లంక ముట్టడి
సుగ్రీవుడు వానర సేనను అనేక విభాగములుగ విభజించి ప్రతి విభాగమునకునూ వీరుడునూ రణ విద్యా ప్రవీణుడునూ అగు ఒక సేనానిని నియమించి నాడు. శూరాగ్రేసరుడగు 'నీలుడు' అగు ప్లవంగ పుంగవుని సర్వసేనాధిపతిగ నిర్ణయించినాడు.
శ్రీరాముడు వాలినందనునితో "అంగదా, యుద్దము జరిగినచో ఉభయ పక్షములందును యోధులెందరో ప్రాణములను కోల్పోవుదురు. సంగ్రామము ఎన్నియో అరిష్టములకు పూనుకొనరాదు. కనుక నీవు రావణుని కడకేగి వాడు సంధికి ఒడబడునేమో ప్రయత్నించి చూడుము" అన్నాడు. అంగదుడు పోయి రావణుని ముందు నిలిచి "దానవేంద్రా నేను శ్రీరామ చంద్రుని రాయబారి నీ సన్నిధికి వచ్చినాను. నీ ప్రాణములనూ నీవారి ప్రాణములనూ కాపాడుకొనుటకు శ్రీరాముడు నీకు అంతిమ అవకాశము నిచ్చినాడు. నీవు పశ్చాత్తప్తుడవుకమ్ము; సీతాదేవిని శ్రీరామునకర్పించి ఆయన క్షమాపణమును కోరుకొనుము. శరణాగత త్రాతయగు రామప్రభువు నిన్ను కరుణించి వదలివేయును. దైత్య కులమును వినాశము నుండి రక్షించుకొనుము "అని వచించినాడు.
ఇట్టి హితోపదేశమును మున్ను రావణునకు హనుమంతుడు చేసినాడు. పిమ్మట విభీషాణుడునూ చేసినాడు. రావణుడాగ్రహవేశాముతో వారిని అవమానించివాడే కాని వినలేదు. ఇప్పుడనూ అట్లే జరిగినది. రావణుడు రాయబారిగా వచ్చిన అంగదుని 'పట్టుకొని వధించుడు' అని తన భటులను ఆదేశించినాడు. పట్టుకొన వచ్చిన భటులను వాలిపుత్రుడు తన ముష్టి ఘాతములతో వారించి ఒక్క గంతున ఎగిరిపోయి రావణుని కోట కావల వ్రాలినాడు. ఆ మహాబలుడాగ్రహ ముతో కోట బురుజును విరుగదన్నీ పడగొట్టి పిమ్మట పోయి రాముని సన్నిధిని నిలిచినాడు.
'రామాప్రభూ నా రాయబారము ఫలించలేదు' అని జరిగినదంతయూ విన్నవించినాడు.
శ్రీరాముడు: ఫలించలేదని వగవకుము. మన విధిని నిర్వహించినాము...నీవు పోయి సుగ్రీవునితో మ్,మన సేనను మైదానమున ప్రవేశపరచి మోహరించుమని చెప్పుము.
వానరసేనా విభాగములు సముద్ర తరంగముల వలె ఒకదాని వెనుక నొకటి మైదానమును ప్రవేశించుచుండగా 'మాల్యవంతుడు ' అను రాక్షసోత్తముడు తిలకించినాడు. ఆ వృద్ద దైత్యుడు రావణుని పినతల్లి జనకుడు. రావణుని శ్రేయోభిలాషియగు అతడు దానవేంద్రుని సమక్షమున నిలిచి "మనుమడా, తరంగిణివలె ఉరకలు పరుగులు తీయుచు వచ్చుచున్న ఆ వనచర సేనను గమనించితివా? దానిని నీ దండుతో నిరోదించలేవు. యుద్దమెందులకు? నీవు తెచ్చిన సీత పతివ్రత. ఆమె నిన్ను వరించునన్న అడియసను వదలి ఆమెను తీసికొనిపోయి ఆమె భర్తకు అప్పగించుము. పిమ్మట నిశ్చింతగా నీ దానవ సామ్రాజ్యము నేలుకో నుము. అసుర కుల క్షయకారకమగు ఈ సంగ్రామమును సంభవించనీయకుము" అన్నాడు. రావణుడు చిరాకును చూపుచు "తాతా ముదిమి నీబుద్దిని బుగ్గిచేసినది! శత్రువును నా ముందు పొగడుచున్నావు! నా విషయమున జోక్యమును కలిగించకొనకుము. పోయి నీ పూజా పునస్కారములలో నిమగ్నుడవు కమ్ము" అన్నాడు. మాల్యవంతుడు తనలో 'ఈ వివేకహీనునకు నా హిత వచనములు రుచించలేదు!' అనుకోనుచు అచట నుండి నిష్ర్కమించినాడు.
రావణుడు అంగదుడు పడగొట్టిన కోట బురుజును చూచి' ఈ బురుజు పతనము నాకు అపశకునముగా తోచుచున్నది' అని కలవరపడినాడు. రాముని బాణమొకటి అత్యంత వేగమున వచ్చి కోట గుమ్మము నకు తగిలినది. ఆ శబ్దమును విని రావణుడు ఉలికిపడి, 'ఆ నరుడు రాముడు నన్ను రణమునకు రామ్మనుచున్నాడు. నేను సేనతో పోయి నేడే వాని నెదుర్కొని వధించెదను' అని లేచినాడు.
