Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 8

    "ఒకసారి ఇంతకుముందు అద్దెకి ఉండే అతన్ని ఇలానే అవసరం వచ్చి అడిగానోయ్, ఠట్  నా వల్లకాదు అన్నాడు. ఒక కప్పుక్రింద ఉంటున్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సాయంగా ఉండే వాళ్ళుండాలి గానీ అలాంటి వాళ్ళెందుకూ? అందుకే గది ఖాళీచేసి వెళ్ళిపొమ్మన్నాను" అన్నాడు శంభులింగం నా ముఖం లోకి పరీక్షగా చూస్తూ.

    "అంతే కదండీ....హిహిహి...మరి నిజమే కదా...ఆ?... మీరెళ్లిరండి రాణిని నేను చూసుకుంటాను" అన్నాను చచ్చినట్లు.

    వాళ్ళు పది గంటలకు బయలుదేరారు.

    "రాణీ జాగ్రత్త నాయనా... దాన్ని తాళ్ళతో గట్రా కట్టేయకు, దాన్కొక్క దాన్నీ వదిలి ఎక్కడికీ వెళ్ళకు బాబూ, ఇంట్లో ఎవరూ లేకపోతే ఏడుస్తుంది" వెళ్ళేముందు మరీమరీ చెప్పి వెళ్ళింది వెంకుమాంబ.

    వాళ్ళు వెళ్ళిన గంటకి రాణి ఊరికే అరవడం మొదలుపెట్టింది. మధ్య మధ్య "కుయ్ కుయ్" అంటూ నా పిక్కపట్టుకుని లాగసాగింది. అలా చేస్తే ఆకలివేస్తున్నట్టట! వాళ్ళు చెప్పారు.

    నేను దానికోసం వాళ్ళు గిన్నెలో పెట్టిన ఎముకల సూపు కలిపిన అన్నం దాని ముందు పెట్టాను.

    అది తిన్న తరువాత దానికి తిన్నది అరగడంకోసం బంతితో ఆడించాలని చెప్పారు.

    మూల ఉన్న బంతితీసి బయట కాం పౌండులోకి వచ్చాను. బంతిని దూరంగా విసుర్తే అది పరుగెత్తికెళ్ళి తెచ్చింది. అలా పావుగంట చేసిన తరువాత అలిసిపోయి ఓ మూల కూర్చుంది.

    అదే సందు అని నేను భోజనంచేసి బయటికి వచ్చాను.

    మరో అరగంట తరువాత రాణీ "కుయ్యో, మొర్రో..." అంది.

    అలా అంటే బిస్కెట్టు కావాలని అర్థం అట! వెంకుమాంబ చెప్పింది.

    అలమారలోని కుక్క బిస్కెట్లడబ్బా తీసి దానిముందు కొన్ని బిస్కెట్లు వేశాను.

    రాణి వాటిని వాసనచూసిందిగానీ తినలేదు.

    మళ్ళీ "కుయ్యో...మొర్రో.. అంది.

                         

     అలా దానిముందు బిస్కెట్లు పడేస్తే అది తినదని నాకు గుర్తుకువచ్చింది.

    బిస్కెట్లు పట్టుకుని దానికి అందీ అందనట్లు ఎత్తి పట్టుకుంటే రాణి ఎగిరి దాన్ని నోటితో అందుకుని తింటుంది.

    "కుయ్యో...మొర్రో...."

    రాణి కాళ్ళు నేలమీద గీరుతూ ఉంది.

    "ఉండు...ఉండు... దొంగముండా ఒక్కక్షణం ఆగు...."

    ఇన్నాళ్లూ ఆపుకున్న కోపాన్ని వాళ్ళు లేని సమయంచూసి కసితీరా రాణిని తిట్టి తీర్చుకుంటున్నాను.

    "ఊ...మింగు..."అన్నాను బిస్కెట్లు పైకెత్తి పట్టుకుని.

    రాణి పైకి ఎగిరి బిస్కెట్టు అందుకుంది.

    మధ్యమధ్య బిస్కెట్టుతోపాటు కాస్త కాస్త నా వేళ్ళనికూడా నంజుకుని తినసాగింది.

    బిస్కెట్ల కార్యక్రమం ఓ పావుగంట సాగింది. రాణి బిస్కెట్లు తిన్నతరువాత నేను చేతి వేళ్ళు లెక్కబెట్టుకుని పది ఉన్నాయని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.

    అప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర అయింది. రాణి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని కుసుకుతీయసాగింది. నాక్కూడా నిద్రరాసాగింది. ఇంటిదగ్గర ఉంటే మధ్యాహ్నం ఓ గంటసేపు నిద్రపోవడం నాకు అలవాటు. రాణి బయటకు వెళ్ళిపోకుండా కాంపౌండు వాల్ గేటు జాగ్రత్తగా వేసి వచ్చాను. రాణి నిద్రపోతూంది.

    నేనూ గదిలోకి వెళ్ళి మంచంమీద కాస్త నడుం వాల్చాను.

    ఎప్పుడు నిద్రపట్టిందో పట్టేసింది.

    ఉలిక్కిపడి నిద్ర లేచాను.

    "భౌ భౌ..."

    "వౌప్....వౌప్..."

    "కయ్....కయ్...."

    "కుయ్...కుయ్...."

    "కుయ్యో....కుయ్యో..."

    ఇల్లంతా చెడ్డ సందడిగా ఉంది.

                                                                             

     కంగారుగా మంచం మీదనుండి లేచి వరండాలోకి పరుగుతీశాను.

    దాదాపు ఓ అరడజను మగ కుక్కలు కాంపౌండ్ వాల్ దూకి మా వసారాలో దెబ్బలాడుకుంటున్నాయ్. అది కురుక్షేత్రం సంగ్రామంలా ఉంది.

    రాణి మాత్రం తోక ఊపుకుంటూ వినోదం చూస్తుంది. అక్కడ రాణికి స్వయం వరం ఏర్పాటయిందని నాకర్థం అయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS