చెఱవిముక్తి
...ఒకనాడు శ్రీరాముడు నీ అగ్రజునితో "రావణా నీ యందలసట గోచరించుచున్నది. ఇప్పుడు యుద్ధమును ఆపుదము. నీవు నీ సదనమునకు పోయి విశ్రమించి రేపు రమ్ము" అని వచించినాడట. నేను శ్రీరాముని యౌదార్యమును లోలోపల మెచ్చుకొనుచు కూర్చొని యుండగా త్రిజట వచ్చినది.

విభీషణుడు రణరంగమున నేలపై పడియున్న రావణుని మొండెమునూ మొండెము నుండి ఖండింపబడి దొరలిన తలనూ చూచినాడు. బాల్యమున తనకునూ అగ్రజునకునూ నడుమ నుండిన ప్రేమాభిమానములను తలచుకొనుచూ రోదించసాగినాడు. శ్రీరాముడు "విభీషణా నీయన్న రణరంగమున వీరోచితమగు మరణమును పొందినాడు; దుఃఖించకము" అని ఓదార్చినాడు. పట్టమహిషి మండోదరి సపత్నులతో వచ్చి "ప్రాణేశ్వరా, హంసతూలికా తల్పము కలవాటుపడిన నీవీ కటిక నేలపై పరుండుటకు ఎట్లు ఇచ్ఛగించితివి? అనాథలమగు మాకింక దిక్కెవ్వరు?" అని రొమ్మును బాదుకొనుచు ఏడ్చినది.
శ్రీరాముడు: (విభీషణునితో) ఈ కాంతాజనమును ఓదార్చి అంతఃపురములందు విడిచిరమ్ము. విభీషణుడు వారిని దిగబెట్టి వచ్చినాడు.
శ్రీరాముడు: మిత్రమా నీ అగ్రజుని పుత్రులందరును రణమున మరణించినారు. నీకు పితృసముడగు జ్యేష్ఠునకు శ్రద్ధాసక్తులతో అంత్యక్రియలను జరిపించుము.
విభీషణుడు: రామచంద్ర ప్రభూ నేను అగ్రజుని పితృసమునిగ భావించియే హిత వచనములను చెప్పినాను. అతడు వినక ఆగ్రహముతో నన్ను లంకాపురి నుండి వెడలగొట్టినాడు!
శ్రీరాముడు: విభీషణా దానిని మనసు నందుంచుకొనకుము. వైరము శత్రువు మరణముతో అంతమొందవలెను. రావణుడు నాకు మహాపచారమును చేసినాడు. ఐనను అతని యెడల నాకిప్పుడు వైరభావమేదియు లేదు. నీవునూ విస్మరించి నీ విధిని నెఱవేర్చుము.
విభీషణుడు చందన కాష్ఠములతో చితిని పేర్పించి రావణుని శవమునకు దహన సంస్కారమును జరిపినాడు. అపర క్రియలను యథావిధిగ జేసినాడు.
అనంతరము శ్రీరాముడు సౌమిత్రితో "లక్ష్మణా దుష్టులను సంహరించి సాధు జనమును రక్షించి ధర్మ సంస్థాపనమును చేయుట కీదానవోత్తముడు విభీషణుడు తోడ్పడినాడు. రావణుని యనంతర మీతని అసుర సామ్రాజ్యాధిపతిగ పట్టాభిషిక్తుని కావించుటకు నేనిదివరకే నిశ్చయించుకొన్నాను. నీ విప్పుడీ తనితో లంకాపురమును ప్రవేశించి పురప్రముఖుల సహకారముతో ఇతని పట్టాభిషేకమును వైభవోపేతముగ జరిపించి రమ్ము. నీతో సుగ్రీవుడు హనుమంతుడు అంగదుడు మున్నగు వానర శ్రేష్ఠులను కొనిపొమ్ము" అన్నాడు.
విభీషణుడు: శ్రీరామచంద్ర ప్రభూ, నీవు కూడ ఆ ఉత్సవ సమయమున మాతో నుండి నన్నాశీర్వదించ ప్రార్ధించుచున్నాను.