వానరసేయూ దానవ సేనయూ ఒండోంటితో తలపడినది. వానరులుగా జన్మించిన దేవతలు 'రావణుడు సీతాదేవి వపహరించి శ్రీరామునకు అపచారమును చేసినాడు. ఆ అధర్మపరుని వధించుటకు మనము శ్రీరామునకు తోడ్పడవలెను' అన్న పట్టుదలతో ముందుకు ఉరికినారు. దానవ యోధులలో ఉత్సాహము కనబడుటలేదు. 'అశోక వనమున అసుర స్త్రీల నడుమ ఇడుమలు పడుచున్న సీతా మహాసాధ్వి ఉసురు మనకు తగులకపోదు!' అన్న భయము వారిని వేదించుచున్నది.వానరుల తమ శాఖలనూ, పాషాణములనూ, పర్వత శిఖరములనూ ఆయుధములుగా కొనిపోయి దానవ సైనికులను మోది ఎందరినో సంహరించినారు.... రణరంగమున అధికసంఖ్యలో పడియున్న అసురయోధుల కళేబరములను చూచి రావణుడు దుఃఖించినాడు.
ఇంద్రజిత్తు రావణునితో 'తండ్రీ, వగవకుము. నేను పోయి వానరులను నిశ్శేషముగ సంహరించెదను' అన్నాడు. రావణుడు సంతసించి, ఇంద్రజిత్తును 'విజయోస్తూ!' అని ఆశీర్వదించి పంపినాడు.
ఇంద్రజిత్తురణరంగమునకు పోలేదు. ఆ మాయావి ఒక మేఘము మాటున నిలిచి విజయోత్సాహముతో నున్న వానర సేనపై బ్రహ్మస్త్రమును ప్రయోగించినాడు. ఆ అస్త్రము రాముడు చూచుచుండగనే లక్షల సంఖ్యలో వానర వీరులను నేలకూల్చినది. రాముడు చేతులను జోడించి "అస్త్ర రాజమా, నీకు నమస్కారము ధర్మవరులును నా అనుచరులును అగు ఈ వనచరులపై నిన్ను ప్రయోగించిన ఆ అజ్ఞాత శత్రువు ఎవరు?" అని ప్రశ్నించినాడు. రామునిచే గారవించబడిన బ్రహ్మాస్త్రమింక వనచరుల జోలికి పోకుండను మరలిపోయినది. అల్పకాలమున అసల్ప సంఖ్యలో ధరణిపై బడియున్న ప్లవంగ యోధుల కళేబరములను చూచుచూ రాఘవుడు దుఃఖము నాపుకొనలేకపోయినాడు. 'సమరమున ప్రధమ దివసముననె మిమ్మందరిని కోల్పోయిన నేను దురదృష్టివంతుడను!' అని విలపించుచున్న అతని సమక్షమున జాంబవంతుడు నిలిచి 'రామప్రభూ , ఈ వానర వీరులు ప్రాణావశిష్టులై మూర్భయందున్నారు కాని విగతజీవులు కారు. క్షీరసాగరము చెంతనున్న ద్రోణగిరి యందు కల యోషధులతో వీరి ప్రాణములను కాపాడగలము. హనుమంతుని పంపి ఆ యోషధులను తెప్పించుము' అన్నాడు.
శ్రీ రాముడు తేరుకొని లేచి హనుమంతుడు వద్దకు పోయి అతని చేతులను తన హస్తములందు చేర్చుకొని 'మిత్రమా మూర్భాగతులైన వానరుల ప్రాణరక్షణమిప్పుడునీ చేతుల యందున్నది. ఆ యోషధులను తెచ్చి జాంబవంతునకిమ్మని నిన్ను ప్రార్ధించుటకు వచ్చినాను' అన్నాడు. హనుమంతుడు 'రామప్రభూ నీ దాసుడనగు నన్ను నీ వాదేశించవలెను గాని ప్రార్ధించుట ఏమి?' అనుచూ చేతులను విడిపించుకొని మరుక్షణముననె పైకెగిరి ఆకాశ మార్గమున అత్యంత వేగమున పోయి ద్రోణగిరిని చేరుకొన్నాడు. 'ఓషధు లన న్వేషించుట కాగినచో ఆలస్యము మగును' అని తోచి ఆ వివేకవంతుడును బలవంతుడును అగు హనుమంతుడు ద్రోణాద్రిని పెకలించి హస్తముందుంచుకొని తిరుగు ప్రయాణమును శ్రీఘ్రగతిని ,ముగించి గిరిని జాంబవంతుని ముందుంచినాడు. భల్లుకేశ్వరుడు తనకు కావలసిన యోషధులను తీసికొని రణస్ధలిని ప్రవేశించి ప్రాణావశిష్టులై మూర్భయందున్న ప్లవంగ విరులనం దరను రక్షించినాడు. వారు నిద్ర నుండి మేల్కొనిన వారివలె లేచి తక్కిన వనచర యోధులను ఆనందాబ్దిని ముంచెత్తినారు. శ్రీ రాముడత్యంత సంతోషముతో వాయుపుత్రునీ భల్లూకవతినీ అభినందించి ధన్యవాదములు తెలిసివాడు.
రామలక్ష్మణులకును వానరాధివుడు సుగ్రీవునకును సంగ్రామమున ప్రథమ దివసమట్లు సుఖాంతముగా ముగిసినది.
* * *
