సందర్భాలలో ఆ అడ్డుగీతలకు ఆటవిడుపు కూడ ఇచ్చారు పెద్దలు! అప్పుడే కొందరు చెట్టపట్టాలు కట్టేశారు. గ్రామీణ ప్రాంతాలలో తిరునాళ్ళు జరిగేప్పుడు సర్వసాధారణంగా కన్పించే ఆటవిడుపు దృశ్యం ఇది.

    ఏ నియమ నిబంధనలు అయినా సమాజానికి మంచిదే!

    కాని సడలింపులు లేకపోతే అవి దొంగల్ని సృష్టిస్తాయి.

    భారతీయులు అంటే అందమయిన భావాలతో రమించే వారని అర్ధం. అందుకే మన సమాజం కట్టుబాట్లు అందమయిన ఆలోచనలతో భద్రతతో ముడిపడి ప్రోగ్రెసివ్ గా కూడా వుంటాయి.

    యువతీ యువకుల పరవళ్ళు చూచి ఆమని మనసు కూడ ఉత్సాహంతో ఉప్పొంగి పోయింది. మామూలుగా వున్నప్పుడు అంతస్థులు, అంతరాలు మనుషులకు జ్ఞాపకం వుంటాయి.

    కాని నిండయిన దుఃఖం కాని ఆనందం కాని కలిగినప్పుడు అందరూ మానవ సహజాతాలతో ప్రతిస్పందించి ఒకటి అయిపోతారు.

    హ్యూమన్ ఎలిమెంట్ నిద్రలేచాక అందరూ ఒక్కటే!

    ఆమని తన ఉత్సాహాన్ని అందరితో కలుపుకుంది.

    చెరువు గట్టుమీదకి చేరాక యువతీ యువకులు మాంచి ఉత్సాహాన్ని కోలాహలంగా చూపుతున్నారు.

    చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆ పరవళ్ళు చూడటానికి చెరువు గట్టున చేరారు. కొంతమంది స్త్రీలు కూడ ఆనందంలో పాలుపంచుకోవాలని వచ్చారు. ఆ మొత్తం అందరినీ కలిపితే అది ఒక ఆనంద కెరటం.

    ఇంక వేరుగా వ్యక్తిత్వాలు ఎక్కడ మిగిలాయి?

    అందరూ ఒక్కటే! ఆనందానికి రూపం! ఆమని కూడ అంతే అయింది. ఎటువంటి అమరికలు లేకుండా వారితో కలిసిపోయింది.

    చెరువు గట్టున చేరిన కొన్ని వందల మంది వున్నారు.

    ఇరవై అయిదు సంవత్సరాలు దాటిన వారు, పెళ్ళిళ్ళు అయినవారు గట్టు దిగి రాలేదు. చెరువు గట్టున చెట్టు నీడలో కూర్చున్నారు. యువతీ యువకులు ఆనంద పారవశ్యంలో సృష్టించిన కోలాహలాన్ని చూస్తున్నారు.

    దొంగల దోపిడి అనే పండుగ, పారువేట, వసంతోత్సవాలు వయసుతో నిమిత్తంలేని పండుగలు. అందరూ పాల్గొంటారు.

    ఉజ్జీలవేటలో పాల్గొనేందుకు వయసు పెళ్ళి కాకపోవటం అనే నియమాలున్నాయి. అర్హతను వున్నవారంతా చెరువు గట్టు మీది నించి దిగి నీటి అంచుకు చేరారు.

    యువతులు ఒకవంక క్రిక్కిరిసిపోయి వున్నారు.

    యువకులు మరోవంక క్రిక్కిరిసిపోయి నిలబడ్డారు.

    వారి చూపులు కలుస్తున్నాయి. ఉత్సాహంతో కలబడుకుంటున్నాయి. కేరింతలు కొడుతున్నారు. కోలాహలంగా మాటాడుకుంటున్నారు.

    ముందుగా ఒక అమ్మాయి వేదిక మీదికి వచ్చింది.

    వేదిక అంటే చెరువులో దిగేందుకు అమర్చిన రాతి మెట్లు నీటిలో మునిగి వున్నచోటున ఒక్క మనిషి నిలిచేందుకు వీలుగా ఒక అరుగు లాంటిది ఏర్పాటు చేశారు. చొరవ కలిగి గతంలో ఆ ఆటలో పాల్గొనటం అలవాటు లేని ఆడపిల్లలు అంత ఉత్సాహంలో కూడా రవంత సందేహం నిండిన చూపులతో రాతి మెట్ల అంచున నిలిచిపోయినారు.

    చొరవ, అనుభవం కలిగిన అమ్మాయి ముందుకు వచ్చింది.

    ఆమె ఆట ప్రారంభించేందుకు ముందుకు రాగానే యువకుల్లో ఉత్సాహం పేట్రేగిపోయింది. వారు ఈలలు కేకలతో సందడి చేయటం మొదలెట్టారు. కొందరు యువకులు అయితే తాము ఎగరగలిగినంత పైకి ఎగిరి గుంపు కట్టివున్న వారిలోంచి ప్రత్యేకంగా ఆడపిల్లలకు కన్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

    ఉత్సాహం ఇనుమడించి ఒకరిని మించి ఒకరు పైకి గెంతేవరకు వచ్చింది. ఎప్పుడయితే వేదిక మీదికి వచ్చిన యువతి ఒక కర్చీఫ్ లాంటి పీస్ బయటకు తీసిందో సందడి ఆగిపోయింది.

    వారంతా ఆసక్తితో చూడటం మొదలెట్టారు.

    యువతి నీటిలోకి ఏదో ఒక వస్తువుని విసరాలి.

    నీటిమీద పడి ఈదుకుంటూ యువకులు గుంపులుగా చెరువులోకి వెడతారు. ఆ వస్తువు ఎక్కడ మునిగిందో అక్కడ తామూ మునుగుతారు.

    ఎవరు దాన్ని తెచ్చి ఆ అమ్మాయికి అందిస్తారో వారితో ఆమె ఉజ్జీ కట్టి ఆ అయిదు రోజుల సంబరం అంతా తమ స్వంతం చేసుకోవచ్చు.

    మరీ హద్దులు మీరి ప్రవర్తించారు అనుకుంటే తప్ప వారి ఉత్సాహంలో పెద్దవాళ్ళు ఎవరూ కల్పించుకోరు. పూర్వకాలంలో కాళ్ళ చెప్పులు అరిగేలా సంబంధాల కోసం తిరిగే అవసరం వుండేది కాదు.

    ఈ రోజుల్లోలాగా కల్చర్ యిచ్చిన వికృతపు కట్నాలు కానుకల వంటి రంగులు వుండేవి కావు. మనిషి జీవితాన్ని భగవంతుడు నడుపు తాడు అని అనుకునేవారు. ఈ పండుగలో ఈ పద్ధతిలో ఉజ్జీని సంపాదించుకుని భగవంతుడే ఆ జంటని కలిపాడు అనుకునేవారు.

    పది మందిలో గెలిచిన యువకుడు వీరుడే!

    వీరపూజలు సాగే రోజుల్లో మొదలయిన ఆట అది!

    పాల్గొన్నవారు తరువాత పెళ్ళిళ్ళు అయి వివిధ వృత్తుల్లోకి జీవితపు బరువు భారాల్ని మోస్తూ దూర దూరం వెళ్ళిపోతారు. కాని ఈ ఉజ్జీలు పండుగలో పాల్గొన్న నాటి తీయని జ్ఞాపకం వారిని జీవితమంతా గిలిగింతలు పెడుతూనే వుంటుంది. ఆ జ్ఞాపకాలు మనసు పొరల మీదికి తేలివచ్చినప్పుడు హాయిగా ఆనందంగా కష్టాలన్నీ మరచి నవ్వుకుంటారు.

    కర్చీఫ్ ని అందరికీ చూపించింది అమ్మాయి.

    ఆ మొత్తం జనంలో ఇప్పుడామె హీరోయిన్! అందరి చూపులు ఆ యువతి మీదే వున్నాయి. ఆమె ప్రతి కదలికని కొన్ని వందల కళ్ళు ఎంతో ఆశతో ఆసక్తిగా కొలవటం ప్రారంభించినాయి.

    జేబు రుమాలుతో మెడక్రింద అద్దుకుంది. పర్స్ లోంచి కొన్ని కాయిన్స్ తీసి అందరికి చూపించింది. రూపాయి బిళ్ళలు అయిదారున్నాయి. వాటిని జేబురుమాలులో గట్టిగా ముడివేసిందామె.

    అది బరువుగా, పడిన వెంటనే నీటిలో మునిగిపోయేందుకు వీలుగా తయారయింది. దాన్ని మరోమారు అందరికీ చూపించింది.

    ఆ మధురానుభవంలో పాలుపంచుకుంటున్న యువతులంతా మెరిసే కళ్ళతో చూస్తున్నారు. వారి కంటి మెరుపుల్లో భవిష్యత్తు మీది ఆశలు మాత్రమే కాదు. కోరికలు నిండిపోయిన పూర్ణ కలశాలవంటి వారి ఆత్మలు కూడ కనిపిస్తున్నాయి.

    అందరికి చూపటం అయిన తరువాత ఆ యువతి రూపాయిలతో ముడివేసిన రుమాలును చేయిచాచి శక్తి వున్నంతవరకు చెరువు నీటిలోకి దూరంగా విసిరింది. అది చెరువు మధ్యలో పడి బుడుంగున మునిగిపోయింది. ఆమె కళ్ళలో కోరికల్ని ఎత్తిన చేయి తాలూకు తడిసిన రవిక అంచుల్ని కొలుస్తున్న యువకులు వెంటనే చెంగుమని నీటిలోకి దుమికేశారు. ఒకరిని మించి ఒకరు ఈదుతున్నారు.

    దట్టాలుకట్టి అలా నీటిలోకి వేగంగా పోతూన్న బలిష్టమయిన వారి కండరాల విరుపుల్ని ఆనందంతో గమనిస్తున్నారు యువతులు.

    వారి ముందు తమ ప్రతాపం చూపించే అవకాశం వచ్చింది కాబట్టి శక్తి అంతా ధారపోసి ముందుకు పోతున్నారు యువకులు.

    ఎంతో అద్భుతమయిన అపురూపమయిన సన్నివేశం అది.

    గట్టుమీద ఆటలో పాల్గొనకుండా కేవలం చూచి ఆనందించేందుకు వచ్చిన వారు ఈ పోటీలో పందెం కాచి ఈదుతున్న యువకుల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. గెలిచిన వానికి ఒక మంచి స్నేహితురాలితో పాటు గజ ఈతగాడు అనే గుర్తింపు కూడా వచ్చేస్తుంది.

    ఆ అమ్మాయి విసిరిన తరువాత రూపాయిలతో బరువైన రుమాలు ఎక్కడ మునిగిపోయిందో ఆ చోటుని యువకులు సైన్యంలాగ చుట్టుముట్టారు. కొందరు కాళ్ళతో బురదని పెళ్ళగించారు. కొందరు చేతులతో అందుకోవాలని చూచారు.

    సాహసులు నీటిలో మునిగి బురదను పెకిలించి ఆ రుమాలు కోసం యుద్ధం ప్రారంభించారు. నీటిపైన కన్నా నీటిలోపల చాలా సందడి జరుగుతోంది. ఎక్కువసేపు మునిగి వుండటం చేత కాని వారు మళ్ళీ పైకి వచ్చి కన్పిస్తున్నారు.

    ముందుగా వచ్చినవి ఓడిపోయిన ముఖాలు. కాబట్టి జనం ఈలలు కేరింతలతో అవహేళన చేస్తున్నారు. సాటి యువకుల మధ్య అంత మంది యువత సమూహాలు గమనిస్తూ వున్న సమయాన అలా ఎదురు అయిన అవమానం ఎవరు భరించగలరు?

    పైకి తేలిన యువకులు కూడా ప్రాణాలు బిగియపట్టి ఊపిరులు చిక్కపట్టి మళ్ళీ మునిగిపోయి వెతుకుతున్నారు.

    నీటి క్రింద పోరు ఘోరంగా జరుగుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS