హైదరాబాద్ చేరగానే టెలిగ్రామ్ మాత్రం ఇవ్వమని గట్టిగా చెప్పాను.
కులాసాగా చేరినట్టు వైరు ఇచ్చేశారు. అంతే_ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఏమయిందో పత్తాలేదు. నా గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. వారి ఆలోచనలతో గతాన్ని నెమరువేసుకున్నాను.
షష్టిపూర్తి వేడుకల గురించి చెపుతున్న విషయాలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఒకరిద్దరు మిత్రులు నాతో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
"శ్రీశ్రీగారి షష్టిపూర్తికి హడావుడి అంతా ఇంతా కాదు. అందరం ఓ పెళ్ళికి వెళుతున్నట్టు వెళ్ళాం. విశాఖ పట్నంలో ఆ మూడు రోజులూ ఓ పెద్ద పండగేనమ్మా. అంత ఘనంగా, గొప్పగా, అంత సరదాగా ఎవరికీ షష్టిపూర్తి ఉత్సవాలు జరగలేదు.
మన పెళ్ళిళ్ళలోలాగే అక్కడ కూడా అలకలూ, గింజుకోవడాలూ జరిగాయి. అందుకనే పెళ్ళిలా జరిగిందంటున్నాం.
ఎప్పుడు ఏది జరిగినా, ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకూ, ఇటీవల అన్ని ఉద్యమాలూ శ్రీశ్రీ అనే కేంద్రబిందువు చుట్టూ పరిభ్రమిస్తూనే వున్నాయి. తన చుట్టూ ఎంత గొడవ జరుగుతున్నా, తనకేమీ పట్టకుండా తన మనోవాల్మీకంలో తాను వుండగలవారు "శ్రీశ్రీ" అని అన్నారు. కళ్ళముందు వారే నిల్చున్నట్టున్నారు.
వీరికి ప్రాణంమీద తీపిలేదేమిటి చెప్మా! భార్యా పిల్లలమీదా కూడా మమకారం లేదా? ఏమిటి వీరి తత్వం ?
పోనీ_భార్యా పిల్లలమీద ఏమీ వుండనక్కరలేదు. తనమీద అయినా తనకి జాగ్రత్త వుండొద్దూ? అనుకుంటూ__
"భగవంతుడా! వారికి ఏమీ చెడు కలగకుండా చూడు. నాకూ, నా పిల్లలకీ అన్యాయం చెయ్యకు" అని పిచ్చిదానిలా దండాలు పెట్టుకుంటూ, పోనున్న గదిలో నుండి కదలలేదు.
మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఫోను వచ్చింది, శ్రీశ్రీగారిని అరెస్టు చేశారని.
అనుకున్నంతా అయ్యింది. ఏ దేవుడూ సాయం చెయ్యలేదు. నా పూజలూ పునస్కారాలూ చెయ్యిచ్చేశాయి. ఓ విధంగా దేవుడి విషయంలో శ్రీశ్రీగారు చెప్పిందే నిజమేమో_అనుకుంటూ కూలబడిపోయాను.
అరగంట కాకుండానే ఇద్దురు ముగ్గురు మిత్రులు నాకు ధైర్యం చెప్పడానికి వచ్చేశారు.
"శ్రీశ్రీగారికి ఏమీకాదు. వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మనవాళ్ళంతా అక్కడున్నార"ని చెప్పారు.
"నేను వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి. ఏం చేస్తారో నాకు తెలీదు" అని అన్నాను.
"మిమ్మల్ని అక్కడికి రానివ్వద్దని గురువుగారు చెప్పమన్నారమ్మా! అందుకే మేం పరుగెత్తుకొచ్చాం. రెండుమూడు రోజుల్లో వారు వచ్చేస్తారు. మీరు ధైర్యంగా వుండండ"ని చెప్పి, నన్ను కదలనివ్వకుండా తిష్టవేసి కూర్చున్నారు.