శ్రీరాముడు: నా పదునాలుగేండ్ల వనవాస కాలము మిగియుట కింకను కొన్ని దినములున్నవి. ఆ లోపల నేను పురప్రవేశమును చేయరాదు. నీవు లంకేశ్వరుడుగ అభిషిక్తుడవైన పిమ్మట అశోక వనమున చెఱయందున్న నా జానకికి విముక్తిని కలిగించి తెచ్చికొనుటకు అనుమతి నీయగోరుచున్నాను.
విభీషణుడు: (సవినయముగ) రామప్రభూ, జానకీదేవిని నేనే స్వయముగ నీ సన్నిధిని చేర్చెదను.
లంకాపురి యందు విభీషణుని పట్టాభిషేకమును లక్ష్మణుడు అత్యంత వైభవముగ జరిపించినాడు. పౌరులెల్లరును అంతకుముందు సంభవించిన విషాద సంఘటనలను విస్మరించి ఆ యుత్సవమున పాల్గొని ఆనంద సాగరమున నోలలాడినారు.
హనుమంతుడు అశోక వనమున సీతాదేవిని దర్శించి "తల్లీ, రావణుడు వధించబడినాడు. నీ కష్టములు అంతమైనవి. త్వరలోనే నీవు నీ ప్రాణనాథుని చేరుకొందువు" అన్నాడు.
సీతాదేవి: (కృతజ్ఞతతో) ఇదివరలో నేను నన్ను పరివేష్టించియున్న రాక్షసాంగనల వేధింపులను భరించలేక ప్రాణములను వదలబోగా, నీవు ప్రత్యక్షమై నా నాథుని అంగుళీయకము నొసగి, ధైర్యమును చెప్పి నా అసువులను నిలబెట్టినావు. ఇప్పుడీ శుభవార్తను తెలిపి సంతోషమును కలిగించినావు. నీ ఋణము తీర్చుకొనలేనిది.
హనుమంతుడు: ఋణమేమున్నది తల్లీ? సకల సద్గుణ సంపన్నుడును, ధర్మపరాయణుడును, సాధుజన రక్షకుడును అగు శ్రీరామచంద్రుని సేవించుటయే నా జీవిత లక్ష్యము; రామ కార్యములను నెరనెరవేర్చుటయె నా ఆశయము. నీవిచ్చట నుంటివన్న విషయమును రూఢిగా తెలిసికొనుటకు మున్ను నూరుయోజనముల సముద్రమును లంఘించి వచ్చినాను. ఆ శతయోజనముల సాగర లంఘనమును అవలీలగా చేయగలుగుటకు కారణము శ్రీరామచంద్రుని కృపయే... నేడిచ్చట విభీషణుడు లంకేశ్వరుడుగ పట్టాభిషిక్తుడైనాడు. శ్రీరామచంద్రుడు "విభీషణ పట్టాభిషేకమును అత్యంత వైభవోపేతముగ జరిపించుము" అని లక్ష్మణస్వామిని ఆదేశించి పంపినాడు. లక్ష్మణస్వామితో సుగ్రీవుడును నేనును అంగదుడును మరికొందరు వానర యోధులును వచ్చి సాయపడినాము. మేమందరమిప్పుడు శ్రీరామ ప్రభువు సమక్షమునకు తిరిగి పోయెదము. రామప్రభువునకు నీ కుశలవార్తను విన్నవించెదను.
.jpg)
హనుమంతుడు సీతాదేవి వీడ్కోలును పొంది తిరిగివచ్చి లక్ష్మణ బృందమును చేరుకొన్నాడు. విభీషణుని పత్ని నామధేయము 'సరమా దేవి'.
విభీషణుడు: దేవీ "సీతాదేవిని నీ సమక్షమునకు నేను స్వయముగ తీసికొని వచ్చెదన"ని శ్రీరామచంద్రునకు మాట ఇచ్చినాను. ఆ సాధ్వీమణి నిన్నెఱుగునా?
సరమాదేవి: ఎఱుగుట మాత్రమే కాదు. ఈ శత్రు మధ్యమున తనకు ఆప్తురాలను అన్న నమ్మకమామెకు నాపై కలిగినది. ఎట్లు కలిగినదో వివరించెదను వినుము... నేను రామ రావణ సంగ్రామము ప్రారంభమైన నాటి నుండియూ ప్రతి దినమును రణభూమినేమి జరుగుచున్నదో తెలిసికొనుచుండెడి దానను...
...ఒకనాడు శ్రీరాముడు నీ అగ్రజునితో "రావణా నీ యందలసట గోచరించుచున్నది. ఇప్పుడు యుద్ధమును ఆపుదము. నీవు నీ సదనమునకు పోయి విశ్రమించి రేపు రమ్ము" అని వచించినాడట. నేను శ్రీరాముని యౌదార్యమును లోలోపల మెచ్చుకొనుచు కూర్చొని యుండగా త్రిజట వచ్చినది.
విభీషణుడు: త్రిజట ఎవరు?
సరమాదేవి: అశోక వనమున సీత చుట్టును ఉన్న కావలి స్త్రీలలో నొక్కతె. త్రిజటకు సీతాదేవిపై సానుభూతి మెండు... ఆమె ఆందోళనతో "దేవీ నేడు రావణ ప్రభువు అశోకవనమునకు వచ్చి సీతతో, నీ రాముని నేను రణమున వధించినాను. ఇంక నీవు వానిని విస్మరించి నన్ను వరించి సుఖించుము' అని వచించినాడు. ఆమె నమ్మలేదు. అప్పుడు రావణ ప్రభువు తన పరివారము లోని విద్యుజ్జిహ్వునకు కబురు పంపినాడు. దేవీ ఆ మాయావిని నీ వెఱుగుదువు కద. వాడు రక్తము కాఱుచున్న ఒక మానవ శీర్షము (తల)తో ప్రవేశించినాడు. సీతాదేవి ఆ శిరము తన నాథునిదే అని భ్రమించి హృదయ విదారకముగ నేడ్చుచున్నది. ఆమె ప్రాణములను వదలివేయునేమో అన్న భయము కలిగి ఏమి చేయటకును తోచక నీకు తెలుపుటకు వచ్చినాను" అని చెప్పినది. నేనామెను "రావణుడునూ విద్యుజజీహ్వుడునూ అచ్చటనే యున్నావా?" అని అడిగినాను. ఆమె "రావణ ప్రభువునకు కొలువు కూటము నుండి కబురు వచ్చినది. ఉద్యోగి ఒకడే తెంచి 'ప్రభూ మంత్రులు మీ కొఱకెదురు చూచుచున్నారు అని చెప్పగా ప్రభువు వెడలినాడు. శిరమును సీత ముందు విడిచి విద్యుజజీహ్వూడునూ ప్రభువు వెంట పోయినాడు" అని తెలిపినది... నేను త్రిజటతో అశోక వనమునకు పోయినాను. రోదించుచున్న సీతాసాధ్విని దరికి చేర్చుకొని చీరకొంగుతో ఆమె కన్నీరును తుడిచి 'అమ్మా! శ్రీరాముడు క్షేమముగా నున్నాడు. ఈ తల మాయా కల్పితము. కొన్ని నిమిషములలో మనము చూచుచుండగనె ఈ శిరము అదృశ్యమగును' అని చెప్పినాను. ఆ శీర్షము మాయమగుటతోనే ఆమె సంతోషముతో 'కరుణామయ, నీవెవరవు?' అని అడిగినది. 'శ్రీరామచంద్రుని శరణుజొచ్చి ఆ ధర్మపరుని కృపకు పాత్రుడైన విభీషణుని ధర్మపత్నిని. నా పేరు 'సరమ' అని చెప్పినాను. ఆమె నాకాప్తురాలవు!' అనుచు నన్ను గాఢముగ కౌగిలించుకొన్నది.
విభీషణుడు: సరమా నీవు పోయి శ్రీరాముని సతికి చెఱ విముక్తిని కలిగించి తీసికొనిరమ్ము.
సరమాదేవి పల్లకిలో పోయి జానకి నందు కూర్చుండబెట్టుకొని రాజభవనమునకు తిరిగి వచ్చినది.
* * *