ఆశ్చర్యం!
మా ఇంట్లోవున్న మిత్రులు నాకు ధైర్యం చెబుతూ "శ్రీశ్రీగారి గురించి మీరెందుకమ్మా అనవసరంగా భయపడతారు? మీరు అరవదేశంలో కూర్చున్నారు. ఒక్కసారి ఆంధ్రాకొచ్చి చూడండి. గురువుగారి సంగతి తెలుస్తుంది" అని అంటూ వుండగా మళ్ళీ ఫోను వచ్చింది. వెళ్ళి తీశాను.
"సరోజగారు కావాలండీ" అన్నారు అటు నుంచి.
"నేనేనండీ మాట్లాడుతోంది. మీ పేరు?" అన్నాను.
"పేరేదైతే ఏం లెండమ్మా. గురువుగారు కులాసాగా వున్నారు."
"ఎక్కడండి? జైల్లోనా ?"
"కాదమ్మా! జైలు నుండి వచ్చేశారు. ఎల్లుండి గురువుగారు వచ్చేస్తున్నారు. వివరాలన్నీ చెప్తారు. మిమ్మల్ని భయపడొద్దని, తనకేం ఫరవాలేదని, పిల్లలెలా వున్నారని అడగమన్నారమ్మా" అన్నారు.
"ఆఁ బాగున్నారండి. చల్లనిమాట చెప్పారు. థాంక్సండీ" అన్నాను.
"ఫరవాలేదమ్మా! వుంటామరి" అని ఫోను పెట్టేశారు.
పేరు చెప్పకపోయేసరికి నాకు సందేహం కలిగింది. ఇది ఎంతవరకూ నిజం అన్న విషయం తెల్సుకోవాలనే ఉబలాటం హెచ్చయింది. వచ్చిన మిత్రులు వెళ్ళిపోయారు.
నేను వెంటనే ఫోను దగ్గర తిష్టవేశాను. నాకు కావలసినవాళ్ళు, బాగా పరిచయస్తులైన ఇద్దరు ముగ్గురు మిత్రులు హైదరాబాదులో వున్నారు. వారికి ఫోను చేసి అడిగాను.
"భయపడొద్దు. కులాసాగా వున్నారు. వారిని జైల్లో ఎవడమ్మా భరిస్తాడు? అయినా చాలా గొడవలు జరిగాయి. నానారభస అయ్యింది. ఇదంతా ఫోనులో ఇప్పుడు మాట్లాడ్డం మంచిదికాదు. బహుశా రేపే గురువుగారు ఇంటికి వచ్చేయొచ్చు. అలా రాకున్నా ఎల్లుండి వచ్చేస్తారు. భయపడకండ"ని చెప్పారు.
వాళ్ళకి కృతజ్ఞతలతోపాటు నమస్కారాలుకూడా చెప్పి ఫోను పెట్టేశాను. మనసు కాస్త కుదుట పడింది.
ఒక్కోరోజు ఒక్కోయుగంలా గడిచింది. ఎలాగయితేనేం సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అంతే_ఇద్దరం టెలిఫోను గదిలోనే కూర్చున్నాం. కబుర్లలో పడ్డాం.
"ఏవండీ! నాకన్నివిషయాలు ఏటూ జెడ్ చెప్పాలి. మీ సంగతి అక్కడ ఎలాగో కానీ ఇక్కడ నేను మాత్రం చిత్రవధ అనుభవించానండి అబ్బబ్బ! ఏమిటా బాధ, చెప్పడానికి లేదు" అన్నాను.
"నీకు ఎంత చెప్పినా బుద్ధిరాదు సరోజా! నాకేం ఫరవాలేదన్నా వినవు కదా! నేను పుట్టిననాటినుండీ నేటిదాకా సుఖదుఃఖాలేవేవో వస్తూంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో ఆహ్వానిస్తున్నాను.
